Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీబీసీ ఇండియా కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారుల ‘సర్వే‘

దిల్లీలోని బీబీసీ కార్యాలయాలు గల భవనం వెలుపల పోలీసు అధికారులు

భారతదేశంలోని బీబీసీ కార్యాలయాల్లో ఇన్‌కమ్ టాక్స్ అధికారులు దర్యాప్తులో భాగంగా మంగళవారం నాడు సర్వే నిర్వహించారు. ఇది గురువారం కూడా కొనసాగుతున్నాయి.

బీబీసీ దిల్లీ, ముంబయి కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు ఇంకా ఉన్నారని 'బీబీసీ న్యూస్' వెల్లడించింది.

'దిల్లీ, ముంబయిలలోని బీబీసీ కార్యాలయాలలో ఆదాయపన్ను శాఖ అధికారులు ఉన్నారు. బీబీసీ సిబ్బందిలో చాలామంది ఆఫీసుల నుంచి వెళ్లిపోయినప్పటికీ తనిఖీల విషయంలో సహకరించేందుకు గాను ఆదాయపన్ను శాఖ అధికారులు కోరడంతో కొందరు సిబ్బంది మాత్రం ఆఫీసులలోనే ఉన్నారు.

ప్రస్తుత ఈ సమయంలో మా సిబ్బందికి అండగా ఉంటున్నాం, పరిస్థితులు వీలైనంత తొందరలో చక్కబడతాయని ఆశిస్తున్నాం. ఎప్పటిలాగే మా పాత్రికేయ సేవలు కొనసాగుతాయి, భారత్‌లోని మా పాఠకులు, వీక్షకులకు సేవలందించేందుకు కట్టుబడి ఉన్నాం' అని బీబీసీ న్యూస్ ఓ ప్రకటనలో పేర్కొంది.

https://twitter.com/ANI/status/1625725153887002626

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శనాత్మకంగా ఉన్న ఒక డాక్యుమెంటరీని బీబీసీ బ్రిటన్‌లో ప్రసారం చేసిన కొన్ని వారాల తర్వాత బీబీసీకి చెందిన దిల్లీ, ముంబై కార్యాలయాల్లో ఈ సర్వే మొదలైంది.

ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, 2002లో ఆ రాష్ట్రంలో జరిగిన మత ఘర్షణలపై ఆ డాక్యుమెంటరీని బీబీసీ రూపొందించింది.

''ఆదాయ పన్ను అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నాం’’ అని బీబీసీ తెలిపింది.

''ఈ అంశం వీలైనంత త్వరలోనే పరిష్కారం అవుతుందని మేం ఆశిస్తున్నాం’’ అని ఒక సంక్షిప్త ప్రకటనలో పేర్కొంది.

బీబీసీ డాక్యుమెంటరీ 'ఇండియా: ది మోదీ క్వశ్చన్' కేవలం యూకేలో మాత్రమే ప్రసారం అయినప్పటికీ, ఆ డాక్యుమెంటరీ ''వలసవాద మనస్తత్వం’’తో కూడిన ''శత్రుపూరిత దుష్ప్రచారం, భారత వ్యతిరేక చెత్త’’ అని భారత ప్రభుత్వం అభివర్ణించింది. ఈ డాక్యుమెంటరీని ప్రజలు ఆన్‌లైన్‌లో షేర్ చేయకుండా అడ్డుకోవటానికి ప్రభుత్వం ప్రయత్నించింది.

గత నెలలో ఈ డాక్యుమెంటరీని వీక్షించటానికి గుమిగూడిన విద్యార్థులను దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.

https://twitter.com/ANI/status/1625585058278162434

దేశవ్యాప్తంగా ఆ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు ప్రయత్నం చేసిన విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడం, అదుపులోకి తీసుకోవడం వంటి ఘటనలు జరిగాయి. కొన్ని చోట్ల ఆ డాక్యుమెంటరీని ప్రదర్శించారు.

మంగళవారం నాటి సర్వే.. ''మోదీ ప్రభుత్వం విమర్శలకు భయపడుతోందని’’ చూపుతోందని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ పేర్కొన్నారు.

''ఈ బెదిరింపు ఎత్తుగడలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ అప్రాజాస్వామిక, నియంతృత్వ వైఖరి ఇక ఏమాత్రం కొనసాగరాదు’’ అని ఆయన ట్వీట్ చేశారు.

అయితే ప్రధాని మోదీకి చెందిన పాలక భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా.. బీబీసీని ''ప్రపంచంలో అత్యంత భ్రష్టమైన సంస్థ’’గా అభివర్ణించారు.

''భారతదేశం ప్రతి సంస్థకూ అవి విషం చిమ్మనంత వరకూ అవకాశం కల్పింస్తుంది’’ అని ఆయన చెప్పారు.

ఈ 'సర్వే’ చట్టబద్ధమైనవని, ఇవి చేపట్టిన సమయానికి ప్రభుత్వంతో సంబంధమేమీ లేదని ఆయన పేర్కొన్నారు.

