పంజ్ షీర్ తాలిబన్ల వశం-ముల్లా బరాదర్ ఆధ్వర్యంలోనే కొత్త ప్రభుత్వం- కీలక ప్రకటన
ఆప్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వం నుంచి పాలనా పగ్గాలు అందుకున్నప్పటికీ కీలకమైన పంజ్ షీర్ లోయలో మాత్రం తిరుగుబాటుదారులతో సాగుతున్న పోరులో వెనుకబడిన తాలిబన్లు.. ఎట్టకేలకు విజయాన్ని అందుకున్నారు. పంజ్ షీర్ లో తాము విజయం సాధించినట్లు తాలిబన్లు తాజాగా మరోసారి ప్రకటించారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు కూడా సిద్ధమవుతున్నట్లు కూడా తాలిబన్ల నుంచి ప్రకటన వెలువడింది.
పంజ్ షీర్ తాలిబన్ల కైవసం
ఆప్ఘనిస్తాన్ లో అమెరికాల బలగాలు వైదొలిగిన తర్వాత అక్కడి ప్రావిన్సులపై క్రమంగా పట్టు సంపాదిస్తూ వచ్చిన తాలిబన్లకు పంజ్ షీర్ లోయ మాత్రం బలమైన సవాల్ విసిరింది. ఆప్ఘన్ ను గెలవడం ఓ ఎత్తయితే పంజ్ షీర్ ను గెలవడం మరో ఎత్తుగా వారికి మారిపోయింది. దీంతో ఆప్ఘన్ మొత్తం ఉన్న ఫైటర్లను పంజ్ షీర్ కు పంపిన తాలిబన్లు.. అనుకున్న ఫలితాన్ని సాధించారు. ఆప్ఘనిస్తాన్ లో చివరి భూభాగం పంజ్ షీర్ ను సైతం కైవసం చేసుకున్నట్లు తాలిబన్లు తాజాగా ప్రకటించారు. దీంతో ఆప్గనిస్తాన్ పై పూర్తిగా వారు పట్టు సాధించినట్లయింది.
భీకరపోరు తర్వాత అసాధారణ విజయం
పంజ్ షీర్ లోయలో తిరుగుబాటుదారులతో భీకరపోరు సాగించిన తాలిబన్లు ఇందులో ఘనవిజయాన్ని కైవసం చేసుకున్నారు. అయితే అక్కడ జరిగిన పోరు మాత్రం వారికి జీవితకాలం గుర్తుండిపోయేలా ఉంది. ఎందుకంటే మొత్తం ఆప్ఘనిస్తాన్ ను కైవసం చేసుకోవడానికి తాము కోల్పోయిన ఫైటర్ల కంటే పంజ్ షీర్ లోయను స్వాధీనం చేసుకునేందుకు కోల్పోయిన ఫైటర్ల సంఖ్యే ఎక్కువగా ఉంది. భారీ ఎత్తున ఫైటర్లను కోల్పోయిన తాలిబన్లు.. ఎట్టకేలకు ఈ కీలక లోయను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ జరిగిన పోరులో తిరుగుబాటుదారులు సైతం భారీగా ప్రాణనష్టం చవిచూడాల్సి వచ్చింది.
కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రెడీ
ఆప్ఘనిస్తాన్ లో తమకు కొరకరాని కొయ్యగా మారిన పంజ్ షీర్ లోయను కైవసం చేసుకోకుండా ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు మొగ్గుచూపని తాలిబన్లు.. ఇఫ్పడు తాజా విజయంతో సర్కార్ దిశగా అడుగులేస్తున్నారు. పంజ్ షీర్ లో విజయం సాధించినట్లు తేలడంలో తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటు కోసం తిరిగి చర్చలు ప్రారంభించారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటులో ఎవరెవరిని భాగస్వాముల్ని చేయాలనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. ఇందులో తాలిబన్ కమాండర్లతో పాటు హక్కానీ నెట్ వర్క్ నేతలకు కూడా ప్రభుత్వంలో చోటు కల్పించే అవకాశముంది.
Recommended Video
ముల్లా బరాదర్ నేతృత్వంలోనే తాలిబన్ సర్కార్
ఆప్ఘనిస్తాన్ లో పంజ్ షీర్ లోయను కైవసం చేసుకునేందుకు ప్రభుత్వ ఏర్పాటును ఇప్పటివరకూ వాయిదా వేసిన తాలిబన్లు..ఇప్పుడు అక్కడా పిజయం సాధించడంతో ముల్లా బరాదర్ నేతృత్వంలోనే కొత్త సర్కార్ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. తాలిబన్ల సుప్రీం కమాండర్ హైబతుల్లా అఖుంద్ జాదాను అధ్యక్షుడి హోదాలో ఉంచి, రోజువారీ పాలనను తాలిబన్ల సహ వ్యవస్ధాపకుడు కూడా అయిన ముల్లా బరాదర్ చూసుకునే అవకాశముంది. గతంలో తాలిబన్లను పలు పోరాటాల్లో ముందుండి నడిపించిన ముల్లా బరాదర్ ప్రభుత్వ సారధి అయితే అంతర్జాతీయంగా కూడా తాలిబన్ల దౌత్య సంబంధాలు మెరుగుపడే అవకాశముందని భావిస్తున్నారు.