కొత్త ఫార్మట్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల డిబేట్: టైమ్ వేస్ట్: పాల్గొనబోనంటోన్న ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల గడువు సమీపిస్తోన్న కొద్దీ.. అక్కడి వాతావరణం వేడెక్కుతోంది. వచ్చే నెల 3వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ను నిర్వహించనున్నారు. అధ్యక్ష ఎన్నికల డిబేట్లు జోరుగా సాగుతున్నాయి. కొద్దిరోజుల కిందటే డొనాల్డ్ ట్రంప్, జో బిడెన్ మధ్య క్లీవ్ల్యాండ్లో అధ్యక్ష ఎన్నికల డిబేట్ సాగింది. ఉపాధ్యక్ష అభ్యర్థులు మైక్ పెన్స్, కమలా హ్యారీస్ మధ్యనా ఉటా స్టేట్లో తాజాగా డిబేట్ ముగిసింది. అధ్యక్ష పదవికి పోటీ పడుతోన్న డొనాల్డ్ ట్రంప్, జో బిడెన్ మధ్య ఈ నెల 15వ తేదీన మరో డిబేట్ను ఏర్పాటు చేశారు.
ఇందులో డొనాల్డ్ ట్రంప్ ప్రత్యక్షంగా పాల్గొనడానికి ఆయన ప్రత్యర్థి జో బిడెన్ అంగీకరించట్లేదు. ట్రంప్ ప్రత్యక్షంగా ఈ డిబేట్కు హాజరు కావాల్సిన పరిస్థితి వస్తే తాను గైర్హాజర్ అవుతానని ప్రకటించారు. వర్చువల్ విధానంలో డిబేట్ కొనసాగించేటట్లయితే.. తాను అంగీకరిస్తానని మెలిక పెట్టారు. ట్రంప్ మాత్రం వర్చువల్ విధానంలో మాత్రమే హాజరు కావాల్సి ఉంటుందని షరతు పెట్టారు. దీనికి ట్రంప్ అంగీకరించట్లేదు. వర్చువల్ పార్మట్లో డిబేట్లో పాల్గొనబోనని కుండబద్దలు కొట్టారు.
వారిద్దరి మధ్య డిబేట్కు ముందే మాటల తూటాలు పేలడానికి ప్రధాన కారణం.. డొనాల్డ్ ట్రంపే. ఎందుకంటే- కొద్దిరోజుల కిందటే ఆయన కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆయన ప్రధాన సలహాదారు, అధికారిక నివాసం వైట్హౌస్ ప్రెస్ సెక్రెటరీ, కొందరు సిబ్బంది సహా జర్నలిస్టులకు సైతం కరోనా సోకింది. ట్రంప్.. మేరీల్యాండ్లోని నేషనల్ మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. కరోనా నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. డిశ్చార్జి అయ్యారు.
ట్రంప్ ఆరోగ్యంతో ఉన్నప్పటికీ.. ఆయనతో ఫేస్ టు ఫేస్ డిబేట్లో పాల్గొనడానికి జో బిడెన్ అంగీకరించట్లేదు. కరోనా వైరస్ సోకుతుందనే భయం ఆయనలో నెలకొని ఉంది. ఈ నెల 15వ తేదీన ప్రతిపాదించిన రెండో డిబేట్ క్యాంపెయిన్ను వర్చువల్ ఫార్మట్లో నిర్వహించేలా కమిషన్ చర్యలు తీసుకుంది. దీనికి జో బిడెన్ అంగీకరించినప్పటికీ.. ట్రంప్ నిరాకరిస్తున్నారు. దీనివల్ల సమయం వృధా అవుతుందే తప్ప ఉపయోగం ఉండదని స్పష్టం చేశారు.
Recommended Video
ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. వర్చువల్ ఫార్మట్లో నిర్వహించ తలపెట్టిన డిబేట్లో పాల్గొని.. తన సమయాన్ని వృధా చేయదలచుకోలేదని అన్నారు. జో బిడెన్ను ప్రొటెక్ట్ చేయడానికే ఇలాంటి ప్రతిపాదనను తీసుకొచ్చారని చెప్పారు. వర్చువల్ ఫార్మట్లో డిబేట్ను నిర్వహించాలని భావించడం ఓ జోక్గా కొట్టి పారేశారు. అవసరమైతే దాన్ని రద్దు చేసుకోవచ్చు గానీ.. ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా దీన్ని నిర్వహించలేమని అన్నారు.