పుతిన్ కు ప్రధాని మోడీ కీలక సూచన-యూఎస్ మీడియా ప్రశంసలు-ఇంతకీ ఏమన్నారంటే ?
ఉజ్బెకిస్తాన్లో జరుగుతున్న షాంఘై సహకార సమాఖ్య ఎస్.సి.ఓ సదస్సుకు హాజరైన ప్రధాని మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇందులో వీరిద్దరి మధ్య ఓ కీలక అంశం ప్రస్తావనకు వచ్చింది. ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్దాన్ని ఆపేయాలంటూ ప్రధానిమోడీ ఈ సందర్భంగా రష్యా అధినేత పుతిన్ కు సూచించారు. దీనికి ఆయన కూడా సరేనన్నారు. దీనిపై యూఎస్ మీడియా స్పందించింది.
ఉక్రెయిన్లో యుద్ధానికి ఇది సమయం కాదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పడంపై అమెరికన్ ప్రధాన స్రవంతి మీడియా ప్రశంసించింది. సమర్కంద్ లో మోదీ-పుతిన్ సంభాషణను ప్రధాన స్రవంతి అమెరికన్ మీడియా విస్తృతంగా ప్రసారం చేసింది. "ఉక్రెయిన్లో యుద్ధంపై మోదీ పుతిన్ను మందలించారు" అని వాషింగ్టన్ పోస్ట్ హెడ్లైన్లో పేర్కొంది. పుతిన్-మోడీ భేటీలో ఉక్రెయిన్ వార్ ప్రస్తావన వచ్చింది. దీంతో ప్రధాని మోడీ పుతిన్ తో.. ఇది యుద్ధాల యుగం కాదని, దౌత్యపరమైన చర్యల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. దీంతో మోడీ పుతిన్ ను మందలించారంటూ యూఎస్ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది.
ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యతో రష్యా పాలకుడికి అన్ని వైపుల నుంచి ఒత్తిడి తప్పడం లేదంటూ యూఎస్ మీడియా కథనాలు ప్రచురిస్తోంది. మరోవైపు తాజాగా మోదీ వ్యాఖ్యల తర్వాత పుతిన్ స్పందిస్తూ.. ఉక్రెయిన్ వివాదంపై, మీరు నిరంతరం వ్యక్తపరిచే మీ ఆందోళనల గురించి మీ వైఖరి నాకు తెలుసు. దీన్ని వీలైనంత త్వరగా ఆపేందుకు మా వంతు కృషి చేస్తాం. దురదృష్టవశాత్తు, ప్రత్యర్థి వైపు, ఉక్రెయిన్ నాయకత్వం, చర్చల ప్రక్రియను విడిచిపెట్టినట్లు ప్రకటించింది, సైనిక మార్గాల ద్వారా తన లక్ష్యాలను సాధించాలనుకుంటున్నట్లు ప్రకటించిందన్నారు.