అమెరికా ఎన్నికల తుది అంకం- ఓటింగ్ బేస్పై బిడెన్ గురి-కరోనా చర్యల సమర్ధనలో ట్రంప్...
అమెరికా అధ్యక్ష ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. పోలింగ్ తేదీకి మరో ఆరు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికల రేసులో ఉన్న రిపబ్లికన్, డెమోక్రాట్ అభ్యర్ధులు దేశవ్యాప్తంగా తిరుగుతూ తుది ప్రయత్నాల్లో మునిగి తేలుతున్నారు. ఇందులో కరోనాను ఎదుర్కొనే విషయంలో వైఫల్యాలపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వ చర్యలను సమర్ధించుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. అదే సమయంలో ట్రంప్కు వ్యతిరేకంగా మారిన నల్లజాతీయులను పూర్తిగా తనవైపు తిప్పుకోవడం ద్వారా ఓటింగ్ బేస్ పెంచుకునేందుకు బిడెన్ ప్రయత్నిస్తున్నారు. ఈ వారంలో ఓటర్లను ఎంతగా ప్రభావితం చేయగలిగితే ఫలితాలపై ఆ మేరకు ప్రభావం చూపవచ్చని ఇరువురు అభ్యర్ధులు భావిస్తున్నారు.

తుది అంకానికి అమెరికా ఎన్నికలు..
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు తుది అంకానికి చేరిపోయింది. మరో ఆరు రోజుల్లో పోలింగ్ జరగబోతోంది. ఇందుకోసం అధికార యంత్రాంగం ఓవైపు ముమ్మర ప్రయత్నాలు చేస్తుండగా.. ప్రధాన పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తున్నాయి. ముందస్తు ఓటింగ్లో ఇప్పటికే 65 మిలియన్ల మంది అమెరికన్లు ఓటేయడంతో దాదాపు సగం ఎన్నికలు పూర్తయినట్లేనని భావిస్తున్నారు. అయిత ఇందులో డెమోక్రాట్లకు మొగ్గు ఉందన్న అంచనాల నేపథ్యంలో రిపబ్లికన్లు అప్రమత్తమయ్యారు. పోలింగ్ తేదీ నాటికి మిగిలిన ఓటర్లను ఏదో విధంగా ఆకట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అధికార పార్టీ అభ్యర్ధులకు కరోనాను ఎదుర్కోవడంలో వైఫల్యాలు, ఉద్యోగాల కోత, ఆర్ధిక వ్యవస్ధ కుదేలవడం సమస్యగా మారుతోంది.

ఓటర్ల బలం కాపాడుకునేందుకు ట్రంప్..
2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచిన ఓటర్లను కాపాడుకుంటే చాలు తిరిగి అధికారం నిలబెట్టుకోవడం ఖాయంగా ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నారు. అందుకే చివరి నిమిషంలో గతంలో తనకు అండగా నిలిచిన రాష్ట్రాలపై ఎక్కువగా దృష్టిసారిస్తున్నారు. ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న మిచిగాన్, వెస్కాన్సిన్, నెబ్రాస్కా, పెన్సిల్వేనియా వంటి రాష్ట్రాల్లో ట్రంప్ సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తున్నారు. ఇందులో నెబ్రాస్కా మినహా మిగిలిన మూడు రాష్ట్రాల్లో 2016లో ట్రంప్ బొటాబొటీ మెజారిటీతో గట్టెక్కారు. అప్పటి మెజారిటీని కాపాడుకున్నా చాలని ట్రంప్ భావిస్తున్నారు. అప్పటి ఎన్నికల్లో ట్రంప్కు అత్తెసరు మెజారిటీ అందించిన పెన్సిల్వేనియాలో ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ కూడా తన భర్తకు మద్దతుగా రంగంలోకి దిగారు. తాను తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటున్న కరోనా చర్యల విషయంలోనూ ట్రంప్ ఎదురుదాడికి ప్రయత్నించడం ద్వారా ఆధిక్యానికి శ్రమిస్తున్నారు.
Recommended Video

ఓటర్ల బేస్ పెంచుకుంటున్న బిడెన్...
2016 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్ధి ట్రంప్కు అండగా నిలిచిన పలు రాష్ట్రాల్లో ఈసారి డెమోక్రాట్లకు మద్దతు సంపాదించిపెట్టేందుకు అధ్యక్ష అభ్యర్ధి జో బిడెన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో ఆయనకు పలుచోట్ల సానుకూల పవనాలు వీస్తున్నాయి. తాజాగా జరిగిన ఎన్నికల ముందస్తు ఓటింగ్లో గతంలో ట్రంప్కు మెజారిటీ అందించిన పెన్సిల్వేనియా, మిచిగాన్, విస్కాన్సిన్ వంటి రాష్ట్రాల్లో మెజారిటీ ఓట్లు లభించడం బిడెన్ శిబిరంలో ఆనందం నింపుతోంది. పెన్సిల్వేనియాలో 3.8 శాతం ఓట్లు, మిచిగాన్లో 8.7 శాతం ఓట్లు, విస్కాన్సిన్లో 7.6 శాతం ఓట్ల అధిక్యతను డెమోక్రాట్లు సాధించారు. దీంతో చివరి వారంలో ట్రంప్కు మద్దతుగా ఉన్న రాష్ట్రాల్లో తన ఓటర్ల బేస్ను మరింత పెంచుకోవడం ద్వారా ప్రత్యర్ధులను ఒత్తిడిలోకి నెట్టేందుకు బిడెన్ ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications