ఉత్తరకొరియాతో ప్రపంచానికే ముప్పు: ట్రంప్, మూన్ జే-ఇన్తో మంతనాలు, ‘వెయ్యి రెట్టు ప్రతీకారం’!
ఉత్తరకొరియా ప్రపంచానికే ప్రమాదకరంగా పరిణమించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు భద్రతా మండలి ఆర్థిక ఆంక్షలు విధించడంపై ఉత్తరకొరియా మండిపడింది.
వాషింగ్టన్: ఉత్తరకొరియాతో యావత్ ప్రపంచానికే పెను ప్రమాదం ముంచుకొస్తోందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఉత్తరకొరియా వ్యవహారశైలిపై ఆయన దక్షిణ కొరియా అధినేత మూన్ జే-ఇన్తో సోమవారం ఫోన్లో మాట్లాడారు.
ఉత్తరకొరియాపై భద్రతామండలి విధించిన ఆంక్షలను నేతలిద్దరూ సమర్థించారు. అమెరికా, దక్షిణ కొరియా, జపాన్కే కాదు ప్రపంచంలోని చాలాదేశాలకు ఉత్తరకొరియా ప్రమాదకరంగా పరిణమించిందన్న అంశంపై నేతలు ఏకీభవించినట్లు వైట్హౌస్ ఓ ప్రకటనలో వెల్లడించింది.
మరోవైపు, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షలు విధించడంపై ఉత్తర కొరియా నిప్పులు చెరిగింది. ఈ చర్యకు ప్రేరేపించిన అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతినబూనింది. అమెరికా ఇంతకు వెయ్యి రెట్లు మూల్యం చెల్లించుకొనేలా చేస్తామని హెచ్చరించింది.

ఆంక్షలను కఠినంగా అమలు చేయాలి...
భద్రతామండలి ఆంక్షలను కఠినంగా అమలు చేసేలా చూడాలని నిర్ణయించిన ట్రంప్, మూన్.. అంతర్జాతీయ సమాజం కూడా తమతో కలిసిరావాలని పిలుపునిచ్చారు. ఈ ఫోన్ మంతనాల అనంతరం ట్రంప్ ట్విట్టర్లో 15-0 ఓట్లతో ఉత్తర కొరియాపై భద్రతామండలి ఆంక్షలు విధించడం తనకు ఆనందాన్నిచ్చిందని ప్రకటించారు.

ఇకనైనా ఉత్తరకొరియా గ్రహిస్తే మంచిది...
ఉత్తర కొరియా దుందుడుకు చర్యలపై అమెరికా సీరియస్గా ఉందన్న విషయాన్ని ఇకనైనా ఉత్తరకొరియా గ్రహించాలని ఐక్యరాజ్యసమితిలో అమెరికా ప్రతినిధి నిక్కీహేలీ అన్నారు. వారి ఎగుమతుల్లో మూడోవంతు నిలిచిపోనున్నాయని, భద్రతామండలి నిర్ణయం గట్టి సంకేతాలను పంపిందనే భావిస్తున్నామని ఆమె పేర్కొన్నారు.

శాంతి చర్చలకు ఉత్తర కొరియా ‘నో’...
ఆంక్షల విధింపు తమ సార్వభౌమత్వాన్ని దారుణంగా ఉల్లంఘించడమేనని ఉత్తర కొరియా సోమవారం వ్యాఖ్యానించింది. తమ అణ్వస్త్ర కార్యక్రమంపై చర్చల్లో పాల్గొనబోమంటూ ప్రకటన చేసింది. ఐదు శాశ్వత, పది తాత్కాలిక సభ్యదేశాలు కలిపి భద్రతా మండలిలోని మొత్తం 15 దేశాలూ ఉత్తర కొరియాపై ఆంక్షలకు అనుకూలంగా ఓటేశాయి. మరోవైపు దక్షిణ కొరియా చేసిన శాంతి చర్చల ప్రతిపాదనను ఉత్తరకొరియా తిరస్కరించింది. ఇరుదేశాల విదేశాంగ మంత్రుల భేటీలో ఈ పరిణామం చోటు చేసుకుందని యోన్హాప్ వార్తా సంస్థ సోమవారం వెల్లడించింది.

ఇంతకు వెయ్యి రెట్లు... ఉత్తర కొరియా హెచ్చరిక
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షలు విధించడంపై ఉత్తర కొరియా నిప్పులు చెరిగింది. ఈ చర్యకు ప్రేరేపించిన అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ఉత్తరకొరియా విదేశాంగ మంత్రి రీ యాంగ్ హో తెలిపారు. అమెరికా ఇంతకు వెయ్యి రెట్లు మూల్యం చెల్లించుకొనేలా చేస్తామని హెచ్చరించారు. ఆంక్షల తీర్మానంపై అమెరికాకు వంత పాడిన దేశాలనూ జవాబుదారీ చేస్తామన్నారు.

ఇక చైనా ‘సహకారం’ లేనట్లే...
గత నెలలో రెండు ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి పరీక్షలను విజయవంతంగా నిర్వహించినప్పటి నుంచి ఉత్తర కొరియాపై అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ ఒత్తిడి పెంచుతూ వస్తున్నాయి. ఉత్తర కొరియా నుంచి బొగ్గు, ఇనుము, ముడి ఇనుము, సీసం, ముడి సీసం, మత్స్య సంపద ఎగుమతులతోపాటు మరికొన్ని ఇతర అంశాల్లో ఆంక్షలను విధించే తీర్మానానికి భద్రతా మండలి వారాంతంలో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. రష్యాతోపాటు ఉత్తర కొరియా కీలక మద్దతుదారైన చైనా కూడా దీనికి మద్దతు పలికింది.
-
యుద్ధం ఆగిపోయింది. ట్రంప్ సంచలన ప్రకటన -
అదే జరిగితే ఇరాన్ ను అంతం చేస్తాం: ట్రంప్ వార్నింగ్ -
Donald trump: ట్రంప్ ప్రకటనతో కుప్పకూలిన చమురు, గ్యాస్ ధరలు..! -
ట్రంప్ మాటలు నమ్మొద్దు.. యుద్ధం కొనసాగుతోంది: ఇరాన్ సంచలనం -
కుప్పకూలుతున్న అమెరికా ఫైటర్ జెట్స్.. వెనక్కు తగ్గిన ట్రంప్..!! -
ఖమేనీ సంధి ఒప్పందం? -
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
ట్రంప్ కు ముందు నుయ్యి, వెనుక గొయ్యి-ఎలాగో చెప్పిన మాజీ రక్షణమంత్రి..! -
అమెరికా అలా చేస్తే ట్రంప్ తల తీసుకెళ్తాం: ఇరాన్ సంచలన వార్నింగ్ -
ఇజ్రాయెల్ కు షాకిచ్చిన ట్రంప్, ఇప్పుడు ఏం చేద్దాం? -
Trump: ట్రంప్ ప్రకటనపై స్పందించిన కేంద్రం- కీలక వ్యాఖ్యలు..! -
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్












Click it and Unblock the Notifications