టెక్సాస్ ఉత్పాతం- భారీ విపత్తుగా ప్రకటించనున్న బైడెన్ సర్కారు- నిధుల విడుదల కోసం
అమెరికాలోని టెక్సాస్లో నెలకొన్న మంచు పరిస్ధితులతో జనం పడుతున్న ఇబ్బందులపై జో బైడెన్ సర్కారు చురుగ్గా స్పందిస్తోంది. ఇప్పటికే టెక్సాస్కు భారీ ఎత్తున సహాయక బృందాలను పంపిన బైడెన్ సర్కారు నిరంతరం పరిస్దితిని సమీక్షిస్తోంది. మంచు దుప్పటి కారణంగా నెలకొన్న విపరీత పరిస్దితుల నేపథ్యంలో దీన్ని భారీ విపత్తుగా ప్రకటించేందుకు బైడెన్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. అధ్యక్షుడు బైడెన్ స్వయంగా దీనిపై ఓ ప్రకటన చేయనున్నట్లు వైట్హౌస్ వర్గాలు వెల్లడించాయి.
టెక్సాస్ మంచు పరిస్ధితులను భారీ విపత్తుగా ప్రకటించడం ద్వారా అక్కడ భారీ ఎత్తున ఫెడరల్ నిధులు ఖర్చు చేసేందుకు అవకాశం దక్కనుంది. ప్రస్తుతం అక్కడ సాగుతున్న సహాయ చర్యలకు వీటిని ఖర్చు చేయడం ద్వారా మరింత వేగవంతం చేయడంతో పాటు ప్రజల ప్రాణాలను కాపాడేందుకు వీలవుతుందని బైడెన్ సర్కారు భావిస్తోంది. భారీ విపత్తుగా ప్రకటించేందుకు ఏర్పాట్లు చేయాలని తన టీమ్ను అధ్యక్షుడు బైడెన్ ఆదేశించినట్లు వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి.
టెక్సాస్తో పాటు ఇతర ప్రాంతాలను కప్పేసిన మంచు దుప్పటి కారణంగా దాదాపు కోటి మందికి పైగా అమెరికన్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. వీరికి తాగేందుకు మంచినీరు కూడా దొరకని పరిస్ధితి. దీంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల్లో వారికి మంచినీరు పంపేందుకు ప్రయత్నిస్తోంది. మంచు పరిస్ధితుల కారణంగా అమెరికాలో ఇప్పటికే 60 మందికి పైగా చనిపోయారు. దీంతో టెక్సాస్ రాష్ట్రం విజ్ఞప్తి మేరకు భారీ విపత్తుగా దీన్ని ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇప్పటికే టెక్సాస్ లోని ప్రధాన నగరాలైన హూస్టన్, ఆస్టిన్, డల్లాస్ మేయర్లతో బైడెన్ సర్కారు నిరంతరం టచ్లో ఉంటూ పరిస్ధితిని సమీక్షిస్తోంది. జాక్సన్, మిస్సిస్సిపి వంటి నగరాల్లో ఇప్పటికే లక్షా 50 వేల మంది నీరు లభించక అల్లాడుతున్నారని తెలిసింది.