ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య..చనిపోయిన వ్యక్తుల ట్విట్టర్, ఫేస్ బుక్ అకౌంట్లకు వారసులెవరు ?.
హైదరాబాద్ : ఈ విశాల ప్రపంచంలో తలెత్తే సందేహాలు, అనుమానాలు, ప్రశ్నలకు ఎక్కడో ఓ చోట సమాధానం దొరుకుతుంది. కానీ సమాధానం లేని ప్రశ్నలే మెదడును తొలచివేస్తాయి. మనం పోయాక ఇల్లు, భూమి, లేదా డిపాజిట్ చేసిన నగదు, ఇన్సూరెన్స్ పాలసీని సంబంధిత నామినీకి ఇస్తారు. ప్రపంచం మొత్తం ఇవే నియమాలు ఉన్నాయి. అయితే కొత్తగా సోషల్ మీడియా అకౌంట్లకు వారసులెవరు అనే ప్రశ్నకు సమాధానం లేదు. దీనిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
ఓపెన్ కానీ అకౌంట్లు ,,ఏం జరిగిందో తెలియదు ?
రెండేళ్ల క్రితం బ్రిటన్ లో ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఉన్నట్టుండి సూసైడ్ చేసుకోవడం తల్లిదండ్రులను కలవరానికి గురిచేసింది. ఆమె మొబైల్ ఎక్కువగా వాడేదని .. ఇన్ స్ట్రాగ్రామ్ అకౌంట్ చూస్తే కారణం తెలుస్తోందని అనుకున్నారు. కానీ పాస్ వర్డ్ తెలియకపోవడంతో వారిది విఫలయత్నమే అయ్యింది. దీనిపై కంపెనీని సంప్రదించినా ఫలితం లేకపోయింది.
ఇతరులు తెరవాడానికి వీల్లేదు
ఒక ఖాతాలో సంబంధింత వ్యక్తి షేర్ చేసే ఫోటోలు, వీడియోలు సమాచారం వారి సొంతమవుతోంది. అనుకొని పరిస్థితుల్లో అకౌంట్ హోల్డర్ చనిపోతే ఏమవుతుందనే ప్రశ్నకు కొన్ని కొన్ని సామాజిక మాధ్యమాలు ఒకలా స్పందిస్తున్నాయి. చనిపోయిన వారి అకౌంట్ తెరిచేందుకు ససేమిరా అంటోంది ఇన్ స్ట్రాగ్రామ్. ఇది తమ నిబంధనలకు విరుద్ధమని తేల్చిచెబుతోంది. దీనిపై కోర్టు ఆదేశాలు ఉంటే తప్ప .. తాము వ్యక్తిగత గోప్యత పాటిస్తామని స్పష్టంచేసింది.
మెమోరియల్ ఫేజీకి ఓకే ...
ఒక వేళ ఖాతాదారుడు చనిపోతే డిజిటల్ డేటాను ఎవరికి ఎంతమేర ఇవ్వొచ్చని నిర్ణయించుకొనే అవకాశాన్ని గూగుల్ కల్పిస్తోంది. చనిపోయిన వారి ఖాతాలను రద్దు చేయడం లేదంటే మెమోరియల్ ఫేజ్ గా మార్చడానికి కుటుంబాలకు ఫేస్ బుక్, ఇన్ స్ట్రాగ్రామ్ ఛాన్స్ ఇస్తోంది. అయితే ఆ స్మారక పుటల్లో మాత్రమే సమాచారం కనిపిస్తోంది .. దాని మార్చే వీలుండదు. తమ ఖాతాలకు వారసులను కూడా నామినేట్ చేసుకునే వెసులుబాటును ఫేస్ బుక్ కల్పించింది. అకౌంట్ డిలీట్ చేసిన అందులోని సమాచారాన్ని కొంతకాలం పాటు పదిలంగా ఉంచుతామని స్పష్టం చేస్తుంది.
డిలేట్ చేయడమే మేలు ..?
సోషల్ మీడియాలో వివిధ సైట్ల పరిస్థితి ఇలా ఉంటే .. ఖాతాదారుడు చనిపోగానే అతని అకౌంట్ డిలేట్ చేయడమే మేలంటున్నారు నిపుణులు. అకౌంట్ లోని వ్యక్తిగత సమాచారాన్ని డిలేట్ చేయాలని ... ఫొటోలు, ఇతర సమాచారంపై మాత్రం వారసులకు హక్కు కల్పించాలని సూచిస్తున్నారు.
ఏ దేశంలో ఎలా ...?
ఇదిలాఉంటే డిజిటల్ వారసత్వానికి సంబంధించి గతేడాది యూరోపియన్ యూనియన్ జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ పేరుతో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. దీంతో తమ డేటా కాపీ ఇవ్వాల్సిందిగా లేదా తొలగించాల్సిందిగా ఇంటర్నెట్ కంపెనీలను కోరే హక్కు ఖాతాదారులకు ఉంటుంది. ఈ నియమం జీవించి ఉన్నవారికే వర్తిస్తుంది. దీనిపై అక్కడి న్యాయ కోవిదులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత సమాచారం ఆస్తి కాదని .. దానిని అమ్మడమో . లేదా ఇతరులకు బదలాయించడమో సాధ్యం కాదని చెప్తున్నారు. ఇక ఫ్రాన్స్ లో మాత్రం సోషల్ మీడియా డేటాను ఏం చేయాలనే అంశం ప్రజలకు చెప్పే హక్కు ఉంది. కెనడాలో అయితే చనిపోయిన వారి ఖాతాను వారి వారసులు తెరిచే వెసులుబాటు ఉంది. ఉత్తరాల లాగే సమాచారాన్ని కూడా వారసులకు హక్కుగా పరిగణించాలని జర్మనీ కోర్టు గతేడాది స్పష్టంచేసింది. దీంతో చనిపోయిన వారి కుటుంబసభ్యుల వ్యక్తిగత సమాచారం పొందే వీలుంది. చనిపోయిన వారు సామాజిక మాధ్యమాల్లో ఎవరితో, ఎప్పుడు మాట్లాడారన్నది చూడొచ్చు .. కానీ చదవాలంటే మాత్రం కోర్టు లేదా ఖాతాదారుడి అనుమతి తప్పనిసరి అనే నిబంధన ఉంది.