బుధవారం రాజీనామా చేయనున్న శ్రీలంక అధ్యక్షుడు
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఈనెల 13వ తేదీన రాజీనామా చేయనున్నారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. మరోవైపు శ్రీలంకకు భారత్ బలగాలను పంపిస్తోందనే వార్తలను మన రాయబార కార్యాలయం తోసిపుచ్చింది. రాజీనామా చేయడానికి ముందుకు వచ్చిన గొటబాయ 13న దాన్ని సమర్పించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. అధికారికంగా అధ్యక్షుడే తెలిపినట్లు పేర్కొంది. అఖిల పక్ష ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా ప్రధానమంత్రి కూడా పదవి నుంచి తప్పుకుంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాత్కాలికంగా ప్రభుత్వం ఏర్పాటు చేసి ఎన్నికలకు వెళ్లాలని రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్నాయి.
శ్రీలంకలో కొనాసగుతున్న నిరసనలను కట్టడి చేసేందుకు భారత్ బలగాలను పంపుతోందన్న వార్తలు అక్కడి మీడియాలో వస్తున్నాయి. అయితే వాటిని లంకలోని భారత రాయబార కార్యాలయం ఖండించింది. ఇటువంటి అభిప్రాయాలు ప్రభుత్వ పరిశీలనలో లేవని తేల్చిచెప్పింది. సంక్షోభ సమయంలో లంక ప్రజలకు భారత్ అండగా ఉంటుందన్నారు.
అధ్యక్షుడు, ప్రధానమంత్రి అధికారిక నివాసాల్లో ఆందోళనకారులు వంట చేసుకొని అక్కడే భోజనం చేస్తున్నారు. అక్కడే నిద్రిస్తున్నారు. మరికొందరు జిమ్ చేస్తున్నారు. కొందరు ఈత కొడుతూ సేదదీరుతున్నారు. తాజాగా ప్రధానమంత్రి నివాసంలో యువకులు మాక్ రెజ్లింగ్ చేస్తున్నర దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
శ్రీలంక అధ్యక్ష, ప్రధానమంత్రి నివాసాల్లోకి చేరుకున్న ఆందోళనకారులు మూడు రోజుల నుంచి అక్కడే గడుపుతున్నారు. ముందుగా వారు కొన్ని నోట్ల కట్టలను, బంకర్ ను గుర్తించారు. స్థానికులు కూడా ఈ భవనాలను చూసేందుకు తరలివస్తున్నారు. ప్రస్తుతం గొటబాయ ఎక్కడ ఉన్నారు? ఎవరు ఆతిథ్యం ఇచ్చారు? అనే విషయం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చకు వస్తోంది.