Twitter CEO: పరాగ్ పరిస్థితేంటీ: తొలగించే సాహసం చేస్తారా?: మిలియన్ల కొద్దీ డాలర్ల పరిహారం
వాషింగ్టన్: సోషల్ మీడియా దిగ్గజం, టాప్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్.. ట్విట్టర్ కొనుగోలు వ్యవహారం ముగిసింది. ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్ఎక్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారీ కంపెనీ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేతికి వెళ్లింది. ట్విట్టర్ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేశారు. ఇప్పుడాయన ట్విట్టర్కూ కొత్త అధిపతి అయ్యారు. దీనికోసం ఎలాన్ మస్క్ ఇచ్చిన ఆఫర్ విలువ 44 బిలియన్ డాలర్లు. ఇప్పుడున్న ట్విట్టర్ యాజమాన్యానికి ఎలాన్ మస్క్ చెల్లించిన మొత్తం ఇది. మూడు నెలల వ్యవధిలో ఈ బదలాయింపు ప్రక్రియ పూర్తవుతుంది.
షేర్ హోల్డర్లకు భారీ చెల్లింపులు..
నిజానికి- ఈ సోషల్ మీడియా జెయింట్ ప్లాట్ఫామ్ను కొనుగోలు చేయడానికి మొదట్లో ఎలాన్ మస్క్ ఇచ్చిన ఆఫర్- 46.5 బిలియన్ డాలర్లు. డీల్ కుదిరే సమయానికి రెండున్నర బిలియన్ డాలర్ల మొత్తం తగ్గింది. 44 బిలియన్ డాలర్లతో ఈ డీల్ ఓకే అయింది. ఈ టేకోవర్ వ్యవహారంతో ట్విట్టర్ షేర్ హోల్డర్ల పంట పండినట్టే. ఒక్కో షేర్కు 54.20 డాలర్లను ఎలాన్ మస్క్ చెల్లిస్తారు. ఈ విషయాన్ని ఆయన ఇదివరకే ప్రకటించారు. దీన్ని ఈ ఒప్పందంలోనూ పొందుపరిచారు.
భారీగా పెరిగిన ట్విట్టర్ షేర్ల ధర
కార్పొరేట్ సెగ్మెంట్లోనే అతి పెద్ద టేకోవర్గా చెబుతున్నారు. యాజమాన్య బదలాయింపు ప్రక్రియ మొత్తాన్నీ మూడునెలల వ్యవధిలో పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సమాచారం వెలువడిన వెంటనే ట్విట్టర్ షేర్ల ధరలు రాకెట్లా దూసుకెళ్లాయి. ఒక్కసారిగా ఆరుశాతం మేర వాటి రేట్లు పెరిగాయి. ఈ ప్రతిపాదనలు తెరమీదికి వచ్చినప్పటి నుంచీ న్యూయార్క్ స్టార్ ఎక్స్ఛేంజ్లో ట్విట్టర్ షేర్ల ధరలు అధికమౌతూనే వస్తున్నాయి. ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఒక్కో షేర్ ధర 77 డాలర్ల మేర పెరిగింది.
నో అబ్జెక్షన్..
ట్విట్టర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో 11 మంది సభ్యులు ఉన్నారు. ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్య కార్యనిర్వహణాధికారి జేక్ డోర్సీ ఇందులో ఒకరు. ఎలాన్ మస్క్ ఇచ్చిన ఆఫర్పై సమగ్రంగా సమీక్ష, అధ్యయనం చేసింది. దీనికోసం జేపీ మోర్గాన్ అండ్ కంపెనీని నియమించుకుంది. ఈ కంపెనీ నుంచి అందిన నివేదికపై సమగ్రంగా సమీక్షించింది. అనంతరం మస్క్ ఇచ్చిన ఆఫర్పై ఆమోదముద్ర వేసింది. ట్విట్టర్ బోర్డ్ డైరెక్టర్లందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఎవరూ ఎలాంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేయలేదు.
సీఈఓ పరిస్థితేంటీ?
ఈ డీల్ తరువాత ట్విట్టర్ ముఖ్య కార్యనిర్వహణాధికారి, భారతీయుడైన పరాగ్ అగ్రవాల్ పరిస్థితేమిటనేది చర్చనీయాంశమౌతోంది. యాజమాన్యం చేతులు మారిన తరువాత ఆయన అదే స్థానంలో కొనసాగుతారా? లేక.. వైదొలగుతారా? అనేది ప్రశ్నార్థకమైంది. ఇప్పుడున్న సీఈఓ సహా ఇతర టాప్ కేడర్ అధికారులను ఎలాన్ మస్క్ సారథ్యంలో ఏర్పడబోయే కొత్త యాజమాన్యం కూడా కొనసాగిస్తుందా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
తొలగించాల్సి వస్తే..
ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగ్రవాల్ను తొలగించాల్సిన పరిస్థితే వస్తే- ఆయనకు ఎంత నష్ట పరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుందనేది హాట్ టాపిక్గా మారింది. 12 నెలల వ్యవధిలో ఈ అత్యున్నత హోదా నుంచి తొలగించాల్సి వస్తే- ట్విట్టర్ కొత్త మేనేజ్మెంట్ ఆయనకు 42 మిలియన్ డాలర్లను నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఇంత పెద్ద మొత్తాన్ని కంపెన్సేషన్గా చెల్లించి ఆయనను తొలగించే సాహసం చేస్తుందా? అనేది అనుమానమే. గత సంవత్సరం నవంబర్లో ట్విట్టర్ సీఈఓగా పరాగ్ అగ్రవాల్ అపాయింట్ అయ్యారు. ఇదివరకు అదే కంపెనీలో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా పనిచేశారు.