కల్పించుకుంటే యుద్ధమే, చెత్తబుట్టలో వేయండి: చైనా
బీజింగ్: దక్షిణ చైనా సముద్రంలో తమ ఆధిపత్యం విషయమై అంతర్జాతీయ న్యాయస్థానంలో తనకు చుక్కెదురు కావడంపై చైనా ఘాటుగా స్పందించింది. ఈ సముద్రంపై పెత్తనాన్ని ఆపాలని హేగ్ మధ్యవర్తిత్వ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును అంగీకరించేది లేదని చైనా స్పష్టం చేసింది.
ఒకటికి రెండుసార్లు హెచ్చరికలు జారీ చేసింది. ఈ వివాదంలో తమ హక్కులకు భంగం వాటిల్లేలా చేయాలని ఏ దేశం ప్రయత్నించినా దక్షిణ చైనా సముద్రం ఓ యుద్ధభూమిగా మారుతుందని ఆ దేశ విదేశాంగ శాఖ సహాయమంత్రి లియూ జెన్ మిన్ తాజాగా హెచ్చరించారు.
యూఎన్ ట్రైబ్యునల్ తీర్పును ఆమోదించాలని తమకు ఓ డజను దేశాలు సలహాలు ఇస్తున్నాయని, ఆ దేశాల అభిప్రాయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం తమకు లేదని పేర్కొంది. సముద్రంలో 90 శాతం తమదేనని ఆయన స్పష్టం చేశారు.

యూఎస్ సహా పలు యూరప్ దేశాలు చైనా వ్యవహారాల్లో కల్పించుకోవాలని చూస్తున్నాయని, దీనిని తాముఎట్టి పరిస్థితుల్లో సహించబోమన్నారు. అయితే, అంతర్జాతీయ చట్టాలకు లోబడే ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని భావిస్తున్నామన్నారు. అయితే, తమకు అన్యాయం జరిగే తీర్పులు ఇస్తే ఎలా అంగీకరిస్తామన్నారు.
సముద్ర గగన తలంలో విమానాల రాకపోకలపై ఆంక్షలు పెడతామని, ఈ ప్రాంతాన్ని ఎయిర్ డిఫెన్స్ జోన్గా ప్రకటించేందుకు వెనుకాడబోమని అంతకుముందు రోజు లియూ జెన్ మిన్ హెచ్చరించారు.
దక్షిణ చైనా సముద్రంపై తన చారిత్రక హక్కును తోసిపుచ్చిన శాశ్వత మధ్యవర్తిత్వ న్యాయస్థానం(పీఏసీ) తీర్పును చెత్తబుట్టలో వేయాలని చైనా వ్యాఖ్యానించింది. తీర్పును అమలుచేసే ప్రసక్తే లేదని చెప్పింది. రెండు వేల సంవత్సరాలుగా ఈ సముద్రమంతా చైనా ప్రాబల్యంలోనే ఉందని, 1970లో ఫిలిప్పీన్స్ తమ భూభాగాన్ని ఆక్రమించిందని ఆరోపించింది.
తేల్చాల్సిన అసలు వివాదం ఫిలిప్పీన్స్ దురాక్రమణేనని తెలిపింది. ఈ ప్రాంతంలో నౌకాయాన, విమానయాన స్వేచ్ఛను కాపాడేందుకు తమ బలగాలు తగిన చర్యలు తీసుకుంటాయని ప్రకటించింది.
పీఏసీ తీర్పును ఆధారంగా చేసుకొని ప్రతిపాదించిన ఏ చర్యనూ చైనా అంగీకరించబోదని పేర్కొంది. తమ భౌగోళిక సార్వభౌమాధికారానికి, సముద్రంలో యోజనాలకు ఈ తీర్పుతో ఎలాంటి ముప్పు వాటిల్లదన్నారు. కాగా, తీర్పును చైనా గౌరవించాలని పిలిప్సీన్ సూచించింది. భారత్ ఈ వివాదానికి దూరంగా ఉంది.












Click it and Unblock the Notifications