కిమ్జొంగ్తో పెట్టుకున్న అమెరికా: ఉత్తర కొరియా తీరంలో మిస్సైల్స్ అటాక్..!!
సియోల్: ఆధునిక నియంతగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఉత్తర కొరియా అధినేత కిమ్జొంగ్ ఉన్.. కొంతకాలంగా తన దుందుడుకు వైఖరిని కొనసాగిస్తోన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయినప్పటికీ- తన మొండిపట్టును వీడట్లేదు. దానిపై దృష్టి సారించినట్లూ కనిపించట్లేదు. తన ఆయుధ సంపత్తిని ఎప్పటికప్పుడు బలోపేతం చేసుకుంటోన్నారు. అత్యంత ప్రమాదకరమైన అణ్వాయుధాలతో సరికొత్త ప్రయోగాలను చేస్తోన్నారు. అణ్వస్త్రాల ప్రయోగంపై అమెరికాతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నప్పటికీ.. దాన్ని లెక్కచేయట్లేదు.
సముద్ర జలాల్లోకి టెస్ట్ ఫైరింగ్..
పొరుగునే ఉన్న దక్షిణ కొరియా, జపాన్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్నారు కిమ్జొంగ్. దక్షిణ కొరియా సముద్ర జలాల్లోకి క్షిపణిని ప్రయోగించింది ఉత్తర కొరియా. అత్యంత శక్తిమంతమైన బాలిస్టిక్ మిస్సైల్స్ను సంధించింది. క్షిపణి పరీక్షల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించింది. తన మిస్సైళ్ల శక్తి సామర్థ్యాలను చాటి చెప్పుకోవడానికి దీన్ని ఉపయోగించుకుంటోన్నారు కిమ్.
అణ్వస్త్రాల పరీక్షలపై
ఉత్తర కొరియా చేపట్టిన అణ్వస్త్రాల పరీక్షలపై ఆ దేశంతో చర్చించడానికి అమెరికా ఇప్పటికే సన్నద్ధమైన విషయం తెలిసిందే. దక్షిణ కొరియాలో అమెరికా రాయబారిగా పని చేసి, పదవీ విరమణ చేసిన సుంగ్ కిమ్ను దూతగా అపాయింట్ చేసింది అమెరికా. ఉత్తర కొరియా ప్రభుత్వ పెద్దలతో చర్చించడానికి ఆయనను రాయబారిగా నియమించింది. ఈ నియామకం పూర్తయిన అతి కొద్దిరోజుల్లోనే ఉత్తర కొరియా ఈ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగానికి పూనుకోవడం.. పైగా దక్షిణ కొరియా సముద్ర జలాలను లక్ష్యంగా చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కౌంటర్ అటాక్..
అమెరికాతో అణ్వస్త్రాలపై చర్చించడానికి కిమ్జొంగ్ ఏ మాత్రం ఆసక్తి కనపర్చట్లేదనేది ఆయన చేతలే స్పష్టం చేస్తోన్నాయి. ఈ పరిస్థితుల మధ్య అమెరికా స్వయంగా రంగంలోకి దిగింది. దక్షిణకొరియాతో కలిసి ఉమ్మడిగా క్షిపణి పరీక్షలను చేపట్టింది. 24 గంటల వ్యవధిలో రెండుసార్లు క్షిపణులను కొరియన్ సముద్ర జలాల్లోకి సంధించింది. రెండు మిస్సైళ్లు చొప్పున మొత్తం నాలుగింటిని సంధించింది. నిర్దేశిత లక్ష్యాన్ని ఛేదించాయవి. దక్షిణ కొరియా కాలమానం ప్రకారం మంగళ, బుధవారాల్లో తెల్లవారు జామున ఈ ప్రయోగం చోటు చేసుకుంది.
జెట్ ఫైటర్లతో..
అక్కడితో ఆగలేదు దక్షిణకొరియా. జెట్ ఫైటర్లను రంగంలోకి దింపింది. ఎఫ్-15కే ఫైటర్ జెట్లతో- ఆకాశం నుంచి ఉపరితలంపై లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను సైతం సంధించింది. ఈ తెల్లవారు జామున చోటు చేసుకున్న సైనిక విన్యాసాల్లో అత్యంత శక్తిమంతమైన ఎంజీఎం-140 ఆర్మీ టెక్నికల్ మిస్సైల్ సిస్టమ్ను వినియోగించింది. దీన్ని అమెరికా అభివృద్ధి చేసిన రక్షణ వ్యవస్థ ఇది. ఇలాంటి నాలుగు క్షిపణులను కొరియన్ ఈస్ట్ కోస్ట్ సముద్ర జలాల్లో సంధించింది.
అణ్వస్త్ర రహితంగా మార్చడానికే..
ఉపరితలం నుంచి ఉపరితలానికి 320 కిలోమీటర్ల దూరం ఉన్న లక్ష్యాన్ని ఛేదించగల సామర్థ్యం ఈ ఆర్మీ టెక్నికల్ మిస్సైల్స్కు ఉంది. ఈ క్షిపణి ప్రయోగాలు, విన్యాసాలను అమెరికా ధృవీకరించింది. అమెరికా జాతీయ భద్రత సలహాదారు జాన్ కిర్బీ ఓ ప్రకటన విడుదల చేశారు.కొరియన్ తీర ప్రాంతాన్ని అణ్వస్త్ర రహితంగా మార్చడానికి తాము ప్రయత్నిస్తోన్నామని, ఉత్తర కొరియా అధినాయకత్వం దీనికి సహకరించట్లేదని తేల్చిచెప్పారు. తరచూ క్షిపణి ప్రయోగాలకు పాల్పడుతూ రెచ్చగొట్టే ధోరణిని ప్రదర్శిస్తోందని వ్యాఖ్యానించారు.