కరోనా : స్పెయిన్లో ఎందుకింత మృత్యు ఘోష.. లాక్డౌన్కి ముందు అసలేం జరిగింది..
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ధాటికి విలవిల్లాడుతోన్న దేశాల్లో చైనా, ఇటలీ,అమెరికా, స్పెయిన్, ఇరాన్,ఫ్రాన్స్ ముందు వరుసలో ఉన్నాయి. ఈ దేశాల్లో కరోనా మృతుల సంఖ్య ఇప్పటికే 1000 మార్క్ దాటగా.. ఇటలీలో 10వేలకు చేరువవుతోంది. విచిత్రమేంటంటే.. చైనా,అమెరికా,ఇరాన్ కంటే తర్వాత ఎఫెక్ట్ అయిన స్పెయిన్లో పరిస్థితి దారుణంగా ఉంది. మృతుల సంఖ్యలో ఆ దేశం ఇప్పుడు చైనానే దాటేసింది. ఇప్పటివరకు అక్కడ 49,515 పాజిటివ్ కేసులు నమోదవగా.. 3647 మంది మృతి చెందారు. గంటగంటకు కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండటం.. స్పెయిన్ కూడా మరో ఇటలీ కాబోతుందా అన్న సందేహాలను రేకెత్తిస్తోంది. అసలు స్పెయిన్లో ఈ స్థాయిలో వైరస్ విజృంభించడం వెనుక కారణాలేంటో ఒకసారి పరిశీలిద్దాం..

స్పెయిన్లో ఎందుకీ పరిస్థితి..
చైనాలో,ఇరాన్లో ఏం జరిగిందో స్పెయిన్ చూస్తూనే ఉంది. పక్కనే ఉన్న ఇటలీలో ఎంత భయానక ఉత్పాతం చోటు చేసుకుంటుందో కనిపిస్తూనే ఉంది. అలా అని.. ఇటలీ ద్వారా వైరస్ సంక్రమించిందని నిందించడానికి లేదు. ఎందుకంటే.. రెండు దేశాలను వేరే చేస్తూ మధ్యలో 400మైళ్ల మేర మధ్యధరా సముద్రం విస్తరించి ఉంది. ఇరు దేశాల మధ్య భూసరిహద్దులు లేనందువల్ల అక్కడినుంచి వైరస్ వ్యాప్తికి అవకాశం లేదు. మరోవైపు పక్కనే ఉన్న ఫ్రాన్స్,స్విట్జర్లాండ్,ఆస్ట్రియా,స్లొవేనియా అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. కానీ స్పెయిన్ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. వైరస్ నియంత్రణ చర్యల్లో ఆలస్యం చేసింది. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లోని మెడికల్ ఎమర్జెన్సీ హెడ్ డా.ఫెర్నాండో సిమోన్.. దేశంలో కొన్ని కరోనా కేసులు మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని ఫిబ్రవరి 9న చెప్పారు. కానీ ఆరు వారాల తర్వాత.. ఇప్పుడు ఆయనే స్వయంగా వందల్లో మృతుల సంఖ్యను వెల్లడిస్తున్నారు. దేశంలో ప్రస్తుతం తలసరి మరణాల రేటు ఇరాన్ కంటే 3 రెట్లు, చైనా కంటే 40 రెట్లు ఎక్కువగా ఉంది.

