చైనా కంటే భారత్ బెటర్- డ్రాగన్ పై ఆధారపడొద్దు- ప్రపంచదేశాలకు అమెరికా పిలుపు
చైనాతో సరిహద్దు వివాదాల నేపథ్యంలో భారత్ కు అంతర్జాతీయ వేదికలపై మద్దతు ప్రకటిస్తూ వస్తున్న అమెరికా మరోసారి సానుకూల వ్యాఖ్యలు చేసింది. చైనాతో ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో భారత్-అమెరికా కలిసి పనిచేయాలని కోరిన విదేశాంగమంత్రి మైక్ పాంపియో మరోసారి ప్రపంచ దేశాలకు స్పష్టమైన సంకేతాలు పంపారు. అదే సమయంలో చైనాతో వాణిజ్యం విషయంలో పునరాలోచించుకోవాలని బహిరంగంగానే కోరారు. ఇవన్నీ భారత్ కు భవిష్యత్తులో ఉపయోగపడే అంశాలుగా కేంద్రం కూడా భావిస్తోంది.
Recommended Video
మరోసారి చైనాకు అమెరికా షాక్..
భారత్ వ్యతిరేక వైఖరితో ప్రపంచదేశాలకు దగ్గర కావాలని చూస్తున్న చైనాకు రోజుకో షాక్ తలుగుతూనే ఉంది. ముఖ్యంగా చైనా అంటేనే మండిపడుతున్న అమెరికా ఈ విషయంలో భారత్ కు మద్దతుగా రోజుకో ప్రకటన చేస్తూనే ఉంది. తాజాగా అమెరికాలో అధ్యక్ష్య ఎన్నికల వాతావరణం వేడెక్కుతుండటం, చైనా కంటే భారతీయుల ఓట్ల అవసరం ఎక్కువగా ఉండటం వంటి కారణాలతో భారత్ కు మద్దతుగా ట్రంప్ ప్రభుత్వం వరుస ప్రకటనలు చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా జరిగిన యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ నిర్వహించిన ఇండియా ఐడియాస్ సదస్సులో వర్చువల్ వీడియో ద్వారా మాట్లాడిన విదేశాంగమంత్రి మైక్ పాంపియో చైనాకు మరో షాకింగ్ ప్రకటన చేశారు.
చైనా కంటే భారతే బెటరంటూ...
చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్-అమెరికా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందంటూ ట్రంప్ సర్కారులో విదేశాంగమంత్రి మైక్ పాంపియో చేసిన ప్రకటన మారుతున్న పరిస్ధితులకు అద్దం పట్టేలా కనిపిస్తోంది. ఇందుకోసం భారత్ విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా తన మార్కెట్ ను విస్తృతం చేయాలని ఆయన సూచించారు. అమెరికా సహా ప్రపంచ దేశాల నమ్మకం సంపాదించిన భారత్.. గ్లోబల్ వాణిజ్య శక్తిగా ఎదిగే సత్తా కలిగి ఉందని మైక్ పాంపియో ప్రకటించారు. ముఖ్యంగా టెలికాం, వైద్య సామాగ్రి వంటి రంగాల్లో ప్రపంచ అవసరాలను తీర్చే సత్తా భారతీయ కంపెనీలకు ఉందన్నారు. అందుకే భారత్ వంటి ప్రజాస్వామ్య దేశంతో కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నట్లు పాంపియో ప్రకటించారు.
ఆ సత్తా భారత్ కే ఉంది...
ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్న చైనాను నిలువరించే సత్తా భారత్ కు మాత్రమే ఉందని మైక్ పాంపియో కీలక వ్యాఖ్యలు చేశారు. అందుకే ప్రపంచ దేశాలు చైనాపై ఆధారపడటం తగ్గించుకోవాలని పాంపియో పిలుపునిచ్చారు. తద్వారా ప్రపంచ దేశాలను భారత్ వైపు మొగ్గాలని ఆయన నేరుగా కోరినట్లయింది. ఇదే సదస్సులో అంతకు ముందు మాట్లాడిన ప్రధాని మోడీ.. భారత్ లో మౌలిక సదుపాయాలు, రక్షణ, ఇంధన, బీమా, వ్యవసాయం, ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని అమెరికాను ఆహ్వానించారు. చైనా కంటే ఎంతో మెరుగైన మార్కెట్ కలిగిన భారత్ లో పెట్టుబడులు పెట్టడం ద్వారా భారత్-అమెరికా బంధం ఇంకా దృఢమవుతుందని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.