అత్యంత కిరాతకంగా బాలుడిని చంపి రక్తం తాగాడు
టెక్సాస్: 12 ఏళ్ల బాలుడిని అతి కిరాతకంగా హతమార్చి అనంతరం పైప్ సాయంతో బాలుడి గొంతు నుంచి రక్తాన్ని తాగిన నరరూప రాక్షసుడికి అమెరికా పోలీసులు బుధవారం మరణశిక్షను అమలు చేశారు. 1998లో జరిగిన ఈ ఘటనపై అమెరికా సుప్రీం కోర్టు పలుమార్లు విచారించి అతడికి మరణ శిక్షను విధించింది.
వివరాల్లోకి వెళితే... టెక్సాస్ బోర్డర్కు 225 మైళ్ల దూరంలో ఉన్న శాన్ ఆంటానియోలో ఈ ఘటన చోటు చేసుకుంది. 7వ తరగతి చదువుతున్న డేవిడ్ కార్డెన్నా అనే బాలుడిని పాబ్లో లుసియో వాస్క్యూజ్ (38) అనే వ్యక్తి అత్యంత కిరాతకంగా హతమార్చాడు.
అనంతరం బాలుడి గొంతు కోసి ఇనుప పైప్ సాయంతో అతని రక్తాన్ని తాగాడు. ఈ కేసులో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి విచారించారు. పోలీసు అధికారులకు అతడు ఇచ్చిన చివరి వాంగ్మూలంలో తాను ఆ బాలుడిని చంపిన ఆ తర్వాత అతడి రక్తాన్ని తాగానని చెప్పాడు.
మరణశిక్ష విధించడానికి ముందు తన కుటుంబ సభ్యులను జైలు లోపలే ఉండి కిటికి ద్వారా కలుసుకున్నాడు. తనను కలిసేందుకు వచ్చిన వారికి కృతజ్ఞతలు చెప్పాడు. కాగా బాలుడి కుటుంబ సభ్యులు కూడా పాబ్లో లుసియో వాస్క్యూజ్కి మరణశిక్ష విధించేటప్పుడు అక్కడి వచ్చారు.
దీంతో బాలుడి కుటుంబ సభ్యుల వైపు చూసి తనను క్షమించాలని కోరుకున్నాడు. 'నేను చేయగలిగింది ఇదొక్కటే.. ఈ రోజు మీకు న్యాయం జరుగుతుంది' అంటూ తన చివరి మాటలుగా చెప్పాడు. కాగా, లుసియో కుటుంబ సభ్యులు మాత్రం అతడి మరణశిక్షపై మాట్లాడేందకు నిరాకరించారు.
లుసియోకి పెంటోబార్బిటోన్ ఎక్కువ మోతాదులో ఇచ్చి బుధవారం సాయంత్రం 6.35 గంటల ప్రాంతంలో మరణశిక్షను అమలు చేశారు. మరణశిక్షను అమలు చేసిన 24 నిమిషాల అనంతరం అతడు మరణించినట్లు జైలు అధికారులు తెలిపారు.