అమెరికా సంస్థల ఇంట్రెస్ట్.. తెలంగాణలో జోరుగా పెట్టుడులు
అమెరికా పర్యటనలో మంత్రి కేటీఆర్ బిజీగా ఉన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే పనిలో నిమగ్నం అయ్యారు. మంత్రి కృషి మేరకు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికా సంస్థలు ముందుకొస్తున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా తిలాపియా చేపలను ఎగుమతి చేసే ప్రతిష్టాత్మక కంపెనీ ఫిష్ ఇన్ తెలంగాణలో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. మంత్రి కేటీఆర్తో జరిపిన సమావేశంలో ఫిష్ఇన్ సీఈవో మనీష్ కుమార్ 1000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చారు. 'ఇంటిగ్రేటెడ్ ఫ్రెష్ వాటర్ ఫిష్ కల్చర్ సిస్టం'ని డెవలప్ చేసేందుకు కంపెనీ నిర్ణయం తీసుకుందని సీఈఓ తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల మిడ్ మానేరు రిజర్వాయర్ వద్ద తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. చేపల ఉత్పత్తిలో హ్యచరీలు, దాణా తయారీ, కేజ్ కల్చర్, ఫిష్ ప్రాసెసింగ్, ఎగుమతుల విభాగాల్లో కార్యకలాపాలు కొనసాగించనుంది. యేటా 85 వేల మెట్రిక్ టన్నుల చేపలను ఎగుమతి చేసే అవకాశం ఉంది. దీంతో సుమారు 5,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి కేటీఆర్ తెలిపారు.
ప్రపంచ ప్రఖ్యాత మెడికల్ డివైజెస్ తయారీ కంపెనీ కన్ఫ్లూయెంట్ మెడికల్ సంస్థ హైదరాబాద్లో యూనిట్ను ఏర్పాటు చేయనుంది. అధ్యక్షుడు, సీఈవో డీన్ షావర్తో కేటీఆర్ భేటి అయ్యారు. సంస్థకు సంబంధించిన యూనిట్ ఏర్పాటు గురించి సీఈఓ ప్రకటన చేశారు. త్వరలో పైలట్ ప్రాతిపదికన తయారీ యూనిట్ ప్రారంభించి 12 నెలల్లో విస్తరించాలని కంపెనీ నిర్ణయించింది. దేశంలో ఈ స్థాయి టెక్నాలజీతో ఉత్పత్తులను తయారు చేసే మొదటి కంపెనీ కన్ఫ్లూయెంట్ మెడికల్ సంస్థ నిలవనుంది.
మరికొన్ని కంపెనీల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ భేటీ కానున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఆయన పర్యటన కొనసాగనుంది. ఇప్పటికే హైదరాబాద్లో పలు కంపెనీలు బ్రాంచ్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.