కొరియా ద్వీపకల్పంపై అమెరికా యుద్ధ విమానాల చక్కర్లు, ఏం జరగబోతోంది?
ఉత్తర కొరియా బెదిరింపులకు దీటుగా స్పందించింది అమెరికా. సోమవారం కొరియా ద్వీపకల్పం మీదుగా అమెరికాకు చెందిన నాలుగు యుద్ధ విమానాలు, రెండు బాంబర్లు చక్కర్లు కొట్టాయి.
సియోల్: ఉత్తర కొరియా బెదిరింపులకు దీటుగా స్పందించింది అమెరికా. సోమవారం కొరియా ద్వీపకల్పం మీదుగా అమెరికాకు చెందిన నాలుగు యుద్ధ విమానాలు, రెండు బాంబర్లు చక్కర్లు కొట్టాయి. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే భయాందోళనలు అలముకున్నాయి.
బాధ్యతారహిత అణు కార్యక్రమానికి ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఉత్తరకొరియాను సమూలంగా నాశనం చేస్తామని ఇప్పటికే అమెరికా మిలిటరీ వర్గాలు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన ఎఫ్-35బీ యుద్ధ విమానాలు, రెండు బీ-1బీ బాంబర్లు కొరియా ద్వీపకల్పంపై మాక్ బాంబింగ్ డ్రిల్స్ నిర్వహించినట్లు సౌత్ కొరియాకు చెందిన యోన్హాప్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.
ఉత్తర కొరియా నిర్వహించిన అత్యంత శక్తివంతమైన ఆరో న్యూక్లియర్ టెస్ట్, జపాన్ మీదుగా మిస్సైల్ ప్రయోగం తర్వాత అమెరికా తొలిసారిగా ఇలా కొరియా ద్వీపకల్పంపై గగనతలంలో డ్రిల్స్ నిర్వహించడం గమనార్హం.
జపాన్, గువామ్లలోని ఎయిర్బేస్ల నుంచి వచ్చిన ఆ నాలుగు యుద్ధ విమానాలు.. సౌత్ కొరియాకు చెందిన ఎఫ్-15కే జెట్ ఫైటర్స్తో కలిసి డ్రిల్ నిర్వహించినట్లు యోన్హాప్ ఏజెన్సీ తెలిపింది.
చివరిసారి ఆగస్ట్ 31న కూడా అమెరికాకు చెందిన ఫైటర్ జెట్స్ ఇలాగే కొరియా ద్వీపకల్పంపై చక్కర్లు కొట్టాయి. అయితే ఈ తాజా మాక్ డ్రిల్ ఉద్దేశం ఏమిటి? ఉత్తరకొరియాపై దాడికి దిగే ఉద్దేశం అమెరికాకు ఉందా? ఇలాంటి విషయాలపై మాత్రం అమెరికా మిలిటరీ ఇంకా స్పందించలేదు.