ట్రంపా.. మజాకా? ఆయన పర్యటన కూడా.. చిన్నసైజు యుద్ధమే! ఏ దేశమైనా తలవంచాల్సిందే..
ఉత్తర కొరియాతో ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దక్షిణ కొరియా పర్యటన ఏర్పాట్లు యుద్ధసన్నాహాలను తలపిస్తున్నాయి. ట్రంప్ పర్యటన కోసం అమెరికా అన్ని అస్త్రాలను బయటకు తీస్తోంది.
వాషింగ్టన్: ఉత్తర కొరియాతో ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దక్షిణ కొరియా పర్యటన ఏర్పాట్లు యుద్ధసన్నాహాలను తలపిస్తున్నాయి. ట్రంప్ పర్యటన కోసం అమెరికా తన ఆయుధ భాండాగారం నుంచి అన్ని అస్త్రాలను బయటకు తీస్తోంది.
ఉత్తరకొరియా కిమ్ రాజభోగాలు, ఇదీ ఆ దేశం సత్తా, అణుయుద్ధం వస్తే మాత్రం...
ఈ అస్త్ర శస్త్రాల్లో ప్రముఖంగా చెప్పుకోదగినవి.. బి-2 స్టెల్త్ జెట్లు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యుద్ధ విమానాలు ఇవి. వీటి శక్తి ముందు ఏ దేశమైనా తలొంచాల్సిందే. వాటిని నిలువరించే ఆయుధాలు ఏ దేశం వద్ద లేవంటే అది అతిశయోక్తి కాదు.
స్నేహబంధాన్ని రుజువు చేసేందుకే...
నిజానికి అమెరికాతో పోల్చుకుంటే.. ఉత్తర కొరియా చాలా చిన్నదేశం. అయినా ఆ దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఏమాత్రం తగ్గకుండా నిరంతరం అణు పరీక్షలు చేస్తూనే ఉన్నాడు. ఇది పక్కనే ఉన్న దక్షిణ కొరియా, జపాన్ ప్రజల వెన్నులో చలి పుట్టిస్తోంది. ట్రంప్, కిమ్ ల మధ్య రాజీ కుదిరేలా కనిపించకపోగా యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ దక్షిణ కొరియా పర్యటన పెట్టుకున్నారు. ఆ దేశ పార్లమెంట్ లో కూడా ఆయన ప్రసంగించనున్నారు. దక్షిణ కొరియా వాసులలో భరోసా కల్పించడమే ట్రంప్ పర్యటన ముఖ్యోద్దేశం.. ఒకవేళ ఉత్తరకొరియాతో యుద్ధమే గనుక అనివార్యమైతే అమెరికాకు.. దక్షిణ కొరియా సహకారం అవసరమవుతుంది. అందుకే ఇప్పుడు ట్రంప్ దక్షిణ కొరియా వెళుతున్నారు.
అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న యూఎస్ మిలిటరీ...
ఉత్తరకొరియాతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో.. ట్రంప్ దక్షిణ కొరియా పర్యటన జరగనున్న నేపథ్యంలో ఆయన రక్షణకు సంబంధించి అమెరికా మిలిటరీ అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ట్రంప్ దక్షిణ కొరియా పర్యటన సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన బి-2 స్టెల్త్ యుద్ధ విమానాలను రంగంలోకి దించుతోంది. ట్రంప్ పర్యటనకు ముందుగానే వీటిని కొన్ని దేశాలకు తరలించనుంది అమెరికా మిలిటరీ. ఒక రకంగా ఈ యుద్ధ విమానాల తరలింపు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది.
ఇప్పటి వరకు బయటికి తీయని ఆయుధాలు...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నవంబర్లో దక్షిణ కొరియాలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనకు సంబంధించి సాగుతున్న సన్నాహాల వార్తలు ఇప్పుడే సెగలు పుట్టిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడి ఆసియా దేశాల పర్యటన నేపథ్యంలో ఆ దేశం తన అస్త్రశస్త్రాలను బయటికి తీస్తోంది. రష్యాతో కోల్డ్వార్ అనంతరం ఇప్పటి వరకు ఉపయోగించకుండా దాచి ఉంచిన ఆయుధాలివి. దక్షిణ కొరియా పర్యటన నేపథ్యంలో అమెరికా ఇలాంటి అత్యంత ప్రమాదకర ఆయుధాలను తన ఆయుధగారం నుంచి బయటకు తీయడం ప్రపంచ దేశాలను కలవరపెడుతుంది.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యుద్ధవిమానాలు..
తాజాగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యుద్ధవిమానంగా రికార్డు సృష్టించిన ‘బి-2 స్పిరిట్' స్టెల్త్ విమానాలను అణ్వాయుధాలతో నింపేందుకు అమెరికా సైన్యం ఏర్పాట్లు చేస్తోంది. వీటిల్లో అణ్వాయుధాలను లోడ్ చేసి ఆసియాలోని గుర్తుతెలియని ప్రదేశంలో మొహరించాలని నిర్ణయించింది. అది దక్షిణ కొరియాలోనా?.. లేక జపాన్లోనా? లేక మరేదైనా ప్రదేశంలోనా? అనే విషయాన్ని అమెరికా మిలిటరీ అధికారులు ఇంకా నిర్ణయించలేదు. కానీ ట్రంప్ పర్యటనకు ముందుగానే ఈ విమానాలు బయలుదేరడం ఖాయం.
