ఆఫ్గన్లో ఆగని తాలిబన్ల అరాచకాలు-జర్నలిస్టుతో ముక్కు నేలకు రాయించి-ఆ వార్తను కవర్ చేసినందుకు...
ఆఫ్గనిస్తాన్లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయి. ఆఫ్గనిస్తాన్లో ప్రజాస్వామ్యానికి తావు లేదని ప్రకటించినట్లుగానే... అత్యంత కర్కషంగా వారు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో పాక్ జోక్యంపై పెల్లుబికుతున్న నిరసనలు ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు.మంగళవారం(సెప్టెంబర్ 7) కాబూల్లోని పాకిస్తాన్ ఎంబసీ వద్ద పదుల సంఖ్యలో మహిళలు నిరసన చేపట్టగా... గాల్లోకి కాల్పులు జరిపి వారిని చెదరగొట్టారు. ఇదే క్రమంలో పదుల సంఖ్యలో జర్నలిస్టులను నిర్బంధించి వారిని చిత్రహింసలకు గురిచేశారు.
మహిళల నిరసనకు సంబంధించిన వార్తలను కవర్ చేస్తున్నందుకు ఆ జర్నలిస్టులను తాలిబన్లు నిర్బంధించారు. ఆ తర్వాత కొద్ది గంటలకు వీరిని విడుదల చేశారు. విడుదలైన జర్నలిస్టుల్లో ఒకరు మాట్లాడుతూ... తాలిబన్లు తనతో ముక్కు నేలకు రాయించారని చెప్పారు. మహిళల నిరసన వార్తను కవర్ చేసినందుకు క్షమాపణగా తనతో ఆ పని చేయించారన్నారు. ప్రాణ రక్షణ కోసం తాను అలా చేయక తప్పలేదన్నారు. ఏదేమైనా ఆఫ్గనిస్తాన్లో జర్నలిజం చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందని చెప్పారు.
టోలో న్యూస్కి చెందిన వహీద్ అహ్మదీ అనే కెమెరా జర్నలిస్టును కూడా తాలిబన్లు మూడు గంటల పాటు నిర్బంధించారు. అనంతరం అతన్ని విడుదల చేశారు. గడిచిన కొన్నేళ్లలో అహ్మదీ ఎన్నో ఫ్రంట్ లైన్స్ను కవర్ చేశాడని టోలో న్యూస్ చీఫ్ లోత్ఫుల్లా నజఫిజాదా పేర్కొన్నారు.వహీద్ అహ్మదీని తాలిబన్లు విడుదల చేయడంతో ఆ చానెల్ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. ఇంకా పదుల సంఖ్యలో జర్నలిస్టులు తాలిబన్ల నిర్బంధంలోనే ఉన్నారని లోత్ఫుల్లా ట్విట్టర్లో పేర్కొన్నారు.
Recommended Video
ఆఫ్గన్ న్యూస్ టీవీ నెట్వర్క్కి చెందిన అరియానా న్యూస్ జర్నలిస్ట్ సమీ జహేశ్,కెమెరామెన్ సమీమ్లను కూడా తాలిబన్లు నిర్బంధించారు.రెండు గంటల పాటు వారి ఆచూకీ తెలియలేదని... దాంతో తాము తీవ్ర ఆందోళనకు గురయ్యామని అరియానా న్యూస్ యాజమాన్యం వెల్లడించింది. ఆ తర్వాత కొద్ది గంటలకు వారిని విడుదల చేసినట్లు తెలిసిందని పేర్కొంది. మహిళల నిరసనను కవర్ చేస్తున్న మరో జర్నలిస్టుపై తాలిబన్లు దాడికి పాల్పడ్డారు. అక్కడినుంచి వెళ్లిపోవాలని బెదిరించారు.
ఆఫ్గనిస్తాన్ ఆక్రమణ తర్వాత ఏర్పాటు చేసిన మొదటి ప్రెస్ మీట్లో శాంతి వచనాలు వల్లె వేసిన తాలిబన్లు అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అందరి రక్షణకు హామీ ఇస్తున్నామని ప్రకటించారు గానీ ఆ పరిస్థితులు ఎక్కడా కనిపించట్లేదు. ఎవరితోనూ శత్రుత్వం,కక్ష సాధింపు చర్యలు ఉండవని చెబుతూనే తమ పని తాము చేసుకుపోతున్నారు. ప్రభుత్వంలో తమకూ ప్రాతినిధ్యం ఉండాల్సిందేనని మహిళలు డిమాండ్ చేస్తుండగా... అది నెరవేరే సూచనలు కనిపించట్లేదు. ఇప్పటికే 33 మంది జాబితాతో కేంద్ర కేబినెట్ను తాలిబన్లు ప్రకటించారు.మరికొందరు మంత్రులతో త్వరలోనే మరో జాబితా ప్రకటిస్తామన్నారు.