"ఆ విషయంలో ఏం చేయాలో అమెరికాకు తెలుసు.. మాకెవరూ చెప్పాల్సిన పనిలేదు"
అమెరికాలో పర్యావరణ పరిరక్షణ ఎలా ఉండాలనే దానిపై ఇతర దేశాలు తమకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, అలాంటి సలహాలు తమ దేశంలో ఎవరైనా ఇవ్వగలరని మండిపడ్డారు.
న్యూయార్క్: ప్యారిస్ వాతావరణ మార్పు ఒప్పందం నుంచి తప్పుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. భూతాపాన్ని నివారించేందుకు ప్రపంచ దేశాలన్ని ఒక్క తాటి పైకి వచ్చి కుదుర్చుకున్న ఈ ఒప్పందానికి అమెరికా తూట్లు పొడవడం సరికాదని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
విమర్శల మాటెలా ఉన్నా.. అమెరికా మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూనే ఉంది. పారిస్ వాతావరఫ ఒప్పందం గురించి అమెరికా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో భారత్, చైనా, ఫ్రాన్స్ దేశాలు చెప్పాల్సిన అవసరంలేదని ఐక్యరాజ్యసమితిలో ఆ దేశ దైత్యవేత్త నిక్కీ హేలీ అన్నారు.
అమెరికాలో పర్యావరణ పరిరక్షణ ఎలా ఉండాలనే దానిపై ఇతర దేశాలు తమకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, అలాంటి సలహాలు తమ దేశంలో ఎవరైనా ఇవ్వగలరని మండిపడ్డారు. ప్రపంచ దేశాలు అమెరికా సలహాలు ఇవ్వడం మానేసి ఎవరి పని వారు చూసుకుంటే మంచిదని అన్నారు. పర్యావరణ పరిరక్షణపై అమెరికా బాధ్యతగానే ఉందని, ఇందుకోసం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
కాగా, భూతాపాన్ని తీవ్రం చేస్తున్న కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న లక్ష్యంతో వివిధ దేశాల మధ్య పారిస్ ఒప్పందం కుదరగా.. దీనికి సంబంధించిన విధివిధానాల కోసం 2015 డిసెంబరు 12న ప్యారిస్లో నిర్వహించిన సమావేశంలో 195 దేశాలు ఆమోదముద్ర వేశాయి. ఈ మేరకు 2020 నుంచి ఆయా దేశాలు చర్యలు ప్రారంభించాలి.
ఇదిలా ఉంటే, ట్రంప్ ప్యారిస్ ఒప్పందాన్ని అమెరికా నష్టం కలిగించేదిగా వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందం వల్ల అమెరికాకు ఆర్థికంగా నష్టమే అవుతుందన్నారు. తమ సంపదను విదేశాలకు పున:పంపిణీ చేసేందుకే ఇలాంటి ఒప్పందాలు జరిగాయని విమర్శించారు.