ట్రంప్ పర్యటనకు ముందుగా...
వారాంతంలో ఈ ‘బి-2 స్పిరిట్' స్టెల్త్ విమానాలు వైట్మన్ ఎయిర్బేస్ నుంచి పసిఫిక్ మీదుగా ప్రయాణించనున్నాయి. ప్రపంచంలో ఎక్కడైనా అణుదాడి చేయగల సత్తా వీటి సొంతం. 2013లో కూడా ఒకసారి అమెరికా బలప్రదర్శనలో భాగంగా ఇవి కొరియన్ ద్వీపకల్పంపై చక్కర్లు కొట్టినట్లు జపాన్ టైమ్స్ పత్రిక పేర్కొంది. దక్షిణ కొరియా, జపాన్లలో నెలకొన్న భయాలను తొలగించేందుకు, అమెరికా తన స్నేహానికి కట్టుబడి ఉందనే సందేశాన్ని ఇచ్చేందుకు ట్రంప్ పర్యటనకు ముందుగా ఈ ‘బి-2 స్పిరిట్' స్టెల్త్ విమానాలను ఆయా దేశాలకు పంపనున్నట్లు సమాచారం.
అత్యంత గోప్యంగా...
‘బి-2 స్పిరిట్' స్టెల్త్ విమానాలు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫైటర్ జెట్ విమానాలు. ఒక్కో విమానం ధర మన కరెన్సీలో చెప్పాలంటే రూ.4,779 కోట్లు. అంతేకాదు, ఇవి ప్రపంచంలో అత్యంత గోప్యంగా ప్రయాణించే విమానాలు. వీటిని ఇన్ఫ్రారెడ్, ఎలక్ట్రోమాగ్నటిక్, రాడర్ సిగ్నల్స్ ఏవీ గుర్తించలేవు. ఏకధాటిగా 6000 మైళ్లు ప్రయాణించగలిగే ఈ యుద్ధవిమానాలు అణుబాంబులను సైతం ప్రయోగించగలవు. ఇవేకాకుండా అమెరికా అధ్యక్షుడికి రక్షణగా ఉత్తర డకోటాలోని మినాట్ ఎయిర్ ఫోర్స్ బేస్ లోని 26 బీ-52 న్యూక్లియర్ బాంబర్లను కూడా మిలిటరీ అధికారులు యుద్ధ ప్రాతిపదికన అప్ గ్రేడ్ చేస్తున్నారు. రష్యాతో కోల్డ్వార్ నాటి న్యూక్లియర్ ఆయుధాలను ఈ బాంబర్లు కలిగి ఉంటాయి.
ఇవన్నీ యుద్ధానికేనా?
ఉత్తరకొరియాతో యుద్ధానికి దిగేందుకు అమెరికా సిద్ధమైందా? దక్షిణకొరియాతో ఉన్న స్నేహం ఆసరాగా జలాంతర్గాములు, బాంబర్లు వంటి కీలక అస్త్రాలను ఇప్పటికే కొరియా ద్వీపకల్పానికి చేర్చిందా?.. ఇటీవలి పరిణామాలు పరిశీలిస్తే దీనికి అవుననే సమాధానాలే వస్తాయి. 1953లో దక్షిణ కొరియా, అమెరికా మధ్య రక్షణ సహకార ఒప్పందం జరిగింది. అప్పుడే దక్షిణ కొరియాలో అమెరికా ఆర్మీ బేస్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ బేస్లో వివిధ రకాల ఆయుధాలు, దాదాపు 28 వేల మంది సిబ్బంది ఉంటున్నారు. ఇటీవలే అమెరికా తన సబ్మెరైన్లను కూడా దక్షిణ కొరియా సముద్ర జలాల్లోకి చేర్చింది. అమెరికా అణ్వస్త్ర జలాంతర్గాములు దక్షిణ కొరియాలోని బూసన్ నేవల్ బేస్లో ఈ ఏడాది రెండుసార్లు కనిపించాయి. ఇవి అణ్వాయుధాలను మోసుకెళ్లగలుగడంతోపాటు సీల్స్ బృందానికి ఆశ్రయ మిస్తాయి.
ఉత్తరకొరియా అంతు చూసేస్తారా?
ట్రంప్ పర్యటన పేరుతో అమెరికా తన విమాన వాహక యుద్ధనౌకలు నిమ్టిజ్, థియోడర్ రూజ్వెల్ట్, రోనాల్డ్ రీగన్ లను ఇప్పటికే దక్షిణ కొరియాకు పంపింది. ఇక ట్రంప్ వచ్చినప్పుడు అదనంగా యుద్ధవిమానాలు, సైనికులు ఎలాగూ దిగుతారు. మరోవైపు ట్రంప్ ఆదేశాల మేరకు రష్యాతో ప్రచ్ఛన్న యుద్ధకాలంలో తయారుచేయించిన బీ-52 న్యూక్లియర్ బాంబర్లను ఆధునీకరిస్తున్నట్టు ఎయిర్ఫోర్స్ అధికారులు ఇటీవలే ప్రకటించారు. ఈ పరిణామాల ఆధారంగా ఉత్తరకొరియా అంతు చూసేందుకు.. అమెరికా పూర్తిస్థాయిలో సన్నద్ధం అవుతోందని, అవసరమైతే అణుదాడికి కూడా దిగవచ్చని నిపుణులు చెబుతున్నారు.