ఆఫ్గన్ పొరుగు దేశాలకు షాక్... తాలిబన్ల అరాచకాలకు పరాకాష్ఠ... సరిహద్దుల్లో ఆ దళాల మోహరింపుకు నిర్ణయం...
ఆఫ్గనిస్తాన్లో తాలిబన్ల అరాచకాలు పరాకాష్ఠకు చేరుతున్నాయి. సాధారణంగా దేశ సరిహద్దుల్లో మిలటరీని ఉపయోగించడం సహజం.కానీ తాలిబన్లు మాత్రం సరిహద్దుల్లో ఆత్మాహుతి దళాలను మోహరించాలని నిర్ణయించారు.ఈ మేరకు మన్సూర్ ఆర్మీ పేరుతో పేరుతో ప్రత్యేక ఆత్మాహుతి దళాన్ని ఏర్పాటు చేశారు. గత ఆఫ్గనిస్తాన్ ప్రభుత్వంలోని భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపిన ఆత్మాహుతి దళం తరహాలోనే ఇది కూడా పనిచేస్తుందని తాలిబన్ డిప్యూటీ గవర్నర్ ముల్లా నిసర్ అహ్మదీ వెల్లడించారు.
ఆఫ్గనిస్తాన్-తజికిస్తాన్,చైనా సరిహద్దుల్లో ఈ ఆత్మాహుతి దళాన్ని మోహరించనున్నట్లు అహ్మదీ తెలిపారు.ముఖ్యంగా బదాక్షన్ ప్రావిన్స్లోని సరిహద్దు ప్రాంతంలో ఈ దళం కార్యకలాపాలు ఉంటాయన్నారు. ఈ దళానికి లష్కర్ ఇ మన్సూరీ(మన్సూరీ ఆర్మీ)గా నామకరణం చేసినట్లు చెప్పారు. ఇలాంటి బెటాలియన్ లేకపోతే అమెరికాను ఓడించడం సాధ్యమయ్యేది కాదని అన్నారు. ఈ దళంలోని సభ్యులు పేలుడు పదార్థాలతో కూడిన జాకెట్ ధరిస్తారని... ఆఫ్గనిస్తాన్లోని అమెరికా స్థావరాలను పేల్చేస్తారని చెప్పారు. వీళ్లకు అసలు భయమనేదే ఉండదని... ఒకరకంగా తమను తాము అల్లాకు అర్పించుకునేందుకు వారు సిద్ధంగా ఉంటారని పేర్కొన్నారు.
ఆఫ్గనిస్తాన్ మరోసారి ఉగ్రవాద స్థావరంగా మారుతోందని... అక్కడి నుంచి ప్రపంచ దేశాలకు ముప్పు ఉందని తజికిస్తాన్ ఇటీవల ఐక్యరాజ్య సమితి సర్వ సభ్య సమావేశంలో ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొద్దిరోజులకే తాలిబన్లు తజికిస్తాన్ సరిహద్దుల్లో ఆత్మాహుతి దళాలను మోహరించనుండటం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే తజికిస్తాన్ ఆఫ్గనిస్తాన్ సరిహద్దుల్లో సైనిక ప్రదర్శన నిర్వహించింది.దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన రష్యా.. తజికిస్తాన్,తాలిబన్ ప్రభుత్వం చర్చలతో సమస్యలను పరిష్కరించుకోవాలని కోరింది.
తాలిబన్లపై తిరుగుబాటు చేస్తున్న దళానికి ప్రస్తుతం తజికిస్తానే స్థావరంగా మారింది. ఈ నేపథ్యంలో తాలిబన్లు సైతం తజికిస్తాన్పై ఆగ్రహంతో ఉన్నారు.ఐరాస వేదికగా తజికిస్తాన్ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను తాలిబన్లు తప్పు పట్టారు. తమ అంతర్గత వ్యవహారాల్లో ఏ దేశం తలదూర్చవద్దని హెచ్చరిస్తున్నారు.
తాలిబన్ల పాలనలో ఏ వర్గం స్వేచ్చా,హక్కులు,భద్రతను పొందట్లేదు. నిత్యం భయం గుప్పిట్లో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.దానికి తోడు ఉద్యోగ,ఉపాధి లేక ప్రజల ఆర్థిక స్థితిగతులు చితికిపోయాయి. నిన్న మొన్నటిదాకా ప్రభుత్వ,ప్రైవేట్ ఉద్యోగాలు చేసినవారు ఒక్కసారిగా రోడ్డునపడ్డారు. ఉద్యోగ,ఉపాధి లేక కుటుంబ పోషణ భారమై నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కడుపు నింపుకునేందుకు ఇళ్లల్లో ఉన్న వస్తువులను అమ్ముకుంటున్నారు.టోలో న్యూస్ కథనం ప్రకారం... చాలామంది కాబూల్ వాసులు తమ ఇళ్లల్లోని వస్తువులను తీసుకొచ్చి అమ్మకానికి పెడుతున్నారు. ఎంతో కొంతకు వాటిని విక్రయిస్తున్నారు.ఆ పూటకు తిండి దొరికితే చాలు అన్నట్లుగా వారి పరిస్థితి ఉంది. వ్యాపారుల పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. షాపుల్లో వస్తువులను కొనేవారు కరువవడంతో ఎంతో కొంతకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అసలే పేదరికం ఎక్కువగా ఉన్న ఆఫ్గనిస్తాన్లో తాలిబన్లు పాలన చేపట్టాక పరిస్థితులు మరింత దిగజారాయి.దేశంలో పేదరికం దాదాపు 97శాతంగా ఉన్నట్లు చెబుతున్నారు.తినడానికి తిండి కూడా దొరకని దుస్థితిలో ఆఫ్గన్ ప్రజలు అలమటిస్తున్నారు.ప్రజల వద్ద డబ్బు లేదు... ప్రభుత్వానికి విదేశాల నుంచి నిధులు అందడం లేదు.దీంతో పాలనా వ్యవస్థను సక్రమంగా నడిపించే పరిస్థితి కూడా లేదు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆఫ్గనిస్తాన్లో మళ్లీ అంతర్యుద్దం తప్పదనే వాదన వినిపిస్తోంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(ఐఎంఎఫ్),వరల్డ్ బ్యాంక్ ఇప్పటికే ఆఫ్గనిస్తాన్కు రుణాలు మంజూరు చేయడం నిలిపివేసింది.తాలిబన్లు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఐఎంఎఫ్ ఈ ఆంక్షలు విధించింది.అటు అమెరికా ఆఫ్గనిస్తాన్ సెంట్రల్ బ్యాంకులో 9.4బిలియన్ డాలర్ల నిధులను నిలిపివేసింది. తాలిబన్లను బ్లాక్ లిస్టులో పెట్టాల్సిందిగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) 39 మంది సభ్య దేశాలను ఆదేశించింది.దీంతో తాలిబన్ ప్రభుత్వానికి నిధుల కొరత ఏర్పడింది.