తాలిబన్ల పాలన: ఆప్ఘాన్ రాజధాని కాబూల్లో ఉగ్రవాదులు సంచారం, తాలిబన్ జెండాలతోనే..
కాబూల్: తాలిబన్ల ఏలుబడిలోకి రావడంతో ఉగ్రవాదులకు ఆప్ఘనిస్థాన్ మరో స్వర్గధామంలా మారుతున్నట్లు తెలుస్తోంది. ఆప్ఘనిస్థాన్ను ఇప్పుడు పూర్తిగా తాలిబన్ల ఆధీనంలోకి వచ్చింది. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా ఇస్లామిక్ స్టేట్(ఐఎస్), జైషే మొహమ్మద్(జేఈఎం), లష్కరే తొయిబా ఉగ్రవాదులు కాబూల్ బాట పట్టినట్లు సమాచారం.
ఈ ఉగ్రవాదులు కాబూల్లో ప్రవేశించారనే విషయం తాలిబన్లకు తెలిసినప్పటికీ వారు మౌనంగానే ఉండటం గమనార్హం. అయితే, తాలిబన్ల జెండాను పట్టుకుని ఉగ్రవాదులు కాబూల్లోకి ప్రవేశించడం చర్చనీయాంశంగా మారింది. తాలిబన్ల నియంత్రణ లేకుండానే ఈ ఉగ్రవాదులు కాబూల్లోని పలు ప్రాంతాల్లో స్వేచ్ఛగా తిరుగుతుండటం ఆందోళనకరంగా మారింది.
అమెరికాతో చేసుకున్న ఒప్పందం ప్రకారం తాలిబన్లు ఆప్ఘనిస్థాన్లో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించకూడదు. వారి కార్యకలాపాలను నిరోధించాలి. త్వరలోనే ఉగ్రవాదులను కాబూల్ నుంచి పంపివేస్తామని తాలిబన్ వర్గాలు చెబుతున్నప్పటికీ అది సాధ్యమయ్యే పనిలా కనిపించడం లేదు.
కాగా, తాలిబన్ల నాయకత్వంలోనే ఈ ఉగ్రవాద సంస్థలు ఆప్ఘనిస్థాన్లో మారణహోమం సృష్టించే అవకాశం లేకపోలేదని మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇతర దేశాలకు చెందిన దళాలను ఎదుర్కొనేందుకు ఈ ఉగ్రవాద సంస్థల సాయం తాలిబన్లు తీసుకున్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి. తాలిబన్ వ్యవస్థాపకుడైన ముల్లా యాకూబ్ సోమవారం కాబూల్ చేరుకున్నాడు.
అందర్నీ క్షమించేశాం: తిరిగి విధుల్లోకి రావాలంటూ ప్రభుత్వ ఉద్యోగులకు తాలిబన్ల ఆదేశం
క్వెట్టా నుంచి యాకూబ్ కాబూల్ వచ్చాడు. తాలిబన్ కార్యకలాపాలకు ఇతడే నాయకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే పాలన మొదలుపెట్టే అవకాశం ఉంది. ఇప్పుడు మిలిటరీ క్రియాశీలకంగా వ్యవహరించని కారణంగా తాలిబన్లు, ఉగ్రవాద గ్రూపుల మధ్య సయోధ్య కుదురుతుందా? లేక ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
కాగా, తాలిబన్లు ఉగ్రవాద సంస్థల నాయకులను ఆప్ఘనిస్థాన్ నుంచి వెళ్లిపోవాలని కోరారని, అందుకు వారు కూడా సుముఖత వ్యక్తి చేసినట్లు తెలుస్తోందని ఇక్కడి ఓ మానవ హక్కుల సంఘం కార్యకర్తలు తెలిపారు. మరోవైపు తాలిబన్ నాయకులు ఆప్ఘన్ రాజకీయ నాయకులతో చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారు. శాంతియుత వాతావరణంలో తమ పాలన కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తాలిబన్ నేతలు చెబుతున్నారు.
అయితే, ఆప్ఘన్ రాజధాని కాబూల్లో తిష్టవేసిన ఉగ్రవాద సంస్థలకు చెందిన నాయకులను తరిమేయడం తాలిబన్లకు సాధ్యమయ్యే పనేనా? అనేది ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. ఎందుకంటే, పోలీసులు, మిలిటరీ ఇప్పుడు క్రియాశీల స్థితిలో లేకపోవడం గమనార్హం. ఆప్ఘాన్లో జరుగుతున్న పరిణామాలు ఐక్యరాజ్యసమితితోపాటు పలు ప్రపంచ దేశాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. మరోవైపు, తాలిబన్ల పాలనను తాము గుర్తిస్తున్నట్లు పాకిస్థాన్, చైనాలు ప్రకటించాయి. తాలిబన్లతో స్నేహాన్ని తాము కొనసాగిస్తామని చైనా ప్రకటించడం గమనార్హం. ఇక పాకిస్థాన్ సైన్యం, ఐఎస్ఐ తాలిబన్లకు ఎప్పట్నుంచో అండగా ఉంటున్న విషయం తెలిసిందే.
