పెళ్లి పందిరిలో మృత్యుఘోష: అమెరికా దాడిలో చిన్నారితో సహా ఐదుగురు దుర్మరణం!
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రమయ్యాయి. ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో దక్షిణ ఇరాన్లోని హోర్మోజ్గాన్ ప్రావిన్స్లో ఓ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. హోర్ముజ్ జలసంధి సమీపంలో ఉన్న కుహెస్తాక్ అనే తీరప్రాంత హ్రామంలో మరియం మల్లాహి అనే యువతి వివాహ వేడుకలు రెండు ఇళ్లలో ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. వందలాది మంది అతిథులు, బంధువులతో ఆ ఇల్లు కోలాహలంగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో నాలుగేళ్ల చిన్నారితో సహా ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. 67 మంది తీవ్రంగా గాయపడ్డారు.
అమెరికా దాడి చేసిందా?
ఈ దాడి అమెరికా దళాలే జరిపాయనే వార్తలపై యూఎస్ సెంట్రల్ కమాండ్(సెంట్ కామ్) స్పందించింది. సెంట్ కామ్ ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ మాట్లాడుతూ.. ఇరాన్ మీడియాలో వస్తున్న కథనాలను తాము గమనించామని.. దీనిపై అంతర్గత సమీక్ష, దర్యాప్తు చేపడుతున్నామని చెప్పారు. అమెరికా సైన్యం ఎప్పుడూ సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకోదని ఆయన స్పష్టం చేశారు. వైట్ హౌస్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఈ ఘటనపై విచారణ జరుపుతామని వెల్లడించారు. ఈ వినాశనం అనుకోకుండా జరిగినది కాదని.. నేరుగా ప్రయోగించిన క్షిపణి వల్లే జరిగి ఉండవచ్చని కథనాలు వెలువడుతున్నాయి.

వణుకు పుట్టించిన ప్రత్యక్ష సాక్షి అనుభవం
వేడుకలో పాల్గొన్న జైనాబ్ మల్లాహి అనే అతిథి ఆ భయానక క్షణాలను గుర్తుచేసుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలంతా సాంప్రదాయ పాటలతో ఆనందోత్సవాల్లో మునిగి తేలుతున్న సమయంలో ఉన్నట్లుండి భారీ శబ్ధంతో ఇంటి పైకప్పు, గోడలు వారిపై కూలిపోయాయి. ఒక్కసారిగా ఆనంద కేకలు ఆర్తనాదాలుగా మారిపోయాయి. నేలలో ఏకంగా 1.5 మీటర్ల లోతు గొయ్యి ఏర్పడగా.. మరొకటి పక్కనే ఉన్న తాటి చెట్టును ఢీకొట్టడంతో అది కాస్తా గోడపై పడి కూలిపోయింది.
సైనిక స్థావరాలు లేని నివాస ప్రాంతం
వధువు తండ్రి, స్థానిక మత్స్యకారుడైన అలీ మల్లాహి మాట్లాడుతూ.. తమ పెళ్లికి సుమారు 350 మంది హాజరయ్యారన వెల్లడించారు. ఈ వేడుకలు జరిపిన రెండు ఇళ్లు సంపూర్ణంగా పౌర నివాస ప్రాంతంలోనే ఉన్నాయని.. వాటికి సమీపంలో ఎలాంటి సైనిక స్థావరాలు లేదా ఆర్మీ నిర్మించిన నిర్మాణాలు లేవని ఆయన స్పష్టం చేశారు. మొదటి శబ్ధం వినగానే ఇంట్లో ఏదైనా గ్యాస్ సిలిండర్ పేలిందేమోనని భావించానని.. కానీ పక్క ఇంటి వద్ద సైన్యం, ప్రజలు రక్షణ చర్యల్లో పడటంతో ఘటన తీవ్రత అర్థమైందని వాపోయారు. ప్రస్తుతం ఇరాన్ రెడ్ క్రెసెంట్ బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి.













Click it and Unblock the Notifications