బిడెన్ బాధ్యతల స్వీకరణ సజావుగా సాగేనా?: 9/11 నాటి పరిస్థితులు: అమెరికా గరంగరం: మిలటరీ జోన్
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా మళ్లీ వేడెక్కింది. గరంగరంగా మారింది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. బుధవారం అమెరికాలో అధికార మార్పిడి చోటు చేసుకోవాల్సి ఉండగా.. రాజధాని వాషింగ్టన్ సహా అన్ని రాష్ట్రాల్లోనూ భారీ ఎత్తున అల్లర్లు, హింసాత్మక పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందంటూ ఆ దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యురో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) హెచ్చరించింది. ముందస్తు జాగ్రత్తలను తీసుకోవాలంటూ ఆదేశాలను జారీ చేసింది. దీనితో అమెరికా పోలీసు, రక్షణ మంత్రిత్వశాఖ అప్రమత్తం అయ్యాయి.
అమెరికా 46వ అధ్యక్షుడిగా ఎన్నికైన డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఎల్లుండి బాధ్యతలను స్వీకరించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో మరోసారి వాషింగ్టన్ సహా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో హింసాత్మక పరిస్థితులు, ఆందోళనలు చెలరేగే అవకాశం ఉందంటూ ఎఫ్బీఐ హెచ్చరికలను జారీ చేసింది. ఈ నెల 7వ తేదీన వాషింగ్టన్లో చోటు చేసుకున్న పార్లమెంట్పై దాడి తరహా ఘటనలు ఈ సారి మరింత విస్తృతంగా చోటు చేసుకోవచ్చని సూచించింది.
జో బిడెన్ బాధ్యతలను స్వీకరణ కార్యక్రమాన్ని సజావుగా సాగనివ్వకుండా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్ మద్దతుదారులు పెద్ద ఎత్తున దాడులు చేసే అవకాశం ఉందంటూ తమకు పక్కా సమాచారం ఉందని పేర్కొంది. ఎఫ్బీఐ ముందస్తు హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని..వాషింగ్టన్ను మిలటరీ జోన్గా ప్రకటించింది రక్షణ శాఖ, వాషింగ్టన్ మొత్తం ప్రస్తుతం మిలటరీ బలగాల ఆధీనంలో ఉంది. పార్లమెంట్ భవనం.. కేపిటల్ బిల్డింగ్, సుప్రీంకోర్టు, ఇతర కీలక, సమస్యాత్మక ప్రాంతాల్లో కనివినీ ఎరుగని భద్రతా చర్యలను తీసుకున్నారు.
కేపిటల్ బిల్డింగ్, సుప్రీంకోర్టు భవనాల వద్ద ఏడు నుంచి ఎనిమిది అడుగుల ఎత్తు ఉన్న ఇనుప బ్యారికేడ్లను అమర్చారు. రౌండ్ ద క్లాక్ విధానంలో సాయుధులైన సైనికులు పహారా కాస్తున్నారు. ఒక్క వాషింగ్టన్లోనే 25 వేలమందికి పైగా నేషనల్ సెక్యూరిటీ గార్డులను మోహరింపజేశారు. ఇదివరకు సివిల్ వార్ నడుస్తోన్న సమయంలో అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించినప్పటి దృశ్యాలు ప్రస్తుతం వాషింగ్టన్లో నెలకొన్నాయి. 9/11 నాటి దాడుల సమయంలో ఏర్పాటు చేసిన భద్రతా చర్యలను ఇవి గుర్తుకు తీసుకొస్తున్నాయని అమెరికా మీడియా అభిప్రాయపడింది.