ఓమిక్రాన్ వేరియంట్ కలకలం: బూస్టర్ షాట్ కు ముందుకొచ్చిన మోడర్నా..!!
రూపాలు మార్చుకుంటున్న కరోనా మహమ్మారి ఇప్పుడు ఆఫ్రికన్ దేశాలను వణికిస్తోంది. మరింత బలంగా మారి విరుచుకుపడుతున్నది. తాజాగా దక్షిణాఫ్రికాలో బి 1.1.529 వేరియంట్ను గుర్తించారు. ఈ వేరియంట్లో 32 మ్యూటేషన్లు ఉన్నట్టుగా గుర్తించారు. దీంతో ఇది ప్రమాదకరమైన వేరియంట్గా గుర్తించి దీనికి ఒమిక్రాన్ గా పేరు పెట్టారు. దక్షిణాఫ్రికాలో గుర్తించిన ఈ వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్నది. దక్షిణాఫ్రికాతో పాటుగా బోట్స్వానా, హాంకాంగ్ దేశాల్లో కనిపించింది.
తాజాగా ఈ రకం వేరియంట్ కేసులు ఇజ్రాయిల్, బెల్జియం దేశాల్లో కూడా బయటపడటంతో ప్రపంచ దేశాల్లో ఆందోళన మొదలైంది. దక్షిణాఫ్రికా దేశం నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేదం విధిస్తున్నారు. దక్షిణాఫ్రికాతో సహా ఆరుదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేదం విధించింది ఇజ్రాయిల్. సింగపూర్, జపాన్ తో పాటుగా యూరోపియన్ దేశాలు కూడా దక్షిణాఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధించేందుకు సిద్ధం అవుతున్నాయి. అయితే, ఇండియాలో ఈ రకం వేరియంట్ కేసులు నమోదు కాలేదని ఇన్కాగ్ తెలియజేసింది.
ఈ కొత్త ఓమిక్రాన్ వేరియంట్ నియంత్రణ కోసం బూస్టర్ డోసు అభివృద్ధి చేయనున్నట్లు యుఎస్ ఫార్మాస్యూటికల్ కంపెనీ మోడర్నా ప్రకటించింది. కొత్త ముప్పును పరిష్కరించడానికి కంపెనీ పనిచేస్తున్న మూడు వ్యూహాలలో ఇది ఒకటిగా ఉందని.. ప్రస్తుత వ్యాక్సిన్ యొక్క అధిక మోతాదుతో అందుబాటులోకి తెస్తున్నామని మోడర్నా వెల్లడించింది. ఓమిక్రాన్ వేరియంట్ లోని మ్యూట్యేషన్స్ ను గుర్తించి వాటి నిరోధానికి వీలుగా వ్యూహాన్ని అమల్లో భాగంగా ముందుకు వెళ్తున్నట్లు మోడార్నా సీఈవో స్టెఫాన్ బాన్సెల్ చెప్పారు.
Recommended Video
గత కొన్ని రోజులుగా దక్షిణాఫ్రికాలో రోజూవారీ సగటు కేసులు 200కుపైగా నమోదవుతున్నాయి. అయితే, గత బుధవారం ఒక్కరోజునే 1,200 కేసులు నమోదయ్యాయి. ఆ మరుసటి రోజు దానికి రెట్టింపు అంటే 2,465 కేసులు రికార్డయ్యాయి. మరణాలు కూడా అనూహ్యంగా ఆరు రెట్లు పెరిగాయి. దీంతో రంగంలోకి దిగిన శాస్త్రవేత్తలు మూలాలను వెతికే పనిలో పడ్డారు. ఈ క్రమంలో వారు కరోనా కొత్త వేరియంట్ను గుర్తించారు. అదే 'బీ.1.1.529'. దక్షిణాఫ్రికా దేశం బోత్సువానాలో రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్న హెచ్ఐవీ రోగిలో ఈ వేరియంట్ ఉత్పన్నమై ఉండొచ్చని యూనివర్సిటీ కాలేజ్ లండన్లోని జెనటిక్స్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఫ్రాన్కోసిస్ బాలౌక్స్ అభిప్రాయపడ్డారు.