400 మంది.. బట్టలు చించి, గాల్లోకి వేసి పైశాచిక ఆనందం..
దయాది పాకిస్తాన్లో దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరో ఘటన వెలికిలోకి వచ్చింది. పాకిస్థాన్ స్వాతంత్ర్యం ఆగస్ట్ 14వ తేదీన వచ్చింది.. కానీ అదే రోజు టిక్ టాక్ వీడియోలు చేసే ఓ యువతిపై వందలాది మంది మగాళ్ల రాక్షసత్వం ప్రపంచానికి తెలిసింది. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. చుట్టూ మూగిన 400 మంది మృగాళ్ల నుంచి తప్పించుకునేందుకు ఆ అమ్మాయి చేసిన ప్రయత్నాలన్నీ వృథా ప్రయాసే అయ్యాయి.
Recommended Video
ఆగస్టు 14వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లాహోర్ లోని గ్రేటర్ ఇక్బాల్ పార్క్లో ఐదుగురు సహచరులతో కలిసి వీడియో తీస్తున్న టిక్ టాకర్ను ఆ అల్లరి మూక హింసించింది. గుమిగూడి ఆ అమ్మాయిపై 400 మంది అకృత్యాలకు పాల్పడ్డారు. ఆమెను తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారు. బట్టలు చించేశారు. గాల్లోకి విసిరేసి వికృతానందం పొందారు. నడిబజార్ లో ఆ అమ్మాయిని బట్టల్లేకుండా నడిపించారు.
అంతేకాదు.. ఆమె ఒంటిపైనున్న బంగారు ఆభరణాలను దోచేశారు. సెల్ ఫోన్ ను లాక్కున్నారు. డబ్బులను దొంగిలించారు. ఆ బాధాకరమైన వీడియో నెట్టింట్లో వైరల్గా మారడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఆటవిక సమాజంలోనే ఉన్నామా? అంటూ ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. ఘటనపై బాధిత యువతి లాహోర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. శనివారం స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మినారీ పాకిస్థాన్ వద్ద తన ఆరుగురు సహచరులతో కలిసి వీడియో తీస్తుండగా.. 400 మంది తనను లైంగికంగా, శారీరకంగా హింసించారని ఫిర్యాదులో పేర్కొంది.
ఆ అల్లరి మూకల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినా.. ఫలితం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేసింది. కొందరు తనను కాపాడే ప్రయత్నం చేసినా.. గుంపు ఎక్కువగా ఉండడంతో కుదరలేదని వివరించింది. తనను గాల్లోకి ఎగిరేసి, బట్టలు చించేసి వికృతానందం పొందారని నిట్టూర్చింది.