మరోవైపు,
ప్రజలను
క్షమించామంటూ
ఇప్పటికే
తాలిబన్
నేతలు
ప్రకటించిన
విషయం
తెలిసిందే.
అధికారులు
విధుల్లో
చేరి
తమ
కార్యకలాపాలను
నిర్వహించాలని
ఆదేశాలు
జారీ
చేశారు.
ప్రజలు
తమ
జీవనాన్ని
సాధారణంగానే
కొనసాగించుకోవచ్చన్నారు.
ప్రభుత్వ
ఉద్యోగులు
తిరిగి
విధుల్లో
చేరాలని
ఆదేశించారు.
దేశంలోని
ప్రతి
ఒక్కరికీ
క్షమాభిక్ష
ప్రసాదిస్తున్నాం..
అందువల్ల
మీరంతా
పూర్తి
విశ్వాసం,
భరోసాతో
జీవనం
సాగించండి
అని
పిలుపునిచ్చారు
తాలిబన్లు.
ప్రస్తుతం ప్రజలంతా సాధారణ, రోజువారీ కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వ అధికారులంతా తిరిగి విధులకు హాజరుకావాలని తాలిబన్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆప్ఘాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. మళ్లీ ఆంక్షల జీవితం తప్పదని వాపోతున్నారు. ఇంతకుముందు తాలిబన్ల అరాచక పాలన అనుభవం ఉన్న ప్రజలు దేశం విడిచిపారిపోయేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. విమానాశ్రయాలకు పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే గత ఏడాది కాలం నుంచి లక్ష మంది ప్రజలు ఆప్ఘాన్ విడిచి వెళ్లడం గమనార్హం.
తాజాగా, తాలిబన్ల పూర్తి ఆధిపత్యం చేపట్టడంతో ప్రజలు విదేశాలకు వెళ్లిపోతున్నారు. ఇతర దేశాలకు చెందినవారిని ఆయా దేశాలు తరలిస్తున్నాయి. అత్యంత ప్రమాకర పరిస్థితుల్లో ప్రయాణిస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కాబూల్ విమానాశ్రయంలో భారీగా జనం చేరడంతో యూఎస్ దళాలు కాల్పులు జరిపాయి. దీంతో ఐదుగురు మృతి చెందారు. మరోవైపు ఓ విమానం టైర్లకు తమను కట్టుకుని ప్రయాణించిన ఇద్దరు వ్యక్తులు గాలిలోకి ఎగిరిన తర్వాత కిందపడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలందరికీ క్షమాభిక్ష ఇస్తున్నామని తాలిబన్లు ప్రకటించడం చర్చకు దారితీసింది.
దాడులతో విరుచుకుపడే తాలిబన్లు ఈసారి మాత్రం ప్రజలు, అధికారులకు ఎలాంటి ఇబ్బంది కలిగించబోమని ప్రకటిస్తున్నారు. తమ పాలనలో ప్రజలకు హానీ కలిగించబోమని చెబుతున్నారు. ఇతర దేశాల పౌరులకు కూడా తాము హాని తలబెట్టబోమని చెబుతున్నారు. అయితే, ఎవరైనా తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే మాత్రం శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు. అనుమతి లేకుండా ఎవరి ఇళ్లల్లోకి ప్రవేశించొద్దని తాము ఫైటర్లను ఆదేశించామని, ప్రజల ప్రాణాలు, ఆస్తులు, గౌరవాన్ని పరిరక్షించాల్సిందిగా వారికి సూచనలు చేశామని తాలిబన్ల అధికార ప్రతినిధి సుహైల్ షహీన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. మరోవైపు, అమెరికా నేతృత్వంలోని కూటమి తరపున పని చేసినవారిపైనా తాము ప్రతీకారం తీర్చుకోబోమని తాలిబన్ సహ వ్యవస్థాపకుడు అబ్దుల్ ఘనీ బరాదర్ భరోసా ఇస్తున్నారు. అంతేగాక, ఆప్ఘాన్ ప్రజల్లో అనసవర భయాన్ని రేకెత్తించొద్దంటూ అంతర్జాతీయ సమాజాన్ని కోరుతున్నారు.