అబద్ధాల మీద అబద్దాలు: ట్రంప్కు షాకిచ్చిన టీవీ ఛానళ్లు: ప్రెస్మీట్ లైవ్ కవరేజ్ నిలిపివేత
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్కు ఆ దేశానికి చెందిన న్యూస్ ఛానళ్లు షాక్ ఇచ్చాయి. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ను ప్రత్యక్ష ప్రసారాన్ని ఊహించని విధంగా నిలిపివేశాయి. లైవ్ కవరేజ్ ప్రారంభమైన కొద్దిసేపటికే దాన్ని అర్ధాంతరంగా ఆపేశాయి. ఓట్ల లెక్కింపు ఆరంభమైన తరువాత డొనాల్డ్ ట్రంప్ నిర్వహించిన తొలి ప్రెస్ కాన్ఫరెన్స్ అది. ప్రెస్ కాన్ఫరెన్స్లో డొనాల్డ్ ట్రంప్ అబద్ధాల మీద అబద్ధాలు చెబుతున్నారనే కారణంతో లైవ్ కవరేజీని నిలిపివేస్తున్నట్లు మీడియా కార్యాలయాలు వెల్లడించాయి.

ఓట్ల లెక్కింపులో అవకతవకలపై..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ వెనుకంజలో ఉన్న విషయం తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యతలో ఉన్న రాష్ట్రాల్లో అనూహ్యంగా జో బిడెన్ లీడ్లోకి వచ్చారు. మెజారిటీ ఓట్లను సాధించారు. విస్కాన్సిన్, మిచిగాన్ వంటి రాష్ట్రాల్లో ఈ తరహా ఫ్లిప్ కనిపించింది. పెన్సిల్వేనియా, జార్జియాల ఫలితం ఇంకా తేలాల్సి ఉన్నప్పటికీ.. అక్కడ కూడా జో బిడెన్ ఆధిక్యతను సాధించే పరిస్థితులు ఏర్పడ్డాయి. బ్యాలెట్లు, మెయిల్ రూపంలో అందిన ఓట్ల లెక్కింపు సమయంలో డెమొక్రాట్లు అక్రమాలకు పాల్పడుతున్నారని డొనాల్డ్ ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఆయన క్యాంప్ దీనిపై న్యాయస్థానాల్లో సవాల్ చేస్తోంది.

కాలయపన దేనికోసం?
దీన్ని వివరించడానికి అమెరికా కాలమానం ప్రకారం.. గురువారం సాయంత్రం డొనాల్డ్ ట్రంప్ తన అధికారిక నివాసం వైట్హౌస్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఒకదశలో న్యాయమూర్తులపైనా ట్రంప్ ఆరోపణలు గుప్పించారు. న్యాయమూర్తులు దేశాన్ని పరిపాలించాలనుకుంటున్నట్లు కనిపిస్తోందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో తాను నైతిక విజయాన్ని సాధించానని, ఓట్ల లెక్కింపు పూర్తయినప్పటికీ.. దాన్ని ప్రకటించకుండా కాలయాపన చేస్తున్నారంటూ మండిపడ్డారు.

అబద్ధాలను ప్రసారం చేయలేం
ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ట్రంప్ చేసిన కొన్ని అంశాలు నమ్మదగ్గవిగా లేవంటూ న్యూస్ నెట్వర్క్ సంస్థలు భావించాయి. ఆయన అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకొంటూ పోతున్నారని, వాటిని తాము ప్రసారం చేయలేమని స్పష్టం చేశాయి. ప్రెస్ కాన్ఫరెన్స్ ఇంకా ముగియకముందే లైవ్ కవరేజీని అర్ధాంతరంగా నిలిపివేశాయి. 17 నిమిషాల ప్రెస్ కాన్ఫరెన్స్లో ట్రంప్ అనేక అబద్ధాలు చెప్పారని ఎంఎస్ఎన్బీసీ యాంకర్ బ్రియాన్ విలియమ్స్ చెప్పారు. లైవ్ కవరేజీని నిలిపివేస్తున్నట్లు చెప్పారు. మరో కార్యక్రమాన్ని ప్రసారం చేశారు. ఎన్బీసీ, ఏబీసీ న్యూస్ ఛానళ్లు కూడా ప్రత్యక్ష ప్రసారాన్ని బంద్ చేశాయి. అమెరికాకు ఇదొక బాధాకరమైన రోజని సీఎన్ఎన్ యాంకర్ జేక్ ట్యాపర్ వ్యాఖ్యానించారు. డొనాల్డ్ ట్రంప్ లైవ్ కవరేజీని నిలిపివేస్తున్నట్లు చెప్పారు.

ట్రంప్ ఏం చెప్పారంటే..?
జార్జియాలో ఓట్ల లెక్కింపు వ్యవహారాన్ని తప్పు పడుతూ రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులు దాఖలు చేసిన పిటీషన్ను అక్కడి న్యాయస్థానం తోసిపుచ్చింది. దీనిపై స్పందించారు. చివరికి- ప్రజా తీర్పునకు విరుద్ధంగా న్యాయమూర్తులు అమెరికాను పరిపాలించానుకుంటున్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు. కౌంటింగ్ ప్రక్రియ మొత్తం కుట్రపూరితంగా సాగిందని పునరుద్ఘాటించారు. ప్రజల తీర్పును పక్కదారి పట్టించే అలాంటి కుట్రలను సాగనివ్వకూడదని చెప్పారు. పెన్సిల్వేనియాలో తాను సుమారు ఏడు లక్షల ఓట్లను సాధించానని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయినప్పటికీ.. తాను 90 వేలకు పైగా ఓట్లతో వెనుకబడి ఉన్నట్లు చెబుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications