మారణహోమం: నిలువెల్లా వణికిన బాగ్దాద్: జంట ఆత్మాహూతి దాడులు: 28 మందికి
బాగ్దాద్: ఇరాక్ రాజధానిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఉగ్రవాదులు మళ్లీ పేట్రేగిపోయారు.. మారణహోమానికి తెగబడ్డారు. కొన్ని నిమిషాల వ్యవధిలో ఆత్మాహూతి దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 28 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఫలితంగా- మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనే భయాందోళనలు వ్యక్తమౌతోన్నాయి. దీన్ని ఉగ్రవాద చర్యగా ఇరాక్ మిలటరీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.
కోవిషీల్డ్: సీరమ్ ఇన్స్టిట్యూట్లో భారీ అగ్నిప్రమాదం: దట్టంగా కమ్ముకొన్న పొగ: పీఎంఓ ఆరా?
బాగ్దాద్లో నిత్యం రద్దీగా ఉండే తయరాన్ స్క్వేర్లో ఈ మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు కొన్ని నిమిషాల వ్యవధిలో ఇదే ప్రాంతంలో ఆత్మాహూతి దాడికి పాల్పడినట్లు మిలటరీ అధికారులు ధృవీకరించారు. అత్యంత శక్తిమంతమైన పేలుడు వస్తువులను ధరించి.. రద్దీగా ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు. తమకు అనారోగ్యంగా ఉందని, సహాయం చేయాల్సిందిగా స్థానికులను అభ్యర్థించారు. దీనితో చాలామంది అటుగా వెళ్తోన్న వారు వారి వద్దకు చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో జనం గుమికూడుకున్నవెంటనే తమను తాము పేల్చేసుకున్నారు.
ఈ దృశ్యాలను ఓ వ్యక్తి సెల్ఫోన్లో బంధించాడు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది కాస్తా వైరల్గా మారింది. 2018లో తరయాన్ స్క్వేర్లోనే ఇదే తరహాలో ఆత్మాహూతి దళం సభ్యుల దాడులు చోటు చేసుకుంది. నాటి ఘటనలో 27 మంది మరణించారు. ఈ సారి ఈ సంఖ్య మరింత పెరిగింది. 2019లోనూ బాగ్దాద్లో సంభవించిన పేలుళ్లు పలువురిని పొట్టనబెట్టుకున్నాయి. ఉగ్రవాద ఏరివేత కార్యకలాపాలు కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో నిద్రాణంగా ఉన్న టెర్రరిస్టులు తరచూ తమ ఉనికిని చాటుకోవడానికి ఆత్మాహూతి దాడులకు పాల్పడుతున్నట్లు మిలటరీ అధికారులు భావిస్తున్నారు.
ఈ ఘటనకు తామే బాధ్యులంమంటూ ఏ ఉగ్రవాద సంస్థ ఇప్పటిదాకా ప్రకటించలేదు. అయినప్పటికీ.. ఇది ఉగ్రవాద చర్యగానే భావిస్తున్నామని మిలటరీ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేశారు. ఆత్మాహూతిదాడులు చోటుచేసుకున్న వెంటనే తయరాన్ స్క్వేర్తో పాటు పరిసర ప్రాంతాలను మూసివేసినట్లు తెలిపారు. దర్యాప్తు చేపట్టామని, ఇప్పటిదాకా అనుమానితులెవరినీ అదుపులోకి తీసుకోలేదని పేర్కొన్నారు.