అదే కారణమా..
ఈ ఏడాది ఫిబ్రవరి 19న ఇటలీలోని బెర్గామోలో జరిగిన సాకర్ ఛాంపియన్స్ లీగ్ గేమ్ కోసం స్పెయిన్కి చెందిన 2500 మంది వాలెన్సియా సాకర్ ఫ్యాన్స్, 40వేల మంది అట్లాంటా ఫ్యాన్స్ హాజరయ్యారు. ఇటాలియన్ నగర మేయర్ జార్జియో గోరి ఈ పరిణామాన్ని 'వైరస్ వ్యాప్తికి పేలిన బాంబు'గా అభివర్ణించారు. ఆ తర్వాత వాలెన్సియా సాకర్ ప్లేయర్స్,ఫ్యాన్స్,స్పోర్ట్స్ జర్నలిస్టులు కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం స్పెయిన్లో చలికాలం కావడం వైరస్ వ్యాప్తికి మరింత ఆస్కారం ఇచ్చింది. సాధారణంగా ఫిబ్రవరి చివరి నుంచి మార్చి ఆరంభం వరకు అక్కడ ఉష్ణోగ్రతలు 20డిగ్రీల కంటే తక్కువగా ఉంటాయి. దీంతో మాడ్రిడ్లోని పేవ్మెంట్ కేఫ్స్(వీధుల్లో ఒక పక్కన చైర్స్ వేసి ఉండే కేఫ్స్),బార్స్ జనాలతో కిటకిటలాడాయి.పైగా అక్కడి జనాల్లో ఆలింగనం,ముద్దులు,ముఖానికి దగ్గరగా మాట్లాడటం వంటి ఎక్కువ. ఇవన్నీ కలిసి అక్కడ వైరస్ మరింత విజృంభించేలా చేశాయి.

లాక్ డౌన్కు వారానికి ముందు..
స్పెయిన్లో లాక్ డౌన్ ప్రకటించడానికి సరిగ్గా వారం క్రితం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారీ ఎత్తున ప్రదర్శనలు,స్పోర్ట్స్ ఈవెంట్స్,రాజకీయ పార్టీల సదస్సులు జరిగాయి. మూడు రోజుల తర్వాత, లివర్పూల్లో జరిగిన మరో ఛాంపియన్స్ లీగ్ మ్యాచ్ కోసం సుమారు 3,000 మంది అట్లాటికో డి మాడ్రిడ్ అభిమానులంతా కలిసి వెళ్లారు. ఇవన్నీ వైరస్ వ్యాప్తికి కారణాలుగా కనిపిస్తున్నాయి. స్పెయిన్ సోషలిస్ట్ ప్రభుత్వానిధినేత పెడ్రో సాంచెజ్ కూడా ఆలస్యంగా స్పందించడం వైరస్ వ్యాప్తిని తీవ్రతరం చేసింది.
Recommended Video

మరింత విషాదం తప్పదా..
కరోనా వైరస్ కారణంగా స్పెయిన్లోని వృద్దాశ్రమాల్లో దాదాపు 20శాతం మరణాలు సంభవించాయి. ఆర్మీ పరిశీలనలో కొంతమంది వృద్దులు మంచాల కింద చనిపోయి ఉన్నట్టు గుర్తించారు. నిజానికి స్పెయిన్లో అద్భుతమైన ప్రాథమిక వైద్య సంరక్షణ వ్యవస్థ ఉంది. కానీ ఆర్థిక సంక్షోభం కారణంగా గత దశాబ్ద కాలంలో దానిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. పర్ క్యాపిటాకు మూడో వంతు ఆసుపత్రి పడకలు మాత్రమే ప్రస్తుతం స్పెయిన్లో ఉన్నాయి. అది కూడా జర్మనీ లేదా ఆస్ట్రియా అందిస్తున్నాయి. అయినప్పటికీ ఇది యూకె, న్యూజిలాండ్ లేదా యూఎస్ కంటే ఎక్కువే కావడం గమనార్హం. మాడ్రిడ్లో విద్యా సంస్థల మూసివేత తర్వాత చాలామంది దాన్నో హాలీ డేలా భావించడం.. బీచ్ హౌజ్లకు వెళ్లడం కూడా ఈ పరిస్థితికి కారణమైంది. ఏప్రిల్ 11న అక్కడ లాక్ డౌన్ పూర్తి కానుంది. అప్పుడే కొంతమంది మంత్రులు.. ఇక లాక్ డౌన్ ఎత్తివేత చర్యలను మొదలుపెట్టాలని అంటున్నారు. దీంతో స్పెయిన్లో మున్ముందు మరింత విషాదం తప్పదేమోనన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications