డ్రగ్స్, డబ్బులకు బేబి సేల్: ఫేస్ బుక్ లో ప్రకటన
అట్లాంటా: పుట్టబోయే బిడ్డను అమ్మకానికి పెట్టింది ఒక తల్లి. ఆ తల్లికి తిండికి లేక కాదు, కేవలం డబ్బు, డ్రగ్స్ ఇస్తే తనకు పుట్టబోయే పండంటి బిడ్డను ఇస్తానని ప్రకటన ఇచ్చింది. ఆ ప్రకటన ఫేస్ బుక్ లో రావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు.
ఇలాంటి తల్లి మీద కఠిన చర్యలు తీసుకోవాలని అట్లాంటా పోలీసులకు ఫిర్యాదులు చేశారు. విషయం తెలుసుకున్న జార్జియా బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ (జీబీఐ) అధికారులు రంగంలోకి దిగారు. సైబర్ క్రైం పోలీసులు ప్రకటన ఎక్కడి నుండి వచ్చింది అని కూపీలాగుతున్నారు.
అమెరికాలోని జార్జియా రాష్ట్రంలోని అట్లాంటాలో ఓ తల్లి క్రయిగ్ లిస్ట్ అట్లాంటా ఫేస్ బుక్ లో ఇటీవల ఒక ప్రకటన ఇచ్చింది. "నేను ఆరు నెలల గర్బవతిని, తెల్లటి పండంటి బిడ్డకు జన్మనిస్తున్నాను, అయితే ఆ బిడ్డ నాకు అవసరం లేదు, తనకు డ్రగ్స్, డబ్బు ఇచ్చిన వారికి నా బిడ్డను అప్పగిస్తాన"ని సమాచారం ఇచ్చింది.
ఈ ప్రకటన సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. బిడ్డను విక్రయించడానికి ఆ తల్లి తీసుకున్న నిర్ణయం మీద పలువురు మండిపడ్డారు. సోషల్ మీడియాలోనే పోలీసులకు ఫిర్యాదులు చేశారు. సుమారు 100 మందికి పైగా స్వయంగా ఫోన్లు చేసి ఆ తల్లి మీద ఫిర్యాదులు చేశారని పోలీసు అధికారులు చెబుతున్నారు.