రష్యాపై మరిన్ని ఆర్దిక ఆంక్షలు - 30 దేశాల ప్రతినిధులతో సమావేశం : బైడెన్ ప్రకటన..!!
ఉక్రెయిన్ పైన రష్యా యుద్దం ప్రారంభించటం పైన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సీరియస్ గా స్పందించారు. యుద్దం పైన కీలక ప్రకటన చేసారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ను ఆక్రమణ దారుడిగా బైడెన్ అభివర్ణించారు. దీంతో..రష్యా పైన పలు ఆంక్షలు విధించినట్లు ప్రకటించారు. రష్యాకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఒక్కటైందని వ్యాఖ్యానించారు. పుతిన్.. సోవియేట్ యూనియన్ను తిరిగి స్థాపించాలనుకుంటున్నారని బైడెన్ అన్నారు. ఉక్రెయిన్ అంశంపై భారత్తో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు.
పుతిన్ లో మాట్లాడేదే లేదు
పుతిన్తో మాట్లాడే ఆలోచన లేదని బైడెన్ స్పష్టం చేసారు. రష్యా పైన మరిన్ని ఆంక్షలు విధిస్తున్నట్లు వెల్లడించారు. యూఎస్ పెట్టుబడి దారుల నుంచి రష్యాకు ఫండ్ రైజింగ్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. . 4 బ్యాంకుల లావాదేవీలపై పూర్తిగా నిషేధం విధిస్తున్నట్లు.. అదేవిధంగా250 బిలిలయన్ డాలర్ల వీటీబీ బ్యాంక్ (రష్యన్ ప్రభుత్వ బ్యాంకు) ఆస్తులను ఫ్రీజ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో పాటు 3 ట్రిలియన్ డాలర్ల ఆస్తులను కూడా సీజ్ చేస్తామన్నారు. ఈ సంక్షోభంలో ఉక్రెయిన్ ప్రజలకు అండగా ఉంటామని బైడెన్ భరోసా ఇచ్చారు. అయితే రష్యాతో యుద్ధానికి తమ బలగాలను పంపించడం లేదని ఆయన స్పష్టం చేశారు.
నాటో దేశాలు బలగాలు
అమెరికాపై రష్యా ఏమైనా సైబర్ దాడులు జరిపితే స్పందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నాటో దేశాలను బలగాలను పంపనున్నట్లు వెల్లడించారు. జీ-7, ఈయూ కూటమి దేశాలు కూడా రష్యాపై ఆంక్షలు విధించాలని బైడెన్ సూచించారు. ప్రస్తుత ఆంక్షలు అమెరికాపై తాత్కాలికంగా ప్రభావం చూపినా.. రష్యా ఆర్థికవ్యవస్థపై దీర్ఘకాలికంగా ప్రభావం ఉంటుందని అన్నారు. మరో వైపు నాటో(నార్త్-అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) ప్రతినిధులు గురువారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఉక్రెయిన్, రష్యా పొరుగున ఉన్న సభ్య దేశాల్లో రక్షణను బలోపేతం చేయడానికి సిద్ధమవుతున్నారు.
ఉక్రెయిన్ కు అండగా నిలుస్తాం
యూరో- అట్లాంటిక్ భద్రతకు తీవ్రమైన ముప్పు' అని నాటో జనరల్ సెక్రటరీ జెన్స్ స్టోల్టెన్బర్గ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత పరిణామాలపై చర్చించేందుకు మిత్ర దేశాలు సమావేశమవుతున్నాయని తెలిపారు. ఈ సమయంలో ఉక్రెయిన్ ప్రజలకు అండగా ఉంటామని.. తమ తరఫున చేయాల్సిందంతా చేస్తామని చెప్పారు. 40 వేల మంది సైనికులు కలిగిన నాటో రెస్పాన్స్ ఫోర్స్ను ఇప్పటికే అప్రమత్తం చేశారు. అమెరికా సైతం తన 8,500 మంది బలగాలను అలర్ట్ చేసింది.