ఇన్నేళ్లూ మమ్మల్ని వాడుకుని.. ఇప్పుడు మాపై నిందలా?: అగ్రరాజ్యంపై పాకిస్తాన్ ఎదురుదాడి!
Recommended Video

ఇస్లామాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా ట్వీట్ నేపథ్యంలో పాకిస్తాన్.. అగ్రరాజ్యం అమెరికాపై ఎదురుదాడికి దిగింది. అమెరికా తన సైనిక స్థావరాల ఏర్పాటుకు పాకిస్తాన్ భూభాగాన్ని వాడుకుందని, తమ నిఘా వర్గాలను కూడా ఉపయోగించుకుందని ఆరోపించింది.
The United States has foolishly given Pakistan more than 33 billion dollars in aid over the last 15 years, and they have given us nothing but lies & deceit, thinking of our leaders as fools. They give safe haven to the terrorists we hunt in Afghanistan, with little help. No more!
— Donald J. Trump (@realDonaldTrump) January 1, 2018
We will respond to President Trump's tweet shortly inshallah...Will let the world know the truth..difference between facts & fiction..
— Khawaja M. Asif (@KhawajaMAsif) January 1, 2018
16 ఏళ్లుగా తమ సాయాన్ని తీసుకుంటూ.. తమపై అపనమ్మకం పెంచుకున్న అమెరికా ఇప్పుడు తమపైనే దూషణలకు దిగుతోందని పాకిస్తాన్ దుయ్యబట్టింది. అసలు వాస్తవాలను ప్రపంచానికి తెలియజేస్తామంటూ అమెరికాకే తిరుగుబాటు స్వరం వినిపిస్తోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్, సైనిక సాయం నిలిపివేత నిర్ణయంపై పాకిస్తాన్ ప్రధాని షాహీద్ ఖాన్ అబ్బాసీ అత్యవసరంగా ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాక్ నిఘా సంస్థ అయిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్ (ఐఎస్ఐ) సహా ఇతర ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ట్రంప్ ఏమన్నారంటే...
పాకిస్తాన్ను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ట్విట్టర్లో మండిపడిన సంగతి తెలిసిందే. ‘అఫ్గానిస్తాన్లో మా పోరాటం ఎంతో వ్యయప్రయాసలకు, ప్రాణత్యాగానికి సంబంధించినది. తాలిబాన్లతో మేం పోరాడుతుంటే మా నుంచి సాయం అందుకున్న పాక్- అదే తాలిబన్కు ఆశ్రయమిస్తోంది. అంటే ఓ రకంగా అమెరికన్లను చంపడానికి పాక్ సహకరిస్తోంది. ఇంకా మౌనంగా ఉండలేం. ఈ పరిస్థితి మారాలి.. తక్షణం మారాలి..మా సైనికుల్ని, ఆఫీసర్లను చంపుతున్న వర్గాలకే సాయపడడం అసాధ్యం.. ' అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు.

ఘాటుగా స్పందించిన పాక్...
ట్రంప్ ట్వీట్పై పాకిస్తాన్ ఘాటుగా స్పందించింది. ప్రపంచానికి అసలు వాస్తవాన్ని తెలియజేస్తామని పాక్ విదేశాంగ మంత్రి ఖావాజా ఆసిఫ్ వ్యాఖ్యానించారు. మరోవైపు పాక్ రక్షణ శాఖ మంత్రి ఖుర్రమ్ దస్తగిర్ ఖాన్ మాట్లాడుతూ.. అమెరికాకు తాము ఉచితంగా భూమిని ఇచ్చామని, తమ సైనిక స్థావరాలు, నిఘా వర్గాలను అమెరికా వాడుకుందని అన్నారు. 16 ఏళ్లుగా తమ సాయాన్ని తీసుకుంటూ, తమపై అపనమ్మకాన్ని పెంచుకున్న అమెరికా ఇప్పుడు దూషణలకు దిగుతోందని ఆరోపించారు.

అమెరికా కోసం ఎన్నో త్యాగాలు...
అమెరికా కోసం పాకిస్తాన్ ఎన్నో త్యాగాలు చేసిందని ఆ దేశ సమాచార, ప్రసారాల శాఖ మంత్రి మరియం ఔరంగజేబ్ వ్యాఖ్యానించారు. అఫ్ఘానిస్తాన్లో విఫలమైన ట్రంప్ ప్రభుత్వం తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు పాకిస్తాన్పై ఆరోపణలు చేస్తోందని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తానీలను హతమారుస్తున్న సీమాంతర ఉగ్రవాద స్వర్గధామాలను అమెరికా విస్మరిస్తోందంటూ.. పరోక్షంగా భారత్ను ప్రస్తావిస్తూ విమర్శించారు.

పాక్కు సైనికసాయం నిలిపివేత...
పాకిస్తాన్ వైఖరిపై అమెరికా అధ్యక్షుడు ట్వీట్ చేసిన కొన్ని గంటల్లోనే ఆ ప్రభావం పాకిస్తాన్పై పడింది. డొనాల్డ్ ట్రంప్ ఓ ట్వీట్ ద్వారా ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే ట్రంప్ యంత్రాంగం పాక్కు 255 మిలియన్ డాలర్ల సైనిక సహాయాన్ని నిలిపేస్తున్నట్లు వెల్లడించింది. ఉగ్రవాదంపై పాకిస్తాన్పై స్పందన బట్టి ఈ సాయం ఉంటుందని ట్రంప్ యంత్రాంగం పేర్కొంది. మరోవైపు అగ్రరాజ్యం అమెరికా చర్యతో పాకిస్తాన్ కూడా రెచ్చిపోయింది. పాకిస్తాన్లోని అమెరికా రాయబారికి.. పాక్ విదేశాంగ శాఖ కార్యాలయం సమన్లు పంపినట్లు పాక్ అధికార పత్రిక ‘డాన్' పేర్కొంది.

‘‘ట్రంప్ నిర్ణయం వెనుక భారత్...’’
ఉగ్రవాద సంస్థ జమాతే ఉద్ దవా(జేయూడీ) అధినేత, ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ మరోసారి భారత్పై విషం కక్కాడు. పాకిస్తాన్కు అమెరికా నిధులు నిలిపివేయడం వెనుక భారత్ హస్తం ఉందని పేర్కొన్నాడు. భారత్ ఒత్తిడి కారణంగానే తమ దేశానికి సహాయక నిధులు నిలిపివేస్తూ డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. అమెరికా నిర్ణయంపై హఫీజ్ సయీద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications