కిమ్ నోట.. శాంతి మాట! ఉత్తరకొరియా వైఖరి మారుతోందా!? అపనమ్మకంలో అమెరికా!
వాషింగ్టన్: ఉత్తరకొరియా వైఖరి మారుతోందా? ఆ దేశ నియంత కిమ్ జాంగ్ ఉన్ మనసు మార్చుకున్నారా? దక్షిణ కొరియాతోనూ, అగ్రరాజ్యం అమెరికాతోనూ సఖ్యత కుదుర్చుకోవాలని ఆయన భావిస్తున్నారా?
ప్రస్తుత పరిస్థితుల్లో.. ఈ ప్రశ్నలన్నింటికీ 'అవును' అనే సమాధానమే వినిపిస్తోంది. ఇన్నాళ్లూ క్షిపణులు ఎక్కుపెట్టి ప్రపంచ దేశాలను గడగడలాడించిన ఉత్తరకొరియా అధినేత కిమ్ ప్రస్తుతం శాంతి మంత్రం జపిస్తున్నారు.

కిమ్ నోట.. శాంతి మాట...
ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ శాంతి మంత్రం జపించారు. జనవరి 1న కొత్త సంవత్సరం సందర్భంగా ఆయన ఇచ్చిన సందేశంలో శాంతి ప్రస్తావన తీసుకురావడం ప్రపంచ దేశాలను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. ఏదేమైనా కొత్త సంవత్సరం కిమ్లో కాస్తయినా మార్పు తీసుకొచ్చినందుకు పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకీ కిమ్ ఏమన్నారంటే...
‘‘ఉత్తర కొరియా ప్రజలు కోరుకునేది ఒక్కటే.. శాంతి. ఏ దేశమూ ఒంటరిగా అభివృద్ధి సాధించలేదు. అందుకు పొరుగు దేశాల సహకారం చాలా అవసరం. దక్షిణ కొరియాతో దౌత్యానికి ఉత్తర కొరియా ఎల్లప్పుడూ సిద్ధం.. '' అంటూ కిమ్ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.

దౌత్యం మొదలవుతుందా?
కిమ్ జాంగ్ ఉన్ సందేశాన్ని ఇటు ఆ దేశ రాజధాని ప్యోంగ్యాంగ్తోపాటు అటు దక్షిణ కొరియా రాజధాని సియోల్ నుంచి వెలువడే అన్ని ప్రముఖ పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. మరోవైపు చర్చల ప్రతిపాదనను సియోల్ వర్గాలు కూడా ధృవీకరించాయి. ఈ నేపథ్యంలో శాంతి చర్చలకు అమెరికా చొరవ తీసుకోవాలని ఇతర దేశాలు కూడా సూచిస్తున్నాయి.

అమెరికా అనుమానాలు...
ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ వైఖరిలో మార్పు వచ్చిదనే విషయాన్ని అమెరికా మాత్రం అంత తేలికగా నమ్మడం లేదు. ‘ఉత్తరకొరియా ప్రకటనను తక్షణమే స్వాగతించలేం. అణ్వాయుధాల నిషేధం అమలు.. కవ్వింపు చర్యలను అది పూర్తిగా నిలిపివేశాకే ఆ దిశగా ఆలోచిస్తాం. దక్షిణ కొరియాకు మేం సూచించేది కూడా అదే..' అంటూ ఐక్యరాజ్యసమితిలో నిక్కీ హేలీ వ్యాఖ్యానించడం అమెరికా వైఖరిని స్పష్టం చేస్తోంది.

అమెరికా చొరవ తీసుకోవాలి...
ఉత్తరకొరియా వైఖరిలో మార్పు కనిపించిన తరుణంలో అమెరికా స్వచ్ఛందంగా దౌత్యానికి ముందుకురావడం మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాటల యుద్ధానికి తెరదించి.. రెండు దేశాలూ తటస్థ వేదికగా చర్చలు జరపడం మంచిదనే సూచనలు వస్తున్నాయి.

తెరపైకి ‘ఫ్రీజ్ ఫర్ ఫ్రీజ్’ ఒప్పందం ...
ఉత్తరకొరియా ఒక మెట్టు దిగిన నేపథ్యంలో.. గతంలో రష్యా, చైనా చొరవతో ప్రతిపాదించిన ‘ఫ్రీజ్ ఫర్ ఫ్రీజ్ ఒప్పందం' అమలు చేయాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం... ఉత్తరకొరియాపై ఉన్న ఆంక్షలన్నింటినీ అమెరికా తక్షణమే ఎత్తివేయాల్సి ఉంటుంది. ఉత్తరకొరియా కూడా దశల క్షిపణి కార్యక్రమానికి దశల వారీగా నియంత్రణ పాటిస్తూ.. అణ్వాయుధాల నిషేధం దిశగా అడుగులు వేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే శాంతి చర్యలు దశలవారీగా కొనసాగుతాయి.












Click it and Unblock the Notifications