The last Soldier: చెప్పింది చేసిన అమెరికా: కాబుల్ ఎయిర్పోర్ట్ నుంచి గడువు కంటే ముందే
వాషింగ్టన్: ఆఫ్ఘనిస్తాన్లో ఓ కీలక ఘట్టం ముగిసింది. ఏదైతే చెప్పిందో.. దాన్ని చేసి చూపించింది అగ్రరాజ్యం అమెరికా. గడువు కంటే ఒక రోజు ముందే దాన్ని పూర్తి చేసింది. ఆప్ఘనిస్తాన్ అల్లకల్లోలంగా మారడానికి, మరోసారి ఉగ్రవాదులకు షెల్టర్ జోన్గా మారడానికీ కారణమైన కార్యాచరణ ప్రణాళిక అది. దీనిపట్ల అమెరికా అనేక విమర్శలను ఎదుర్కొంటోంది. వాటన్నింటికీ సమాధానం ఇస్తానని అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఇంకొన్ని గంటల్లో ఆయన తన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతోన్నారు.

వరుస దాడులు..
ఆప్ఘనిస్తాన్.. కంప్లీట్గా తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన అతి కొద్దిరోజుల్లోనే ఆ దేశం బాంబు పేలుళ్లతో దద్దరిల్లి పోతోంది. పదుల సంఖ్యలో ఆప్ఘనిస్తానీయులు ప్రాణాలను కోల్పోతోన్నారు. బాంబు పేలుళ్ల ధాటికి రక్తమోడుతోన్న శరీరాలతో ఆసుపత్రుల పాలవుతున్నారు. ఏదైతే జరక్కూడదని ప్రపంచ దేశాలు భావిస్తూ వచ్చాయో.. అలాంటి పరిస్థితులే అక్కడ నెలకొంటోన్నాయి. ఉగ్రవాదులకు అడ్డగా మారింది. వరుస దాడులను ఎదుర్కొంటోంది.

బలగాల ఉపసంహరణతోనే..
రెండు దశాబ్దాలకు పైగా అమెరికా, నాటో బలగాల చేతుల్లో ఒకింత సురక్షితంగా కనిపించిన ఆఫ్ఘనిస్తాన్.. ఇప్పుడు అల్లకల్లోలంగా మారింది. దినదినగండంగా మారిందక్కడి ప్రజలు జీవనం. ఎప్పుడు, ఎటు నుంచి ఏ ఉగ్రదాడి జరుగుతుందో తెలియని పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. మృత్యువుతో నిత్యం పోరాడే దుస్థతికి చేరుకున్నారు ఆఫ్ఘనిస్తానీయులు. ఇటీవలే కాబుల్లోని లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద సంభవించిన మారణ హోమాన్ని కళ్లారా చూశారు. జంట పేలుళ్లతో వణికి పోయారు.

