యాపిల్ సంస్థకు 'గూగుల్' సుందర్ పిచాయ్ మద్దతు!
వాషింగ్టన్: ఐఫోన్ యూజర్ల వ్యక్తిగత ప్రైవసీ విషయమై ఎఫ్బిఐ, యాపిల్ సంస్థకు మధ్య జరుగుతున్న పోరాటంపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ స్పందించారు. ఉగ్రవాది సయేద్ ఫరూఖ్ ఐఫోన్ యాక్సెస్ను ఎఫ్బీఐకి ఇవ్వడానికి యాపిల్ నిరాకరించడాన్ని సుందర్ సమర్థించారు.
తద్వారా ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ నిర్ణయాన్ని గూగుల్ సమర్థించింది. యాపిల్ కంపెనీకి తన మద్దతు తెలుపుతున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ట్విట్టర్లో తెలిపారు. గత సంవత్సరం కాలిఫోర్నియాలోని శాన్ బెర్నార్డినోలో కాల్పులకు పాల్పడి పద్నాలుగు మంది మృతికి కారణమైన సయేద్ ఫారూఖ్ ఫోన్ అన్లాక్ చేసి ఇవ్వాల్సిందిగా ఎఫ్బిఐ అధికారులు యాపిల్ సంస్థను కోరారు.
అందుకు ఆపిల్ సంస్థ నిరాకరించింది. దీంతో ఇది చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ గురువారం నాడు స్పందించారు. నేరాలు, ఉగ్రవాదం నుంచి ప్రజలను కాపాడేందుకు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోందని తమకు తెలుసని తన ట్విట్టర్లో పేర్కొన్నారు.

వినియోగదారుల సమాచారానికి భద్రత కల్పించే ఉత్పత్తులను తాము రూపొందిస్తామని, హ్యాకింగ్కి ఎనేబుల్ చేయమని కంపెనీలపై ఒత్తిడి చేయడం వినియోగదారుల ప్రైవసీ విషయంలో రాజీపడడం అవుతుందన్నారు. సమాచారాన్ని భద్రంగా ఉంచే సురక్షితమైన ఉత్పత్తులు తయారుచేయడమే కాక చట్టపరమైన ఆదేశాలమేరకు డాటా యాక్సెస్కి అవకాశం కల్పిస్తామన్నారు.
అయితే కస్టమర్ డివైస్ని హ్యాక్ చేయమనడం పూర్తిగా వేరే విషయమన్నారు. ఇది భవిష్యత్తులో సమస్యలకు దారి తీస్తుందన్నారు. ఈ విషయంలో చట్టబద్దమైన ఆదేశాలు ఉంటే దర్యాఫ్తు సంస్థలకు ఈ డాటా యాక్సెస్ ఇస్తామని ట్వీట్ చేశారు. అయితే, హ్యాక్ చేసి సమాచారం ఇవ్వమనడం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications