ఇండియాలో 73% స్మార్ట్ ఫోన్లు చైనావే.. బైకాట్ పిలుపుతో ‘చింగారీ యాప్’ దూకుడు.. ప్లేస్టోర్లో ట్రెండ్.
కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిషేధం విధించనప్పటికీ చైనా వస్తువులు, ఆదేశానికి చెందిన యాప్ ల బహిష్కరణ జోరుగా కొనసాగుతోంది. ''బైకాట్ చైనా ప్రాడక్ట్స్'' ఉద్యమ ఉధృతి రోజురోజుకూ పెరుగుతున్నది. ఈ క్రమంలోనే టిక్ టాక్ కు పోటీగా రూపొందించిన దేశీ యాప్ ''చింగారీ'' సంచలనంగా మారింది. కేవలం 72 గంటల్లో 5లక్షలకుపైగా డౌన్ లోడ్స్ సాధించిన చింగారీ యాప్.. గూగుల్ ప్లే స్టోర్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నది.
ఎట్టకేలకు ఒప్పుకున్న చైనా.. కమాండింగ్ ఆఫీసర్ చనిపోయాడని వెల్లడి.. సైనికుల సంఖ్యపై గోప్యత..
చింగారి యాప్ ట్రెండింగ్ లో నిలవడంపై దాని సహ వ్యవస్థాపకుడు బిశ్వాత్మ నాయక్ మీడియాతో మాట్లాడారు. మారిన పరిస్థితుల దృష్ట్యా భారతీయులంతా ఇప్పుడు టిక్ టాక్ కు ప్రత్యామ్నయాన్ని వెతుకుతున్నారని, జనం అంచనాలకు మించి అద్భుతమైన ఫీచర్లతో చింగారీని రూపొందించామని, యాప్ లో ఎవరి వీడియోలు వైరల్ అవుతాయో వారికి పాయింట్లు కూడా లభిస్తాయని, పాయింట్లను డబ్బులుగా మార్చుకునే అవకాశం కూడా ఉందని, ప్రస్తుతానికి ఇంగ్లిష్, హిందీ, తెలుగు, మరాఠి, బంగ్లా, పంజాబీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో సేవలు అందిస్తున్నట్లు నాయక్ తెలిపారు.
బైకాట్ చైనా ప్రాడక్ట్స్ పిలుపు ఊపందుకుంటున్న వేళ భారతీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్ షేర్ కు సంబంధించి తాజా రిపోర్టులు వైరల్ అయ్యాయి. 2020 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారతీయులు కొనుగోలు చేసిన స్మార్ట్ ఫోన్లలో 73 వాతం వాటా చైనా కంపెనీలదేనని వెల్లడైంది. స్మార్ట్ ఫోన్ మార్కెట్ లెక్కల ప్రకారం ఫస్ట్ క్వార్టర్ లో అమ్ముడైన స్మార్ట్ ఫోన్లలో షామీ(చైనా) బ్రాండ్ 30 శాతం, వివో(చైనా) 17 శాతం, సాంసంగ్(సౌత్ కొరియా) 16 శాతం, రియల్ మీ(చైనా) 14 శాతం, ఒప్పో(చైనా) 12 శాతం వాటాను కైవసం చేసుకోగా, మిగతా బ్రాండ్లు అన్నీ కలిపి 11 శాతం వాటా దక్కించుకున్నాయి.
గూగుల్ ప్టే స్టోర్ లో చైనా యాప్ లను కేంద్రం నిషేధించిందంటూ టెలికాం శాఖ జారీ చేసినట్లుగా ఓ ఫేక్ జీవో వైరల్ కావడంతో కేంద్ర సర్కారు వివరణ ఇచ్చింది. చైనా యాప్స్ లేదా ప్రాడక్ట్స్ నిషేధానికి సంబంధించి తాము ఎలాంటి జోవో జారీ చేయలేదని, తప్పుడు వార్తల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది.