ఆఫ్ఘనిస్తాన్లో హైస్కూల్పై ఉగ్రవాదుల దాడి: వరుస పేలుళ్లు: పలువురి దుర్మరణం
కాబుల్: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్లో వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 25 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉంది. మృతుల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో ఉన్నారు. పేలుడు సమాచారం అందిన వెంటనే భద్రత సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
ఈ పేలుళ్లను తాలిబన్ ప్రభుత్వం ఉగ్రవాద చర్యగా అనుమానిస్తోంది. ఇస్లామిక్ స్టేట్స్ ఆఫ్ సిరియా అండ్ లావెంట్ (ఐసిస్) లేదా సున్నీ ఉగ్రవాద గ్రూపులు ఈ దాడులకు తెగబడి ఉంటాయని భావిస్తోంది. ఈ మారణకాండ వెనుక ఐసిస్-ఖొరాసన్ ప్రావిన్స్ ఉగ్రవాదుల ప్రమేయం ఉండొచ్చంటూ వార్తలు వెలువడుతున్నాయి. ఐసిస్-కే ఉగ్రవాదులు కొంతకాలంగా క్రియాశీలకంగా ఉంటోన్నారని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి స్పష్టం చేశారు. ఈ ఘటనకు తామే కారణమంటూ ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థగానీ ప్రకటించుకోలేదు.
కాబుల్ పశ్చిమ ప్రాంతం శివార్లలోని దష్త్-ఇ-బార్చీలోని అబ్దుల్ రహీమ్ షహీద్ హైస్కూల్లో ఈ వరుస పేలుళ్లు సంభవించాయి. మూడు శక్తిమంతమైన బాంబులు వెంటవెంటనే పేలినట్లు స్థానిక భద్రత బలగాలు వెల్లడించాయి. షియా హజారా సామాజిక వర్గానికి చెందిన ముస్లింలు పెద్ద సంఖ్యలో నివసించే ప్రాంతం ఇది. షియా సామాజిక వర్గ ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడినట్లు కాబుల్ తాలిబన్ ప్రభుత్వ కమాండర్ అధికార ప్రతినిధి ఖలీద్ జడ్రాన్ తెలిపారు.
కాబుల్ పశ్చిమ ప్రాంతంలోని హైస్కూల్లో వెంటవెంటనే మూడు బాంబు పేలుళ్లు సంభవించాయని, ఘటన చోటు చేసుకున్న వెంటనే కాబుల్ పోలీస్ అధికారులు తక్షణ చర్యలకు దిగారని చెప్పారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని ఆఫ్ఘనిస్తాన్ మీడియా తెలిపింది. పేలుడుకు గల కారణాలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారని, ఉగ్రవాద చర్యగా భావిస్తున్నారని పేర్కొంది.