ఘోర విషాదం.. పడవలు బోల్తా పడి 193 మంది మృతి !
డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో (DRC) వరుసగా జరిగిన రెండు ఘోర పడవ ప్రమాదాలు దేశాన్ని విషాదంలో ముంచేశాయి. ఈక్వెటార్ ప్రావిన్స్ సమీపంలో గత బుధవారం, గురువారం జరిగిన ఈ రెండు ఘటనల్లో మొత్తం 193 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా వందలాది మంది ఆచూకీ తెలియకపోవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఈ రెండు దుర్ఘటనలు ఈక్వెటార్ ప్రావిన్స్కు 150 కిలోమీటర్ల దూరంలో చోటు చేసుకున్నాయి.
గురువారం సాయంత్రం లుకోలెలా నుంచి దాదాపు 500 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఒక పడవలో మార్గం మధ్యలో మంటలు చెలరేగి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 107 మంది మరణించినట్లు కాంగో ప్రభుత్వం ప్రకటించింది. 209 మందిని రక్షించగా.. మలాంగే గ్రామానికి చెందిన పడవ సహాయంతో ప్రయాణికులను ఒడ్డుకు చేర్చారు. అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం, ఈ ప్రమాదంలో 146 మంది గల్లంతైనట్లు ప్రభుత్వ నివేదికలో పేర్కొన్నారు.

కాగా అంతకుముందు బుధవారం బసాన్కుసు ప్రాంతంలో జరిగిన మరో పడవ ప్రమాదంలో 86 మంది మరణించారు. మరణించిన వారిలో ఎక్కువ మంది విద్యార్థులే కావడం గమనార్హం. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పడవల్లో ఓవర్లోడింగ్, నావిగేషన్ వ్యవస్థలో లోపాలు ఈ ప్రమాదాలకు దారితీసి ఉండవచ్చని అధికారిక మీడియా కథనాలు సూచించాయి.
అయితే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదాలు జరిగాయని పౌర సంఘాలు ఆరోపిస్తున్నాయి. కాంగోలో విస్తారమైన వర్షారణ్య ప్రాంతాలు ఉండటంతో నదీ రవాణా అక్కడి ప్రజలకు కీలకమైన జీవనాడిగా మారింది. ఇక్కడి గ్రామాల మధ్య ప్రజలు పాత చెక్క పడవల్లో ప్రయాణిస్తుంటారు. రోడ్డు రవాణా కంటే జలరవాణా చౌకగా ఉండటంతో, పడవలు తరచుగా సామర్థ్యానికి మించి ప్రయాణికులతో నిండిపోయి ప్రమాదాలకు కారణమవుతున్నాయని వాపోతున్నారు.












Click it and Unblock the Notifications