Time Magazine: ప్రధాని మోడీ, మమత బెనర్జీ సరసన తాలిబన్ లీడర్ ముల్లా బరాదర్
వాషింగ్టన్: టైమ్ మ్యాగజైన్.. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన 100 మంది అత్యంత శక్తిమంతులు, ప్రభావశీలురు, స్ఫూర్తిదాయక వ్యక్తుల జాబితాను విడుదల చేస్తుంటుంది. ఈ జాబితాలో చోటు దక్కడం మంటే అసాధారణ విషయం. భూగోళం మీద నివసించే ఇన్ని కోట్ల మందిలో 100 మందిని మాత్రమే ఎంపిక చేస్తుంటుంది టైమ్ మ్యాగజైన్. కోట్లాదిమందికి స్ఫూర్తినిచ్చేవారిగా గుర్తిస్తుంటుంది. ఆ ఆనవాయితీని ఈ ఏడాది కొనసాగించింది.
భారత్ నుంచి..
మోస్ట్ ఇన్ఫ్లూయెన్సియల్ పీపుల్ 2021 (Time Magazine's 100 Most Influential People of 2021) లిస్ట్ను విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి స్థానం లభించింది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆదార్ పూనావాలాకు చోటు దక్కింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమల హ్యారిస్ ఉన్నారు.
తాలిబన్ లీడర్..
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధినేత గ్ఝి జిన్పింగ్, డ్యూక్ అండ్ డచెస్ ఆఫ్ సస్సెక్స్ ప్రిన్స్ హ్యారీ అండ్ మెఘాన్ లిస్ట్లో చోటు దక్కింది. ఆశ్చర్యకరంగా- కరడుగట్టిన మత ఛాందసవాదులైన తాలిబన్ సహ వ్యవస్థాపకుడు, ఆప్ఘనిస్తాన్ తాత్కాలిక ప్రభుత్వ ఉప ప్రధానమంత్రి ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్కు టైమ్ మేగజైన్ 100 మంది ప్రభావశీల వ్యక్తుల జాబితాలో చోటు లభించింది. ఒక తాలిబన్ నాయకుడి పేరు- ఈ టైమ్ మ్యాగజైన్ లిస్ట్లో కనిపించడం ఇదే తొలిసారి.
జో బైడెన్, జిన్పింగ్ కేటగిరీలో..
జో బైడెన్, గ్ఝి జిన్పింగ్ ఉన్న కేటగిరీలో ముల్లా బరాదర్ను చేర్చింది టైమ్ మేగజైన్. అమెరికా తన సైనిక బలగాల ఉపసంహరణ ప్రక్రియను మొదలు పెట్టిన వెంటనే- తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించడం మొదలు పెట్టారని పేర్కొంది. సైనిక బలగాల ఉపసంహరణ పూర్తిగా ముగియక ముందే- తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించుకున్నారని వివరించింది. ఎలాంటి రక్తపాతం లేకుండా రాజధాని కాబుల్ను తమ వశం చేసుకున్నారని, ఆ సమయంలో తాము ముల్లా బరాదర్ను సంప్రదించామని తెలిపింది.
శక్తిమంతంగా తాలిబన్లు..
రెండు దశాబ్దాలకు పైగా ఉనికి కోల్పోయిన తాలిబన్లను.. ఓ దేశాన్ని ఆక్రమించుకునే స్థాయిలో సజీవంగా ఉంచగలడంలో ముల్లా అబ్దుల్ ఘనీ బరాదార్ కీలక పాత్ర పోషించినట్లు తాము భావిస్తున్నట్లు టైమ్ మేగజైన్ పేర్కొంది. మాజీ ప్రభుత్వ పెద్దలకు క్షమాబిక్ష పెడతామని, రక్తపాత రహితంగా పాలన సాగిస్తామని ఆయన పేర్కొన్నట్లు స్పష్టం చేసింది. కాబుల్ను ఆక్రమించుకున్న వెంటనే- పాకిస్తాన్, చైనాతో సత్సంబంధాలను ఏర్పరచుకోవడంలో ముల్లా బరాదర్ కీలకంగా మారినట్లు తెలిపింది.
ఉప ప్రధానిగా అపాయింట్
ఆప్ఘనిస్తాన్ను ఆక్రమించుకున్న వెంటనే తాలిబన్లు కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సమాయాత్తమైన విషయం తెలిసిందే. అది తాత్కాలికమే. ఈ తాత్కాలిక ప్రభుత్వం ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్కు ఉప ప్రధానమంత్రి పదవి లభించింది. ప్రధానమంత్రిగా అఖుండ్జాదా అపాయింట్ అయ్యారు. ప్రస్తుతం బరాదర్.. తాలిబన్ల ప్రధాన కార్యాలయంగా చెప్పుకొనే కాందహార్లో నివసిస్తోన్నారని, పదవుల పంపకాల విషయంలో అసంతృప్తితో ఉన్నారంటూ వార్తలొస్తోన్నాయి.
హక్కానీ నెట్వర్క్తో గొడవలు..
ఈ విషయంలో బరాదర్- హక్కానీ నెట్వర్క్ నేతల మధ్య ఘర్షణ సైతం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలను తాలిబన్లు కొట్టిపారేశారు. అలాంటివేమీ లేవని తేల్చి చెప్పారు. రాజధాని కాబుల్లోని అధ్యక్ష భవనంలో ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోలేదని స్పష్టం చేశారు. అబ్దుల్ ఘనీ బరాదర్-హక్కానీ నెట్వర్క్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. బరాదర్ కనిపించకపోవడానికి ప్రత్యేకించి ఎలాంటి కారణాలు లేవని, ఆయన తమతో రోజూ సంప్రదింపులు నిర్వహిస్తున్నారని అన్నారు.
Recommended Video
వీడియోతో ఆ అనుమానాలు తీరినట్టే..
ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఆయన సలహాలను తీసుకుంటున్నామని తాలిబన్లు చెబుతున్నారు. హక్కానీ నెట్వర్క్ లీడర్లతో జరిగినట్లుగా చెబుతోన్న దాడిలో ముల్లా బరాదర్ గాయపడటం వల్ల పెద్దగా వార్తల్లో కనిపించట్లేదనే వాదనలు సైతం వినిపిస్తోన్నాయి. ఆయన మరణించినట్లుగా కూడా పుకార్లు వచ్చినప్పటికీ.. తాను జీవించే ఉన్నానంటూ ఓ వీడియోను బరాదర్ విడుదల చేశారు. ప్రధానమంత్రి పదవిపై ముల్లా బరాదర్ ఆశ పెట్టుకున్నారని, అది దక్కకపోవడంతో అజ్ఙాతంలో ఉంటున్నారని విదేశీ మీడియా చెబుతోంది.