ముంబైలో బీబీసీ కార్యాలయం విడిచి వెళుతున్న ఒక పోలీస్ వాహనం

భారతదేశంలో పత్రికా స్వాతంత్ర్యాన్ని ప్రోత్సహించే లాభాపేక్ష లేని సంస్థ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా.. దీని పట్ల ''తీవ్ర ఆందోళన’’ వ్యక్తం చేసింది.

''ప్రభుత్వ విధానాలను కానీ, పాలక యంత్రాంగాన్ని కానీ విమర్శనాత్మకంగా ఉండే పత్రికా సంస్థలను బెదిరించటానికి, వేధించటానికి ప్రభుత్వ సంస్థలను ఉపయోగిస్తున్న పోకడకు కొనసాగింపు’’ ఈ సోదాలు అని ఒక ప్రకటనలో వ్యాఖ్యానించింది.

బీబీసీ డాక్యుమెంటరీ.. బీజేపీ పదవుల్లో ఆయన ఎదుగుదల, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన నియామకం సహా ప్రధాని మోదీ తొలి రాజకీయ అడుగులను ప్రస్తావిస్తుంది.

బ్రిటన్ విదేశాంగ శాఖ నుంచి ఇంతకుముందు ప్రచురితం కాని ఒక నివేదికను ఈ డాక్యుమెంటరీ ప్రధానంగా ప్రస్తావిస్తుంది. గుజరాత్ మత అల్లర్ల సమయంలో మోదీ చర్యల గురించి ప్రశ్నలు లేవనెత్తుతున్న ఆ నివేదికను బీబీసీ సంపాదించింది.

హిందూ తీర్థయాత్రికులు ప్రయాణిస్తున్న ఒక రైలుకు నిప్పు పెట్టటంతో పదుల సంఖ్యలో జనం చనిపోయిన మరుసటి రోజు ఆ అల్లర్లు మొదలయ్యాయి. ఆ తర్వాత చెలరేగిన హింసలో 1,000 మందికి పైగా చనిపోయారు. వారిలో అత్యధికులు ముస్లింలు.

ఆ హింసకు వీలుకల్పించిన ''నిర్భీతి వాతావరణా’’నికి మోదీ ''ప్రత్యక్షంగా బాధ్యులు’’ అని సదరు విదేశాంగ శాఖ నివేదిక చెప్తోంది.

అలాగే 2005లో అమెరికా.. ''మత స్వాతంత్ర్యాన్ని తీవ్రంగా ఉల్లంఘించటానికి’’ బాధ్యులుగా ఉన్న విదేశీ అధికారులకు ప్రవేశాన్ని నిషేధించే చట్టం కింద.. మోదీకి వీసా నిరాకరించింది.

మోదీ తనపై ఆరోపణలను మొదటి నుంచీ తిరస్కరిస్తూ ఉన్నారు. ఆ అల్లర్ల పట్ల విచారం వ్యక్తం చేయలేదు. ఆయన మీద న్యాయ విచారణకు తగినన్ని ఆధారాలు లేవని 2013లో సుప్రీంకోర్టు నియమించిన కమిటీ కూడా పేర్కొంది.

ఆ డాక్యుమెంటరీపై స్పందన తెలియజేయాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని సంప్రదించామని, కానీ ప్రభుత్వం స్పందించటానికి తిరస్కరించిందని బీబీసీ గత నెలలో చెప్పింది.

ఆ డాక్యుమెంటరీ కోసం ''లోతైన పరిశోధన చేశాం. విస్తృతమైన గళాలు, ప్రత్యక్ష సాక్షులు, నిపుణులను కలిశాం. బీజేపీకి చెందిన వ్యక్తులు సహా అనేక అభిప్రాయాలను పొందుపరిచాం’’ అని బీబీసీ వివరించింది.

https://twitter.com/ndtv/status/1625415783110283264

బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్‌కు గత నెలలో బ్రిటన్ పార్లమెంటులో ఈ డాక్యుమెంటరీ గురించి అడిగారు. ''ఎక్కడైనా మత వివక్షతో కూడిన హింసను మేం సహించం’’ అని ఆయన చెప్పారు. అయితే.. తాను ''మోదీని చూపించిన తీరుతో ఏకీభవించటం లేదు’’ అని పేర్కొన్నారు.

భారతదేశంలో ప్రభుత్వాన్ని విమర్శించే సంస్థలను లక్ష్యం చేసుకోవటం అసాధారణం కాదు.

2020 సంవత్సరంలో ఆమ్నెస్టీ ఇంర్నేషనల్ భారత దేశంలో తన కార్యకలాపాలను నిలిపివేయాల్సి వచ్చింది. మానవ హక్కుల సంస్థలపై ప్రభుత్వం ''కక్ష సాధింపు’’కు పాల్పడుతోందని ఆ సంస్థ ఆరోపించింది.

గత ఏడాది ఆక్స్‌ఫామ్ సహా పలు ఇతర ప్రభుత్వేతర సంస్థల మీద కూడా సోదాలు జరిగాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+