ఆ కీలక ఘట్టం పూర్తి..
ఈ పరిణామాల మధ్య అమెరికా.. తన సైనిక బలగాలను ఆప్ఘనిస్తాన్ నుంచి పూర్తిగా ఉపసంహరించుకుంది. మంగళవారం నాటికి.. అంటే ఆగస్టు 31వ తేదీ నాటికి బలగాల ఉపసంహరణను పూర్తి చేస్తామని ఇదివరకే ప్రకటించింది అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్. దీనికి ఇంకా గడువు మిగిలి ఉండగానే.. ఆ ప్రక్రియను ముగించేసింది. తాలిబన్లు ఆఫ్ఘన్ను పూర్తిగా ఆక్రమించుకున్న తరువాత 15 రోజుల్లో ఎవాక్యుయేషన్ను పూర్తి చేసింది యూఎస్.
చిట్టచివరి ఫ్లైట్ ఎప్పుడు? ఎవరెవరు?
అమెరికా వైమానిక దళానికి చెందిన సీ-16 ఎయిర్ క్రాఫ్ట్ సోమవారం మధ్యాహ్నం 3:29 నిమిషాలకు కాబుల్లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకుందని పెంటగాన్ ప్రకటించింది. ఈ ఫ్లైట్లో ఆప్ఘనిస్తాన్లోని తమ దేశ రాయబారి రాస్ విల్సన్, యూఎస్ ఆర్మీ 82వ ఎయిర్బోర్న్ డివిజన్ కమాండర్ మేజర్ జనరల్ క్రిస్ డొనాహ్యూ ఉన్నట్లు తెలిపింది. చిట్టచివరగా క్రిస్ డొనాహ్యూ ఫ్లైట్ ఎక్కారని స్పష్టం చేసింది. ఆప్ఘనిస్తాన్ నుంచి యూఎస్ బయలుదేరిన చిట్టచివరి అధికారి ఆయనేనని పేర్కొంది. ఆయనతో ఇక సైనిక బలగాల ఉపసంహరణ పూర్తయినట్లు ప్రకటించింది.
మిషన్ కంప్లీటెడ్..
ఆప్ఘనిస్తాన్లో ఓ మిషన్ కంప్లీట్ అయిందని యూఎస్ జనరల్ కెన్నెత్ ఎఫ్ మెకెంజీ ప్రకటించారు. ఆప్ఘన్ నుంచి సైనిక బలగాలు, తమ దేశ పౌరులను సురక్షితంగా స్వదేశానికి చేర్చినట్లు చెప్పారు. చిట్టచివరి ఎయిర్ క్రాఫ్ట్ కాబుల్ ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ తీసుకుందని అన్నారు. ఇక దౌత్యపరమైన సంబంధాలు మాత్రం కొనసాగుతాయని వ్యాఖ్యానించారు. 20 సంవత్సరాల తరువాత పూర్తి స్థాయిలో అమెరికా సైనిక బలగాల ఉపసంహరణ ముగిసిందని మెకెంజీ చెప్పారు.
లార్జెస్ట్ ఎయిర్లిఫ్ట్..
కాగా- ఈ ప్రక్రియ పూర్తి అయిందనే విషయాన్ని జో బైడెన్ నిర్ధారించారు. అమెరికా చరిత్రలోనే అతి పెద్ద ఎయిర్ లిఫ్ట్గా అభివర్ణించారు. 17 రోజులుగా నిరంతరాయంగా, విరామం లేకుండా ఈ తరలింపు ప్రక్రియ కొనసాగిందని పేర్కొన్నారు. 1,20,000 అమెరికా పౌరులు, ఆఫ్ఘనిస్తానీయులు, ఇతర దేశాల వారిని తరలించామని బైడెన్ తెలిపారు. చిట్టచివరి ఫ్లైట్ టేకాఫ్ కావడంతో ఈ ప్రక్రియ ముగిసిందని వ్యాఖ్యానించారు.
మరో ప్రాణం పోకుండా..
ఆగస్టు 31వ తేదీని గడువుగా నిర్ణయించుకున్నప్పటిెకీ.. దానికంటే ముందే తరలింపు ప్రక్రియను పూర్తి చేయడం పట్ల బైడెన్.. మిలటరీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. మరో సైనికుడి ప్రాణం పోకుండా సురక్షితంగా తరలించారని కితాబిచ్చారు. ఇంకా ఎవరైనా అమెరికన్లు ఆఫ్ఘనిస్తాన్లో ఉంటే వారిని కూడా తరలిస్తామని, అలాగే- మిత్ర దేశాల ప్రజలను కూడా ఎయిర్ లిఫ్ట్ చేయడానికి సహకరిస్తామని బైడెన్ భరోసా ఇచ్చారు. మిత్రదేశాలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని విదేశాంగ మంత్రిత్వ శాఖను ఆదేశించినట్లు చెప్పారు.

దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతా..
ఆఫ్ఘనిస్తాన్లో నెలకొన్న పరిణామాలు, సైనిక తరలింపు ప్రక్రియ గురించి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తానని జో బైడెన్ ప్రకటించారు. ఆగస్టు 31వ తేదీ వరకు ఆప్ఘన్లో చోటు చేసుకున్న పరిణామాలను ప్రజల వివరిస్తానని అన్నారు. పొరుగు దేశాల ప్రజలను సురక్షితంగా తరలిస్తామని తాలిబన్లు హామీ ఇచ్చారని, దానికి వారు కట్టుబడి ఉంటారని ఆశిస్తున్నట్లు బైడెన్ చెప్పారు. ఏ ఒక్క ప్రాణం కూడా పోకుండా వారిని సురక్షితంగా దేశం దాటించడానికి అవసరమైన రక్షణను కల్పించాల్సిన బాధ్యతను తాలిబన్లు తీసుకోవాలని అన్నారు.
Recommended Video

తీవ్ర పరిణామాలు తప్పవు..
ఆప్ఘనిస్తాన్ మరోసారి ఉగ్రవాదులకు అడ్డగా మారుతోందనే, ప్రత్యేకించి- భయానక ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టులకు అడ్డగా మారుతుందనే ఆందోళనలు ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తమౌతోన్న విషయం తెలిసిందే. భారత్ కూడా దీనికి మినహాయింపు కాదు. ఈ పరిస్థితుల్లో- కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయే తాలిబన్లకు కొన్ని కీలక సూచనలు చేయాలని అమెరికా భావిస్తోంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించడాన్ని మానుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలను చవి చూడాల్సి ఉంటుందనే అమెరికా ముందునుంచీ చెబుతూ వస్తోంది.












Click it and Unblock the Notifications