బాంబు పేలుడు: తిరిగి తెరచుకున్న బ్రహ్మ దేవాలయం
న్యూఢిల్లీ: థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో సోమవారం బాంబు పేలుడు సంభవించిన బ్రహ్మా దేవాలయం మూడు రోజుల అనంతరం తిరిగి బుధవారం తెరుచుకుంది. ఈరోజు ఉదయాన్నే దేవాలయాన్ని తెరిచారు. అనంతరం బౌద్ధ బిక్షువులు మత ప్రార్థనలు నిర్వహించారు.
భారీగా వచ్చని భక్తులు దేవుడిని దర్శించుకున్నారు. సోమవారం నాడు ఇదే ఆలయంలో బాంబు పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ బాంబు పేలుడులో 22 మంది మరణించారని, 125 మందికి తీవ్రగాయాలైనాయని బ్యాంకాక్ పోస్టు మీడియా వెల్లడించింది.
మృతుల్లో తొమ్మిది మంది విదేశీయులున్నారు. ఈ ఘటనలో గాయపడిన వారు పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇలాంటి బాంబు పేలుడు థాయ్లాండ్ చరిత్రలో ఎప్పుడు జరగలేదని ఉన్నతాధికారులు వివరించారు.మృతుల్లో ఏడు మృతదేహాలను ఇంకా గుర్తించవలసి ఉందని చెప్పారు.
ఆలయానికి అతి సమీపంలోని ఒక కమర్షియల్ మాల్ దగ్గర ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పుటేజ్ లు పోలీసు అధికారులు పరిశీలించారు. ఆ క్లిప్పింగ్ లలో ఒక వ్యక్తి బాంబు తీసుకు వచ్చి అక్కడ పెట్టి వెళుతున్న విషయం గుర్తించామని అధికారులు అంటున్నారు.
తొలుత నల్లటి బ్యాగ్ ధరించి వెళ్లిన ఇతడు ఆ తర్వాత బ్యాగ్ లేకుండా కనిపించాడు. ఆ యువకుడే ఈ బాంబు పేలుళ్లకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. అయితే నిందితుడి జాతీయతకు సంబంధించిన వివరాలు ఇంకా అందలేదు. జుంటా వ్యతిరేక దళాలు ఈ దాడికి పాల్పడి ఉంటాయని అనుమానిస్తున్నారు.
నిందితుడిని పట్టుకునేందుకు థాయ్ పోలీసులు జల్లెడ పడుతున్నారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామనే ధీమా వ్యక్తం చేశారు. చైనా నుంచి వచ్చిన ఓ పర్యాటకుడు మొత్తం బాంబు పేలుడు ఘటనను చిత్రీకరించాడు. ఈ పేలుడులో దేవాలయంలోని బ్రహ్మా దేవుని విగ్రహం యొక్క గెడ్డం, చెయ్యి స్వల్పంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే.