H-1B ఎఫెక్ట్- భారత్ కు అమెరికా కంపెనీల గుడ్ న్యూస్..!
అమెరికాకు వచ్చే విదేశీ నిపుణులకు హెచ్ 1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఈ నిర్ణయం భారత్ పై తీవ్ర ప్రభావం చూపబోతోంది. అలాగే అమెరికా కంపెనీలపైనా దీని ప్రభావం ఎక్కువగానే పడుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా కంపెనీలు తమ వ్యూహాల్ని మార్చుకుంటున్నాయి.
ట్రంప్ సర్కార్ హెచ్1బీ వీసా ఫీజు పెంపు నిర్ణయంతో భారతీయ నిపుణుల్ని ఉద్యోగులుగా కలిగి ఉన్న పలు అమెరికా సంస్థలు ఆత్మరక్షణలో పడ్డాయి. తొలుత ఏడాదికి లక్ష డాలర్ల హెచ్1బీ వీసా ఫీజు చెల్లించాలని ప్రకటించిన ట్రంప్ సర్కార్.. ఆ తర్వాత వ్యతిరేకత కారణంగా దాన్ని తొలిసారి వీసా తీసుకున్నప్పుడే అని సవరించింది. అలాగే వచ్చే మార్చి నుంచి దాన్ని అమలు చేయబోతోంది. ఈ లోపు వీసా విధానంలో చాలా మార్పులు ఉంటాయని ఇవాళ ట్రంప్ కేబినెట్ మంత్రి ఒకరు తేల్చేశారు.

ఈ నేపథ్యంలో అమెరికా కంపెనీలు, ముఖ్యంగా ఆర్థికం నుండి పరిశోధన, అభివృద్ధి వరకు కార్యకలాపాలను నిర్వహించే ప్రపంచ సామర్థ్య కేంద్రాల (జీసీసీ)ల్ని భారత్ లో ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న జీసీసీల్లో సగానికి పైగా (1700) భారత్ లోనే ఉన్నాయి. లగ్జరీ కార్ డాష్బోర్డ్ల రూపకల్పన నుండి మాదకద్రవ్యాల ఆవిష్కరణ వరకు పలు రంగాలలో ఇవి సేవలు అందిస్తున్నాయి. వీటితో పాటు మరిన్ని జీసీసీలు భారత్ లోనే ఏర్పాటు చేసుకుంటే మంచిదని అమెరికాకు చెందిన పలు కంపెనీలు భావిస్తున్నట్లు నిపుణులు చెప్తున్నారు.
నిన్న అమెరికా సెనేటర్లు హెచ్-1బీ, ఎల్-1 వర్కర్ వీసాల రూల్స్ కఠినతరం చేయడానికి ఓ బిల్లును ప్రవేశపెట్టారు. వీసాల దుర్వినియోగాన్ని అరికట్టడమే దీని ఉద్దేశం. మరోవైపు ట్రంప్ ఆంక్షలు సడలించకపోతే మాత్రం అమెరికా సంస్థలు ఏఐ, ఉత్పత్తి అభివృద్ధి, సైబర్ భద్రత, విశ్లేషణలతో ముడిపడి ఉన్న హై-ఎండ్ పనిని తమ భారతదేశ జీసీసీలకు మారుస్తాయని, అవుట్సోర్సింగ్ కంటే వ్యూహాత్మక విధులను తమ వద్దే ఉంచుకుంటాయని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఆపిల్ , గూగుల్ పేరెంట్ ఆల్ఫాబెట్తో పాటు వాల్ స్ట్రీట్ బ్యాంక్ జేపీ మోర్గాన్ చేజ్ , రిటైలర్ వాల్మార్ట్తో సహా బిగ్ టెక్, హెచ్-1బీ వీసాల యొక్క అగ్ర స్పాన్సర్లలో ఉన్నాయి. ఇప్పుడు వీరంతా భారత్ లో ఉన్న తమ జీసీసీలకు ఉద్యోగుల్ని, స్థావరాల్ని మార్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు పలు కంపెనీలు భారత్ లో కార్యకలాపాల్ని మరింత ఉధృతం చేసే అవకాశాలున్నాయి. అయితే ట్రంప్ సర్కార్ తాజా చట్టం ఆమోదిస్తే భారత్ లో ఆయా సంస్థల ఎగుమతులు తిరిగి అమెరికాకు వెళ్లినప్పుడు 25 శాతం సుంకం చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి దీనిపై కంపెనీలు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నాయి.












Click it and Unblock the Notifications