న్యూయార్క్లో అనుమానిత విమానం: యూఎన్ సమావేశం: చైనాకు బైడెన్ స్వీట్ వార్నింగ్..!!
వాషింగ్టన్: అసలే సెప్టెంబర్ నెల.. సెప్టెంబర్ నెల వస్తే అమెరికా భద్రతాపరంగా ఒక్కింత ఆందోళన చెందుతుంది. 9/11 దాడులు ఇంకా అగ్రరాజ్యం మరువలేదు. సెప్టెంబర్ నెలలో అమెరికాపై దాడులు జరుగుతాయంటూ అప్పుడప్పుడూ ఉగ్ర సంస్థల నుంచి హెచ్చరికలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే న్యూయార్క్ నగరంలో అనుమానాస్పద రీతిలో ఓ చిన్న ఎయిర్క్రాఫ్ట్ ప్రవేశించిందని సమాచారం. ఆ సమయంలో న్యూయార్క్ నగరంలో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలు జరుగుతున్నాయి. ప్రపంచదేశాల నుంచి నేతలు అధినేతలు హాజరయ్యారు. అంతేకాదు ఈ సమావేశం జరుగుతున్న ప్రాంతంలో నిషేదాజ్ఞలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ ఓ చిన్న విమానం దూసుకురావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
సెస్నా 182 అనే చిన్నపాటి విమానం న్యూయార్క్ నగరంలో తాత్కాలిక నిషేదాజ్ఞలు కొనసాగుతున్నఓ ప్రాంతంలో మంగళవారం స్థానిక కాలమాన ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు దూసుకొచ్చింది. దీన్ని గమనించిన అమెరికా ఎయిర్ఫోర్స్ వెంటనే ఎఫ్-16 ఫైటర్ జెట్ విమానంతో వెంబడించి దాన్ని అక్కడి నుంచి తరిమివేసినట్లు నార్త్ అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్కు చెందిన ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ స్పష్టం చేసింది. న్యూయార్క్ నగరంలో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సమావేశ ప్రాంతంలో సోమవారం నుంచే నిషేధాజ్ఞలు ఆంక్షలు విధించారు. హడ్సన్ నది, ఈస్ట్ రివర్లు కూడా ఆంక్షల పరిధిలోకి వచ్చాయి.
76వ ఐక్యరాజ్యసమితి సమావేశాల సందర్భంగా ఈ ఘటన జరిగింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఐక్యరాజ్యసమితి సమావేశంలో ప్రసంగించి ఆ తర్వాత ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ ఇరాక్ అధ్యక్షుడు బర్హామ్ సాల్హే తో భేటీ అయ్యాక న్యూయార్క్ సిటీ నుంచి బయలుదేరారు. బయలు దేరిన కాసేపటికే ఈ ఘటన చోటుచేసుకుందని స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది.
అంతకుముందు జో బైడెన్ ఐక్యరాజ్యసమితిలో ప్రసంగిస్తూ చైనాకు ధీటైన సమాధానం ఇచ్చారు. అమెరికా చైనాతో యుద్ధం కోరుకోవడం లేదని తెలిపారు. రెండు దేశాల మధ్య సైలెంట్గా పెరుగుతున్న ఆందోళనల గురించి పరోక్షంగా చైనాకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జో బైడెన్. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దురాగతం ఎక్కువైన నేపథ్యంలో జో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే చైనా దుస్సాహసాలు ఎంతో కాలం నడవవని కూడా పరోక్షంగా జోబైడెన్ హెచ్చరించారు.
అఫ్గానిస్తాన్ గురించి కూడా తన ప్రసంగంలో ప్రస్తావన తీసుకొచ్చారు జో బైడెన్. అఫ్గానిస్తాన్లో అమెరికా సుదీర్ఘకాలంగా చేస్తున్న యుద్ధానికి చెక్ పెట్టినట్లు బైడెన్ ప్రకటించారు. ఇక నుంచి అఫ్గానిస్తాన్లో దౌత్యపరమైన చర్చలే ఉంటాయని స్పష్టం చేశారు. ఇవి నిరంతరం కొనసాగుతాయని వివరించారు. మన సొంత ప్రజలకు మేలు చేయాలంటే ప్రపంచ దేశాలతో లోతైన సత్సంబంధాలు కలిగి ఉండాలని ఆయన నొక్కి చెప్పారు. అఫ్గానిస్తాన్లో 20 ఏళ్ల సుదీర్ఘ పోరాటాన్ని ముగించాం అని చెప్పారు.
"ఎడతెగని ఈ యుద్ధానికి ముగింపు పలికి, ఎడతెగని దౌత్యపరమైన చర్చలకు సిద్ధం అవుతున్నాం.మా వద్ద ఉన్న అభివృద్ధి మంత్రాన్ని వినియోగించి ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలకు మేలు చేస్తాం. అఫ్గానిస్తాన్లోని ప్రజలకు ఏ విధంగా మేలుచేయాలి, ఎలా అండగా నిలవాలనేదానిపై ఐక్యరాజ్యసమితి తీర్మానం చేసింది. అదే సమయంలో తాలిబన్ల నుంచి ఎలాంటి సహకారం కోరుకుంటోందో తెలియపరిచింది " అని బైడెన్ చెప్పారు.
మహిళల హక్కులను కాపాడాలని, హింస నుంచి అమ్మాయిలు స్వేచ్ఛవైపు పరుగులు తీయాలని అలా జరిగేందుకు అన్ని దేశాలు కృషి చేయాలని జో బైడెన్ చెప్పారు. ఉగ్రవాదం నుంచి తమను తాము కాపాడుకుంటూనే తమ మిత్రదేశాలకు సైతం అండగా నిలుస్తామని జో బైడెన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఇక కోవిడ్ పై పోరుకు ప్రపంచ దేశాలు కలిసి ముందుకు రావాలని బైడెన్ కోరారు. వాతావరణ మార్పులు, టెక్నాలజీ, వాణిజ్యంపై చర్చలు జరపాలని ఆయన కోరారు. కరోనా కారణంగా ప్రపంచం ఎంతో కోల్పోయిందని చెప్పిన బైడెన్... మనిషి మనుగడే కష్టంగా మారిందని చెప్పుకొచ్చారు. దాదాపుగా 4.5 మిలియన్ మంది ఈ రోజుల ప్రపంచవ్యాప్తంగా మృతి చెందారని వారందరికీ ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నట్లు చెప్పారు. ప్రతి మరణం మరొక వ్యక్తికి గుండెపగిలేలా చేసిందని చెప్పారు.
ప్రపంచానికి ఈ దశాబ్దం పెద్ద సవాలు అని పేర్కొన్న బైడెన్ మన భవిష్యత్తును నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని వెల్లడించారు. ప్రపంచాన్ని భవిష్యత్తులో మెరుగ్గా తీర్చిదిద్దుకునేందుకు ప్రతిఒక్కరం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇక సమయం వృథా చేయకుండా అంతా కలిసి పనిచేయాలని బైడెన్ పిలుపునిచ్చారు.