అక్కడంతా ఒక్కటే మతం: చైనా, పాకిస్తాన్లకు అమెరికా డబుల్ షాక్: మరో 8 దేశాలకు కూడా
వాషింగ్టన్: మిత్ర దేశాలు పాకిస్తాన్, చైనాలకు అగ్రరాజ్యం అమెరికా డబుల్ షాక్ ఇచ్చింది. మత స్వేచ్ఛారహిత దేశాల జాబితాలో చేర్చింది. తమ దేశంలో నివసించే ప్రజలందరూ ఒకే మతాన్ని అనుసరించేలా ఒత్తిళ్లను తీసుకొస్తున్నాయని పేర్కొంది. మత స్వేచ్ఛ అనేది ఆయా దేశాల్లో నామమాత్రంగా కూడా కనిపించదని మండిపడింది. మెజారిటీ ప్రజలు అనుసరించే మతాన్నే ఇతరులు కూడా అనుసరించి తీరాలనే నిబంధనలు బాహటంగా విధించిన సందర్భాలు అనేకం ఉన్నందునే.. ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో తెలిపారు.
ఆయా దేశాలతో పేర్లతో కూడిన కంట్రీస్ ఆఫ్ పర్టిక్యులర్ కన్సర్న్ (సీపీసీ) జాబితాను ఆయన విడుదల చేశారు. పాకిస్తాన్, చైనాలను ఇందులో చేర్చారు. ఈ రెండింటితో పాటు- బర్మా, ఎరిట్రియా, ఇరాన్, నైజీరియా, డెమొక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా (డీపీఆర్కే-ఉత్తర కొరియా), తజకిస్తాన్, తుర్క్మెనిస్తాన్లను మత స్వేచ్ఛారహిత దేశాలుగా గుర్తిస్తున్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయ మత స్వేచ్ఛా చట్టం-1998లో పొందుపరిచిన నిబంధనలు, మార్గదర్శకాలు ఆయా దేశాల్లో యథేచ్ఛగా ఉల్లంఘనకు గురవుతున్నాయని తాము గుర్తించినట్లు స్పష్టం చేశారు.
కొమొరస్, క్యూబా, నికరగ్వా, రష్యాలను స్పెషల్ వాచ్ లిస్ట్ (సీడబ్ల్యూఎల్) జాబితాలో చేర్చినట్లు మైక్ పాంపియో తెలిపారు. అల్ షబాబ్, అల్ఖైదా, బోకో హరామ్, హయత్ తాహిర్ అల్-షమ్, ది హౌతీస్, ఐసీస్, ఐసీస్-గ్రేటర్ సహారా, ఐసిస్-వెస్ట్ ఆఫ్రికా, జమాత్ నాసర్ అల్-ఇస్లాం వల్ ముస్లిమీన్, తాలిబన్లను ఉగ్రవాద సంస్థలుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. వాటిని ఎన్టైటిస్ ఆఫ్ పర్టిక్యులర్ కన్సర్స్ లిస్ట్లో చేర్చినట్లు చెప్పారు. ఇదివరకు మత స్వేచ్ఛారహిత దేశాల జాబితాలో ఉన్న సూడాన్, ఉజ్బెకిస్తాన్ల పేర్లను తొలగించారు. అక్కడి పరిస్థితి కొంత మెరుగు పడిందని, సంతృప్తికరంగా మారిందని మైక్ పాంపియో పేర్కొన్నారు.