బ్రిటన్ కొత్త ప్రధాని తేలేది నేడే - రిషి సనాక్ గెలిచేనా : ఓడితే ఆయన నిర్ణయం ఇదే..!!
బ్రిటన్ నూతన ప్రధాని ఎవరు. దీనికి మరి కొద్ది గంటల్లోనే అధికారికంగా తేలిపోనుంది. భారత్ లో ఈ ఫలితం పైన ఆసక్తి కనిపిస్తోంది. భారత సంతతి నేత రిషి సనాక్ ప్రధాని పదవి రేసులో నిలిచారు. రిషి సనాక్ - లిజ్ ట్రస్ మధ్య ప్రధాన పోటీ కొనసాగింది. కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల ఓటింగ్ ప్రక్రియ ముగియగా.. ఈ సాయంత్రం ఫలితాలు ప్రకటించనున్నారు. సర్వే నివేదికలు ఇప్పటి వరకు లిజ్ ట్రస్ కు అనుకూలంగా కనిపిస్తున్నాయి.

ఓటింగ్ పూర్తి.. నేడే ఫలితాలు
కన్జర్వేటివ్ పార్టీకి చెందిన లక్షా 60 వేల మంది క్రియాశీల సభ్యులు.. ఆగస్టు నెల నుంచి పోస్ట్ ద్వారా, ఆన్లైన్లోనూ ఈ నెల 2వ తేదీ వరకు ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో రిషి సనాక్ తన విధానాల పైన స్పష్టంగా చెబుతూ వచ్చారు.
ప్రచారంలో భాగంగా సాగిన చర్చలు..ప్రచారంలో ప్రధానంగా పది పాయింట్ల పైన ఆయన ఎక్కువగా ఫోకస్ చేసారు. అందులో భాగంగా చైనా తీరును తప్పు బట్టారు. అక్రమ వలసలు అరికడతానని చెప్పారు. నేరాలను అదుపుచేస్తానని హామీ ఇచ్చారు. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు చేపట్టే చర్యల గురించీ ప్రతి సదర్భంలోనూ చెబుతూ వచ్చారు.

సంస్కరణలు - నిర్ణయాలపై ప్రచారం
విద్యుత్ రంగానికి సంబంధించి తీసుకోవాల్సిన సంస్కరణల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. ఆర్దికంగా బలోపేతం అయ్యేందుకు కఠిన నిర్ణయాలు తప్పవని రిషి పోటీ దారుగా ఉన్న లిజ్ ట్రస్ తన ఎన్నికల ప్రచారంలో స్పష్టం చేసారు.
ఈ సాయంత్రం ఫలితాలు వచ్చిన తరువాత గెలిచిన వారు లండన్లోని క్వీన్ ఎలిజబెత్-2 కాన్ఫరెన్స్ సెంటర్లో ప్రసంగిస్తారు. దీనికి ముందస్తుగానే తన కేబినెట్ సహచరుల ఎంపిక పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. పదవి నుంచి వైదొలగనున్న బోరిస్ జాన్సన్ మంగళవారం తన వీడ్కోలు ప్రసంగిస్తారు. స్కాట్లాండ్లోని అబెర్డీన్షైర్కు వెళ్లి లాంఛనంగా తన రాజీనామాను రాణికి సమర్పిస్తారు.

రిషి సనాక్ గెలిచేనా - ఓడితే ఇలా
యూకే చరిత్రలో తొలిసారి ఇంగ్లండ్ వెలుపల.. ప్రధానమంత్రి నియామకం నిర్వహించనున్నారు. కన్జర్వేటివ్ పార్టీ నేతగా ఎన్నికైన వారు వేరుగా స్కాట్లాండ్ వెళతారు. అక్కడ కన్జర్వేటివ్ పార్టీ నేతను రాణి లాంఛనంగా ప్రధానిగా నియమిస్తారు. బుధవారం మధ్యాహ్నం కొత్త ప్రధాని.. హౌస్ ఆఫ్ కామన్స్లో ప్రతిపక్ష నేత నుంచి ప్రశ్నలు ఎదుర్కొంటారు.
అయితే, సర్వేలు తనకు ప్రతికూలంగా ఉండటంతో.. రిషి సనాక్ కీలక వ్యాఖ్యలు చేసారు. తాను ఈ పోటీలో ఓడిపోతే.. తదుపరి ప్రభుత్వానికి మద్దతు కొనసాగిస్తానని వెల్లడించారు. లిజ్ ట్రస్ చేతిలో ఓడిపోతే.. ఎంపీగా కొనసాగుతూ, తన నియోజకవర్గం కోసం పనిచేస్తానని తెలిపారు. దీంతో..ఇప్పుడు బిట్రన్ ప్రధాని ఎన్నికల ఫలితాల పైన ఉత్కంఠ మొదలైంది.












Click it and Unblock the Notifications