యుద్ధంతో సర్వం కోల్పోయారు.. వాళ్లకు అండగా ఉండండి: ప్రపంచ దేశాలకు ట్రంప్ సంచలన పిలుపు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారత్- పాకిస్థాన్ మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. అలాగే ఇజ్రాయెల్- హమాస్ మధ్య ఏళ్లకుఏళ్లుగా యుద్ధం సాగుతూనే ఉంది. ఈ క్రమంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్- హమాస్ యుద్దం కారణంగా గాజాలోని ప్రజల పరిస్థితి దయనీయంగా మారిందని.. మానవతా దృక్పథంతో వారిని ఆదుకోవాలని అన్నారు. ఆ ప్రాంత ప్రజలకు అన్ని విధాల అండగా ఉండాలని ప్రపంచ దేశాలకు ట్రంప్ పిలుపునిచ్చారు.
యుద్ధం కారణంగా గాజాలోని అనేక మంది ప్రజలకు ఆహారం లేదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. "ఈ ప్రాంతంలో లక్షలాది మంది ఆకలితో అలమటిస్తున్నారు. వారికోసం నెల రోజుల్లో మంచి పనులు చేసేందుకు అమెరికా ప్రభుత్వం సిద్దమైంది. పాలస్తీనా ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. గాజాలోని ఎంతో మంది ప్రజలు ఆకలితో ఉన్నారు. త్వరలో వారికోసం మంచి చేస్తాం" అని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. మానవతా దృక్పథంతో వారికి సాయం చేసేందుకు ప్రపంచ దేశాలు ముందుకు రావాలని ట్రంప్ పిలుపునిచ్చారు.
మరోవైపు వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం(WFP).. ఇదే విషయంపై ఆందోళన వ్యక్తం చేసింది. గాజాలోని ప్రజలు కరవుతో అల్లాడుతున్నారు. యుద్ధం మళ్లీ తీవ్రతరం కావడంతో బోర్డర్లు అన్నీ మూసేశారు. ఆహార నిల్వల కొరత ఉంది. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు.. అని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం అక్కడి పరిస్థితిని వివరించింది. మార్చి 2 నుంచి ప్రపంచ దేశాల సాయం ఆగిపోయిందని.. అప్పటి నుంచి అక్కడి పిల్లలు పౌష్టికాహార లోపంతో ఉన్నారని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం పేర్కొంది. గాజాలో దాదాపు 4 లక్షల 70 వేల మంది క్రిటికల్ హంగర్ తో ఉన్నారని వివరించింది.

మరోవైపు దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్, దేర్ అల్బలా నగరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. గత రెండు రోజుల నుంచి జరిగిన ఈ దాడుల్లో 82 మంది మృతి చెందినట్లు సమాచారం. ఇక ఇజ్రాయెల్, హమాస్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. గాజాపై ఇజ్రాయెల్ వరుస దాడులతో విరుచుకుపడుతోంది. ఇటీవల అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఒప్పందం కుదిరింది. కానీ మళ్లీ అక్కడి పరిస్థితి మొదటికి వచ్చినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications