అమెరికా వీసా దరఖాస్తుదారులకు భారీ షాక్! హెచ్-1బీ, ఓపీటీ ఫీజులపై తాజా నిర్ణయం..!
అమెరికాలో (US) డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక భారతీయులకు ఏదో విధంగా నిత్యం షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇదే క్రమంలో తాజాగా భారతీయులకు మరో షాక్ ఇచ్చేందుకు ట్రంప్ సర్కార్ సిద్దమవుతోంది. ఇందులో భాగంగా హెచ్-1బీ వర్క్ వీసా, ఎఫ్-1 ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) ప్రోగ్రామ్లపై కొత్త ఫీజుల్ని ప్రవేశపెట్టేందుకు అమెరికా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం వైట్ హౌస్ బడ్జెట్ కార్యాలయం పరిశీలనలో ఉన్నాయి.
అమెరికా తాజా నిర్ణయం వల్ల అక్కడికి వెళ్లాలనుకునే లక్షలాది మంది భారతీయులపై ఆర్థిక భారం భారీగా పెరిగే అవకాశం ఉంది. అమెరికాలో 2024 ఆర్థిక సంవత్సరంలో మంజూరైన హెచ్-1బీ వీసాలలో దాదాపు 71 శాతం భారతీయులకే దక్కాయి. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం తీసుకోబోయే ఫీజుల పెంపు నిర్ణయం నేరుగా మన ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపనుంది. న్యూయార్క్కు చెందిన ప్రముఖ ఇమ్మిగ్రేషన్ లా సంస్థ ఫ్రాగోమెన్ ప్రకారం, ఇప్పటికే ఈ ప్రతిపాదనల ముసాయిదా యూఎస్ బడ్జెట్ విభాగానికి చేరింది. గతంలో ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బీ వీసా పిటిషన్లపై ఏకంగా లక్ష డాలర్ల ఫీజు విధించాలని ప్రయత్నించగా, కోర్టు దాన్ని తిరస్కరించింది. దాంతో ఇప్పుడు హోంల్యాండ్ సెక్యూరిటీ మరో ప్రత్యామ్నాయ మార్గంలో ఫీజులు పెంచేందుకు చట్టపరమైన సన్నాహాలు చేస్తోంది.

మరోవైపు విద్యార్థుల విషయానికి వస్తే, ఉన్నత విద్య పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం చేసుకునేందుకు ఉపయోగపడే ఎఫ్-1 ఓపీటీ (OPT) దరఖాస్తులపై కూడా ఈ పెరిగిన ఫీజుల ప్రభావం పడనుంది. ఈ ఫీజుల్ని కూడా భారీగా పెంచవచ్చని సమాచారం. ప్రస్తుతం ఆన్లైన్లో ఓపీటీ దరఖాస్తుకు 470 డాలర్లు, పేపర్ రూపంలో అయితే 520 డాలర్లు చెల్లించాల్సి ఉంది. సాధారణంగా హెచ్-1బీ వీసా రుసుములను కంపెనీలే భరిస్తాయి. కానీ ఓపీటీ ఫీజులను విద్యార్థులే స్వయంగా చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఖర్చులు భారీగా పెరిగితే భారతీయ విద్యార్థుల ఉన్నత చదువులపై, ఆ తర్వాతి ఉపాధి అవకాశాలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది. అమెరికాలో స్థిరపడేందుకు చాలా కాలంగా ఉన్న ఎఫ్-1 నుండి హెచ్-1బీ మార్గం మరింత వ్యయభరితంగా మారనుంది. తుది నోటిఫికేషన్ వచ్చే వరకు ఫీజు ఎంత పెరుగుతుందనే దానిపై పూర్తి స్పష్టత రాదు.














Click it and Unblock the Notifications