5 ఏళ్లలోపు పిల్లలపై ప్రభావం- రెండవ అత్యధిక ఇన్ఫెక్షన్ : దక్షిణాఫ్రికా..!!
ప్రస్తుతం కోవిడ్ పాజిటివ్..వైరస్ కేసులు అయిదేళ్ల లోపు వయసు ఉన్న పిల్లలపైన ఎక్కువ ప్రభావం చూపుతున్నట్లుగా దక్షిణాఫ్రికా చెబుతోంది. ఆ దేశ ఆరోగ్య మంత్రి జో ఫాహ్లా దీని పైన ఆందోళన వ్యక్తం చేసారు. తొమ్మిది ప్రావిన్సులలో ఏడింటిలో ఇన్ఫెక్షన్లు.. పాజిటివిటీ రేట్లు పెరుగుతున్నాయని వెల్లడించారు. శుక్రవారం రాత్రి దేశంలో మరో 16,055 ఇన్ఫెక్షన్లు మరియు 25 మరణాలు నమోదయ్యాయి. అయితే, చిన్న పిల్లలలో పెరుగుతున్న కోవిడ్ -19 ఇన్ఫెక్షన్ల గురించి దక్షిణాఫ్రికా నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.
గతం కంటే భిన్నంగా వైరస్ వ్యాప్తి
గతంలో కోవిడ్ మహమ్మారి కారణంగా పిల్లలపైన పెద్దగా ప్రభావం కనిపించ లేదని.. అయితే, ఇప్పుడు మాత్రం అయిదేళ్ల లోపు పిల్లలతో పాటుగా... 15 నుండి 19 సంవత్సరాల వయస్సు గల యువతో ఎక్కువగా వైరస్ కేసులు గుర్తిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నాల్గవ వేవ్ గా పేర్కొంటున్న దక్షిణాఫ్రికా ప్రభుత్వం.. అన్ని వయసుల వారిలోనూ ప్రభావం కనిపిస్తోంది..
అయితే, తక్కువ వయసు ఉన్న వారిలో ఎక్కువగా కేసులు పెరగుదల గుర్తించినట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేబుల్ డిసీజెస్ కు చెందిన డాక్టర్ వాసిలా జస్సత్ వెల్లడించారు. అయిదేళ్లలోపు పిల్లల పైన ఈ స్థాయిలో ప్రభావం చూపటం ఇది రెండో సారని వివరించారు. అదే విధంగా 60 ఏళ్ల పైబడగిన వారి పైన ప్రభావం ఉందన్నారు.
అయిదేళ్ల లోపు చిన్నారులపై ప్రభావం
ఇక, ఈ వైరస్ కారణంగా గతంలో చూడని విధంగా..ఆస్పత్రుల్లో అయిదేళ్ల లోపు పిల్లల చేరికలు ఎక్కువగా ఉన్నాయని వివరించారు. దీని పైన మరింత అధ్యయనం..వైరస్ పైన పరిశోధన అవసరమని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేబుల్ డిసీజెస్ కు చెందిన డాక్టర్మిచెల్ గ్రూమ్ చెప్పారు. అయితే, ఇది ఇంకా ప్రారంభ దశలోనే ఉందని...రానున్న రోజుల్లో వీరిని మరింతగా పర్యవేక్షిచటం ద్వారా స్పష్టత వస్తుందని చెప్పుకొచ్చారు.
ఈ పరిస్థితులను ఎదుర్కోవటానికి ఆస్పత్రుల్లో పిల్లలకు బెడ్స్ ఏర్పాటుతో పాటుగా సిబ్బందిని సమాయత్తం చేసుకోవాలని అంశాన్ని తాము ప్రత్యేకంగా నివేదిస్తామని చెప్పారు. రోజు వారీ ఇన్ఫెక్షన్లలో 80 శాతం వరకు ఎక్కువగా ప్రభావితం అవుతున్నారని గౌటెంగ్ ప్రావిన్స్లోని ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎన్ట్సాకిసి మలులేకే ఆందోళన వ్యక్తం చేశారు.
కొత్త ఇన్ ఫెక్షన్ల పైన అధ్యయనం
చిన్న వయసు వారితో పాటుగా.. గర్భిణీ స్త్రీలు పెరిగిన ఇన్ఫెక్షన్ అంశాన్ని పరిశోధించాల్సి ఉందన్నారు. రాబోయే రోజుల్లో ఈ వయసు గ్రూపుల్లో ఈ వైరస్ ఎక్కువగా వ్యాపించటానికి ఉన్న కారణాలను గుర్తిస్తామని ధీమా వ్యక్తం చేసారు. టీకాలు వేయని వారికి.. 40 ఏళ్లలోపు యువకులు ఆసుపత్రిలో చేరుతున్నారని, వీరిలో ఎక్కువ మంది టీకాలు వేయలేదని ఫాహ్లా చెప్పారు.
ప్రస్తుత పరిస్థితుల్లో కొద్దిపాటి అనారోగ్యానికి గురైన వారిని సైతం ఆరోగ్య సంరక్షణ సిబ్బంది మరింత జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ వైరస్ వ్యాప్తి గురించి పరిశోధనలు జరుగుతున్నాయని.. వాటి ఫలితాలు వచ్చిన తరువాతనే పూర్తిగా కార్యాచరణ ప్రకటనకు అవకాశం ఉంటుందని ప్రభుత్వంలోని ముఖ్యులు స్పష్టం చేస్తున్నారు.