అయ్యో పాపం అన్నారా... జైలుకెళ్తారు.. జాగ్రత్త!
ఖతార్ కు అనుకూలంగా, సానుభూతితో కూడిన వ్యాఖ్యలతో వార్తలు ప్రచురించినా, సోషల్ మీడియాలో ప్రసారం చేసినా 3 నుంచి 15 ఏళ్ల వరకు జైలుశిక్ష లేదా 5 లక్షల దిర్హామ్స్ జరిమానా చెల్లించాల్సి ఉంటుందంటూ యూఏఈ తాజాగా న
దుబాయ్: గల్ఫ్ దేశాల నడుమ సంక్షోభం పతాకస్థాయికి చేరింది. ఇప్పటికే ఖతార్ కు విమాన సర్వీసులు రద్దు చేసిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఖతార్ కు అనుకూలంగా, సానుభూతితో కూడిన వ్యాఖ్యలతో వార్తలు ప్రచురించడాన్ని కూడా నిషేధించింది.
ఈ ఆదేశాలను అతిక్రమించి ఎవరైనా ప్రచురిస్తే 3 నుంచి 15 ఏళ్ల వరకు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని ప్రభుత్వం తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. ఈ విషయాన్ని యూఏఈకి చెందిన వార్తాపత్రికలు గల్ఫ్ న్యూస్, పాన్ అరబ్ చానెల్ అల్ అరేబియా వెల్లడించాయి.
'ఖతార్ పై సానుభూతిపరమైన వార్తలు ప్రచురించినా, రాతపూర్వకంగా, సోషల్ మీడియా, విజువల్స్ రూపంలో అయినా సరే వార్తలు ప్రచురించడానికి, ప్రసారం చేయడానికి వీల్లేదు..'అంటూ యూఏఈ అటార్నీ జనరల్ హమద్ సైఫ్ అల్ షామ్సి ఓ ప్రకటన విడుదల చేశారు.
నిషేధానికి విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారికి జైలు శిక్ష లేదా 5 లక్షల దిర్హామ్స్ జరిమానా విధించనున్నారు. ఉగ్రవాదులకు మద్దతిస్తోందని ఆరోపిస్తూ సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్తో పాటు మరికొన్ని దేశాలు ఖతార్తో సంబంధాలు తెంచుకున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే యూఈఏ ఖతార్కు వెళ్లే విమానాలను రద్దు చేసింది. ఖతార్లోని దోహాకు రాకపోకలు సాగించే విమానాలు తమ గగనతలాన్ని వాడుకోవడంపైనా యూఏఈ ఆంక్షలు విధించింది. ఇప్పుడు తాజాగా వార్తల ప్రచురణపై కూడా నిషేధం విధించింది.