ఫేస్బుక్కి అతుక్కుపోయాడని ప్రియుడ్ని చంపేసింది
లండన్: సోషల్ మీడియా ఫేస్బుక్ వల్ల కొంత మేలు జరుగుతున్నప్పటికీ మరికొన్ని అనర్థాలు జరుగుతూనే ఉన్నాయి. తాజగా, తన ప్రియుడు ఫేస్బుక్ విపరీతంగా వాడతున్నాడని, దాని వల్ల అతడి ప్రవర్తనలో మార్పులు వస్తున్నాయని భావించిన ఓ ప్రియురాలు ఆవేశంలో అతడ్ని చంపేసింది.
ఇంగ్లాండ్లోని లండన్లో ఈ ఘటన గత ఆగస్టులో చోటు చేసుకుంది. కాగా, ఈ కేసును విచారించిన కోర్టు నిందితురాలికి 12 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ.. ఆ గడువు ముగిసిన తర్వాత పెరోల్పై బయటకు వెళ్లేందుకు అవకాశం కల్పించింది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. టెర్రీ మారీ పామర్ అనే 23ఏళ్ల యువతి హెయిర్ డ్రెస్సర్గా పని చేస్తుండేది. కాగా, నిరుద్యోగి అయిన ఆమె ప్రియుడు డామన్ సియర్సన్ ఇటీవలే ఓ మొబైల్ ఫోన్ కొన్నాడు. అందులో ఫేస్బుక్ చాటింగ్ చేయడం మొదలెట్టాడు. తన అర్ధనగ్న ఫొటోలు కూడా విపరీతంగా పోస్ట్ చేసేవాడు.
ఈ క్రమంలో అతడి ఫేస్బుక్ వాడకం శృతిమించింది. దీంతో బాగా విసిగిపోయిన పామర్.. అతడ్ని చంపేయాలని నిర్ణయించుకుంది. గత ఆగస్టు13వ తేదీన ప్రియుడు సియర్సన్ను గుండెల్లో కత్తితో పలుమార్లు పొడిచి హత్యచేసింది.
ఆ వెంటనే తేరుకున్న ఆమె.. అత్యవసర సేవల నంబర్ 999కు కాల్ చేసింది. తన ప్రియుడు పొరపాటున కత్తితో పొడుచుకుని గాయపడ్డాడని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఆరు నెలల విచారణ తర్వాత పోలీసుల దర్యాప్తులో నిజాలు ఒక్కక్కటిగా బయటపడ్డాయి.
ప్రియుడు లేకపోవడంతో తనకు చాలా బోరింగ్గా ఉందని ఫేస్బుక్లో ఓ సందేశాన్ని పంపిన ఆమె.. సియర్సన్ వ్యవహారం నచ్చకనే అతడ్ని చంపేశానంటూ మరో పోస్ట్లో పేర్కొంది. ఆ తర్వాత ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.
కాగా, తనను తన ప్రియుడు వదిలించుకోవాలని ప్రయత్నించాడని, వేరొక యువతిలో సన్నిహితంగా ఉంటున్నాడని భావించి అతడ్ని హత్యచేసినట్లు పామర్ కోర్టులో అంగీకరించింది. దీంతో ఆమెకు 12ఏళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం