ఐక్యరాజ్యసమితి భద్రత మండలి ఎమర్జెన్సీ ఓపెన్ మీటింగ్: ఉక్రెయిన్పై భారత్ స్టేట్మెంట్
వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో- అంతర్జాతీయ స్థాయి పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఉక్రెయిన్లోని డొనెట్స్క్, లుహాన్స్క్ రీజియన్లను స్వతంత్ర దేశాలుగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన ప్రకటన దీనికి కారణమైంది. ఈ రెండు రీజియన్లు ఇక స్వతంత్రంగా వ్యవహరిస్తాయంటూ పుతిన్ చేసిన ప్రకటన.. అమెరికాను కదనరంగంలోకి దింపినట్టయింది. అగ్రరాజ్యానికి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది.

బైడెన్ అభ్యంతరం..
పుతిన్ చేసిన ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ సార్వభౌమత్వానికి రష్యా భంగం కలిగించిందని వ్యాఖ్యానించారు. డొనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలను స్వతంత్ర రీజియన్లుగా ప్రకటించడాన్ని తాము అంగీకరించట్లేదని అన్నారు. దీన్ని తోసిపుచ్చుతున్నట్లు చెప్పారు. భద్రతమండలిని అత్యవసరంగా సమావేశపర్చాలంటూ ఆయన ఐక్యరాజ్యసమితికి విజ్ఞప్తి చేశారు. అమెరికా, మిత్రదేశాల విజ్ఞప్తి మేరకు భద్రతమండలి అత్యవసర సమావేశాన్ని ఐరాస నిర్వహించనుంది.

అజెండా ఇదే..
ఉక్రెయిన్ సంక్షోభంపై భద్రత మండలి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటూ ఐక్యరాజ్య సమితికి అధికారికంగా లేఖలను రాసిన దేశాల్లో అమెరికా, బ్రిటన్, ఐర్లాండ్, అల్బేనియా ఉన్నాయి. ఈ భేటీ అజెండాను కూడా ఖరారు చేసింది అమెరికా. ఉక్రెయిన్ సంక్షోభ నివారణ, డొనెట్స్క్-లుహాన్స్క్ ప్రాంతాలను స్వతంత్ర రీజియన్లుగా గుర్తిస్తున్నట్లు ప్రకటన చేసిన రష్యాపై ఆంక్షలను విధించడం, ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని పరిరక్షించడానికి ఎలాంటి చర్యలను తీసుకోవాల్సి ఉంటుందనే విషయంపై ప్రధానంగా ఇందులో చర్చిస్తారని తెలుస్తోంది.

ఎమర్జెన్సీ ఓపెన్ మీటింగ్..
ఇది ఎమర్జెన్సీ ఓపెన్ మీటింగ్. భద్రతమండలిలో తాత్కాలిక సభ్య దేశాలు కూడా పాల్గొనడానికి అవకాశాన్ని కల్పించింది ఐక్యారాజ్య సమితి. ఫలితంగా భారత్ కూడా ఈ భేటీకి హాజరు కానుంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితులపై తన వైఖరిని స్పష్టం చేయనుంది. ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి ఈ భేటీకి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంపై భారత్ తరఫున తన విధానాన్ని ఆయన స్పష్టం చేస్తారని అంటున్నారు.

తొలిసారి భారత్కు అవకాశం..
రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంపై భారత్ తన వైఖరిని స్పష్టం చేయాల్సి రావడం ఇదే తొలిసారి. ఇప్పటిదాకా ఆ అవకాశం భారత్కు రాలేదు. ఈ అంశాన్ని భారత్ నిశితంగా పరిశీలిస్తూ వచ్చిందే తప్ప- ఎక్కడా తన వైఖరేమిటనేది వెల్లడించలేదు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ పరిస్థితులు, ఉద్రిక్త వాతావరణం నెలకొన్నందున- రాజధాని కీవ్లో ఉన్న రాయబార కార్యాలయ అధికారుల కుటుంబాలను భారత్ వెనక్కి పిలిపించుకుంది. విద్యార్థులు, అక్కడ నివసించే పౌరులను స్వదేశానికి రావాల్సిందిగా సూచించింది.

భారత్ స్టేట్మెంట్..
ఇప్పటిదాకా రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంపై భారత్ తీసుకున్న చర్యలు ఇవే. ఇఫ్పుడు తాజాగా- అత్యున్నత స్థాయి అంతర్జాతీయ వేదిక మీద భారత్- తన వైఖరిని స్పష్టం చేసే అవకాశం లభించింది. ఈ సమావేశం సందర్భంగా భారత్ ఓ స్టేట్మెంట్ ఇస్తుంది. రష్యాతో స్నేహ సంబంధాలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ ఎలాంటి వైఖరిని అనుసరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. రష్యా నుంచి పెద్ద ఎత్తున భారత్ రక్షణ పరికరాలు, ఆయుధాలను కొనుగోలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఏకే-56 కొనుగోళ్ల కోసం ఒప్పందాన్ని కుదుర్చుకుంది.












Click it and Unblock the Notifications