సీఈఓ ఖాతానే సస్పెండ్ చేసిన ట్విట్టర్: అసలేమైంది?
ట్విట్టర్ సీఈవో, సహవ్యవస్థాపకుడు జాక్ డార్సే ట్విట్టర్ ఖాతానే కొద్ది నిమిషాల పాటు బ్లాక్ అయ్యింది.
శాన్ఫ్రాన్సిస్కో: ప్రపంచంలోనే పేరుగాంచిన సోషల్ మీడియా దిగ్గజాలు ఈ మధ్య తప్పుటడుగులు వేస్తున్నాయి. మొన్నటికి మొన్న ఫేస్బుక్.. తమ అధినేత మార్క్ జుకర్బర్గ్ తోపాటు 2మిలియన్ల యూజర్లను చనిపోయినట్లు ప్రకటించింది. ఇది సాంకేతిక లోపమని తర్వాత వివరణ ఇచ్చుకుంది. ఇప్పుటు మరో సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కూడా అదే బాటలో నడిచింది.
అసలేం జరిగిందంటే.. ట్విట్టర్ సీఈవో, సహవ్యవస్థాపకుడు జాక్ డార్సే ట్విట్టర్ ఖాతానే కొద్ది నిమిషాల పాటు బ్లాక్ అయ్యింది. అదేదో సైబర్ నేరగాళ్లు లేదా ఇంకెవరో చేసింది కాదు. స్వయానా ట్విట్టర్ కంపెనీనే ఆ పని చేసింది. ఇంటర్నల్ మిస్టేక్ వల్ల తన అకౌంట్ బ్లాక్ అయినట్లు తర్వాత ఆయనే ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
just setting up my twttr…again (account suspension was an internal mistake)
— 🚶🏽jack (@jack) November 23, 2016
డార్సేకు మెసేజ్లు పంపించాలని ప్రయత్నించిన నెటిజన్లకు ఆయన ట్విట్టర్ ఖాతా బ్లాక్ అయినట్లు కనిపించింది. కొద్ది సేపటి తర్వాత గమనించిన డార్సే సాంకేతిక లోపం కారణంగా అకౌంట్ బ్లాక్ అయ్యిందని వివరణ ఇచ్చారు. కాగా, వినియోగదారులు తమ ఖాతాలను డియాక్టివేట్ చేసినా ట్విట్టర్ వారి అకౌంట్లను సస్పెండ్ చేస్తుంది.
సహవ్యవస్థాపకుడైన డార్సే నిరుడు సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. ఉద్యోగుల కోత, నిరుత్సాహపరిచిన ఆర్థిక ఫలితాల నేపథ్యంలో చీఫ్ ఆపరేటింగ్ అధికారిగా పనిచేసిన అదమ్ బైన్ తన పదవి నుంచి తప్పుకొంటున్నట్లు ఈయేడాది నవంబర్ మొదట్లో సంస్థ ప్రకటించారు.